ఆఫ్రికన్ సాహిత్య దిగ్గజం, కెన్యా మహా రచయిత గూగీ వా థియోంగో (Ngũgĩ wa Thiong’o) మరణించారు.
ఆయన వయసు 87 సంవత్సరాలు. తండ్రి మరణాన్ని ఆయన కూతురు వాంజికు వా గూగీ( Wanjiku Wa Ngũgĩ) అమెరికాలో ప్రకటించారు.
వ్యాసాల, నవలల, నాటకాల ద్వారా ఆయన ఆఫ్రికాని రాజకీయంగా, సాంస్కృతకంగా విచ్ఛిన్నం చేస్తున్న వలసవాదం వికృతరూపాన్ని విశ్వమంతా చూపించాడు. ఆయన సాహిత్య పోరాటం సుమారు ఆరు దశాబ్దాలు కొనసాగింది. ఎన్నో సార్లు ఆయన పేరు నోబెల్ బహుమతికి వెళ్లింది. అయితే, ఎపుడూ ఎంపిక కాలేదు. 2010 లో కచ్చితంగా నోబెల్ బ హుమతి వచ్చేస్తుందని అనుకున్నారు. అయితే, లాటిన్ అమెరికా కు చెందిన మారియో వర్గాస్ లోసా కు వెళ్లింది. దీనికి ‘నాకంటే ఎక్కువ నిరాశ చెందింది నాయింటి చుట్టూ తిరుగుతూ వచ్చిన ఫోటోగ్రాఫర్లు, ఇపుడు వాళ్లని తాను ఓదార్చవలసి వస్తున్నది,’ అని ఆయన చమత్కరించారు.
ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నా, ఇంగ్లీష్ లో కాకుండా తన మాతృభాష గికుయు లో రాయడం మొదలుపెట్టి ఆఫ్రికన్ భాష సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారు. ఆయన ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నారు. గూగీ రెండు దశాబ్దాలకు పైగా కాలిఫోర్నియా-ఇర్విన్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్, తులనాత్మక సాహిత్యంలో ప్రొఫెసర్గా పనిచేశాడు
గూగీ 1938 జనవరి 5న కెన్యాలోని కమిరిజితు (Kamiriithu)లో భూపోరాట చరిత్ర ఉన్న కుటుంబలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన రచనలు చేయడం మొదలుపెట్టారు. ఆరోజుల్లోనే బ్లాక్ హెర్మిట్ ( The Black Hermit) అనేనాటకం రాశారు.
ఆయన మొదటి నవల వీప్ నాట్ చైల్డ్ (1964). తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లీష్ లో వచ్చిన తొలి నవలా ఇదే. 1977లో ఆయన రాసిన రెండు పుస్తకాలు, పెటల్స్ ఆఫ్ బ్లడ్ (Petals of Blood)నవల, న్గాహికా న్దెండా( Ngaahika Ndeenda)నాటకం అప్పటి డేనియల్ అరప్ మోయి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దానితో ఆయన అరెస్టయిజైలుపాలయ్యారు. ఆయన యూనివర్శిటీ ప్రొఫెసర్ ఉద్యోగం పోయింది. విడుదలయ్యాక ఉద్యోగమూ రాలేదు, ప్రభుత్వ వెంటాడం మానలేదు. దానితో ఆయన కుటుంబం ప్రవాసం వెళ్లాల్సివచ్చింది. 2022లో ఆరప్ మోయి ప్రభుత్వం నుంచి తప్పుకున్నాక 2024 ఆగస్టులో మాత్రమే దేశానికి తిరిగొచ్చారు.
జైలులో ఉన్నపుడు ఆయన ఇక ముందు ఇంగ్లీష్ లో కాకుండా తన మాతృభాష గికియు (Gikuyu)లోనే రచలను సాగించాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాసిన మరిన్నిపుస్తకాలు: వీప్ నాట్, చైల్డ్ (1964), డెవిల్ ఆన్ ది క్రాస్ (1980) మరియు విజార్డ్ ఆఫ్ ది క్రో (2006), డిటైన్ డ్ (1981). ఆయనకు క్యాన్సర్ వచ్చిందని 1995 లో తేలింది. అమెరికా, జార్జియాలో ని బూఫోర్డ్ లో మే 28న మరణించారు.
"ప్రఖ్యాత సాహిత్య దిగ్గజం మరియు పండితుడు, భూమి పుత్రుడుయ గొప్ప దేశభక్తుడు, ప్రపంచ సాహిత్యంలో ఆయన పాదముద్రలు చెరగనివి. ప్రొఫెసర్ గూగీ వా థియోంగో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సంతాపం" అని కెన్యాలోని ప్రతిపక్ష నాయకురాలు మార్తా కరువా సోషల్ మీడియాలో రాశారు.