పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన లారీ..ఐదుగురి మృతి..

ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు.

Update: 2024-03-12 05:41 GMT
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఊరేగింపుగా వెళ్తున్నపెళ్లి బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. రాయిసేన్‌ జిల్లా సుల్తాన్‌పూర్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా 11 మంది గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పెళ్లి బృందం హోసంగాబాద్‌ నుంచి పిపరియా గ్రామానికి బయల్దేరారు. వీరంతా స్థానిక జాతీయ రహదారిపై ఊరేగింపుగా వెళ్తుండగా.. అటువైపుగా దూసుకొచ్చిన ట్రక్కు బృందాన్ని ఢీ కొట్టింది. పోలీసులు, జాతీయ రహదారి భద్రత సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గాయపడ్డ వారిలో లైట్లు మోసే కూలీలు కూడా ఉన్నారని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు.
కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 సాయం ప్రకటించారు. తెలిపారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు.
Tags:    

Similar News