వ్యోమగాముల వెంట పెసలు, మెంతి విత్తనాలు ఎందుకు తీసుకెళ్లారు?
అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తుతాయా? సూక్ష్మ గురుత్వాకర్షణ (microgravity)లో పెరిగిన మొక్కల్లో పోషక విలువలు ఉంటాయా?;
అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు తమ వెంట ఆహారపదార్థాలను తీసుకెళ్లడం తెలిసిందే. అయితే ప్రతిసారి ఇలా తీసుకెళ్లడానికి బదులుగా..అక్కడ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉందా? సూక్ష్మ గురుత్వాకర్షణ (microgravity)లో మొలకెత్తిన విత్తనాల్లో పోషక విలువలు ఉంటాయా? అని తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకునేందుకు వ్యోమగాముల వెంట పెసలు (Green gram) మెంతి (Methi)విత్తనాలను పంపారు.
ప్రయోగం ఎలా చేస్తారు?
పెసలు, మెంతి విత్తనాలున్న 12 చిన్న కంటైనర్లను అంతరిక్షానికి పంపారు. అక్కడ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వాటికి నీళ్ల పోస్తారు. ఈ గింజలు 2 నుంచి 4 రోజుల లోపు మొలకెత్తే అవకాశముంది. అలా మొలకెత్తిన వాటిని భూమిపైకి తిరిగి వచ్చేటప్పడు తీసుకొస్తారు. తర్వాత ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (UAS Dharwad) వాటిపై పరిశోధన చేస్తారు. భూమిపై మొలకెత్తిన విత్తనాలు, అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు.
వ్యోమగాములకు ఎలాంటి మేలు జరుగుతుందా?
వ్యోమగాములకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవడం వల్ల వాటిని కొంతవరకు దూరం పెట్టొచ్చు. రోగనిరోధక శక్తితో పాటు ఎముకలు ధృడత్వానికి దోహదపడతాయి. కిడ్నీలో స్టోన్స్, గుండె సంబంధిత సమస్యలను రానివ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపే వ్యోమగాములకు మొలకెత్తిన విత్తనాలు బలవర్దక ఆహారం.