‘తెలంగాణ ఇథనాల్ పాలసీ మారాలి
ఇథనాల్ ప్లాంట్లతో కాలుష్యానికి అవకాశమే లేదన్నది నిరాధారమైనది’;
గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ, దానికి సమీపంలోని మరో 12 గ్రామాల ప్రజలు తమ గ్రామం, పొలాల మధ్యలో ఇథనాల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించేందుకు కంపెనీ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ గత సంవత్సర కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో రాజకీయాలూ, కులాలూ , కాలుష్య ఆందోళనలూ కలిసి ఒక సంక్లిష్ట పరిస్థితులు సృష్టించాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రజలు ఐక్యంగా ఆందోళనలు చేస్తున్నారు.
గత ఏడాదికి పైగా పెద్ద ధన్వాడ ప్రాంత ప్రజలు కూడా తమ గ్రామాల మధ్య ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇథనాల్ ప్లాంట్ వద్దని ఈ గ్రామాల ప్రజలు దీక్షలు చేస్తున్న సమయంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు ప్లాంట్ నిర్మాణానికి ఆపేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రజలు తమ ఆందోళనను విరమించారు. ఈ గ్రామాల ప్రజల ప్రతినిధి బృందాన్ని పరిశ్రమల శాఖా మాత్యులు, ఆ శాఖ కార్యదర్శీ, ఇతర అధికారులు సమావేశపరచి వారి ఆందోళన పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కూడా ఇప్పించారు.
ఈ ప్రాంత ప్రజలు తమకు న్యాయం జరుగుతుందని నమ్మారు. కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా, మూడు నెలల తరువాత హటాత్తుగా కంపెనీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడంతో ప్రజలు సంఘటిత మయ్యారు. వేలాది మంది తరలి కంపెనీ స్థలానికి చేరారు. ఈ సందర్భంగా తలెత్తిన వివాదంలో కంపెనీ బౌన్సర్లు ప్రజలపై దాడి చేసిన ఘటనలో ఒక స్త్రీ తలకు గాయమై, కుట్లు వేయించాల్సి వచ్చింది. కోపంతో ఆగ్రహించిన ప్రజలు పని వారి కోసం కట్టిన గుడారాలను ధ్వంసం చేసి, కంటైనర్ను తగలెట్టారు.
దీనిపై పోలీసులు 40 మంది గ్రామస్థులపై కేసులు పెట్టి, వారిలో 12 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. జూన్ 18 న వారిని కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు రైతుల చేతులకు బేడీలు వేశారు. గతంలో లగ చర్ల ఘటనలో రైతుల చేతులకు బేడీలు వేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టి మందలించినా, తిరిగి అదే తప్పు పెద ధన్వాడ రైతుల విషయంలో చేశారు. గత BRS ప్రభుత్వం కూడా ఖమ్మం రైతులతో ఇలానే వ్యవహరించి, ఫలితాన్ని అనుభవించిందని ఈ ప్రభుత్వం గుర్తించాలి.
పెద్ద ధన్వాడ ఘటన నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖా మాత్యులు శ్రీధర్ బాబు పెట్టుబడుల అంశంపై విలేఖరులతో జరిపిన సమావేశంలో పెద్ద ధన్వాడలో ప్రతిపాదిత ఇథనాల్ ప్లాంటుపై జరుగుతున్న ఆందోళన పై విలేకరుల ప్రశ్నకు జవాబిస్తూ ఆ ప్రాంతంలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తథ్యమని ప్రకటించారు.
ఇథనాల్ ప్లాంట్లతో కాలుష్యానికి అవకాశమే లేదని, . అత్యాధునిక పద్ధతులలో వాటిని నిర్మిస్తారనీ, ప్లాంటుకు సంబంధించిన అన్ని అంశాలపై రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించామనీ, ప్రభుత్వ వివరణతో ప్రజలు సంతృప్తి చెందారనీ కూడా ప్రకటించారు.
ఇథనాల్ ప్లాంట్లను కాలుష్యానికి అవకాశమే లేదన్నది నిరాధారమైనది. మంత్రి గారు చేసిన ప్రకటన కంపనీ యాజమాన్యానికి అనుకూలంగా, బాధిత ప్రజలను మోసగించేదిగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఇథనాల్ ఉత్పత్తి చేసే దేశం అమెరికా. ఆ దేశం ఆధునిక టెక్నాలజీకి కూడా కేంద్రం. అక్కడ కాలుష్య నియంత్రణ సంస్థలు వాయు కాలుష్యాన్ని తొలగించడానికి కంపెనీలపై అనేక నియమాలు పెడతాయి. ఇథనాల్ ప్లాంట్ల నుండి వెలువడే VOC లను తొలగించడానికి థర్మల్ ఆక్సి డైజర్ గానీ, వాటిని తొలగించగలిగే ఇతర బయో టిక్లింగ్ సాధనాలను గానీ వాడాలి. వాటిని వినియోగిస్తే, అవి ప్లాంట్ ల నుండీ వెలువడే వాయు కాలుష్యంలో 95 - 99 శాతం వరకు కాలుష్యాన్ని తొలగిస్తాయి.
ప్రపంచ వనరుల సంస్థ (WRI), జూన్ 10, 2025 నాటి విశ్లేషణ మధ్య అమెరికాలో ఇథనాల్ ఉత్పత్తి, విస్తరణ, సుస్థిరత, మరియు వాతావరణ ప్రభావాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వీరి విశ్లేషణ ప్రకారం, 2021 లో ఈ ప్రాంతంలోని ఇథనాల్ రిఫైనరీలు 17.4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ కు సమానమైన గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేశాయి. ఇది 44 బిలియన్ మైళ్ల డ్రైవింగ్కు సమానం. అదనంగా, ఈ ప్లాంట్లు ఆయిల్ రిఫైనరీ లతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ అసిటాల్డిహైడ్, అక్రోలిన్, ఫార్మాల్డిహైడ్, హెక్సేన్ వంటి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs)ను విడుదల చేస్తాయి, ఇవి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. ఇథనాల్ కోసం వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగు అధిక నీటి వినియోగాన్ని కలిగి ఉండి, భూగర్భ జలాలను క్షీణింపజేస్తుంది. ఇది స్థానిక వ్యవసాయాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది.
అమెరికా ప్రభుత్వ అధికారిక సమాచారం ఆధారంగా 2024 లో విడుదల చేసిన రిపోర్ట్ , (2022 డేటా ఆధారంగా) ను ప్రాతిపదికగా పెట్టుకుని, ఇఐపి (EIP) సంస్థ 191 ఇథనాల్ ప్లాంట్లు, 71 బయో డీజిల్ ప్లాంట్లు, మరియు 13 రెన్యూవబుల్ డీజిల్ ప్లాంట్లు కలిసి 12.9 మిలియన్ పౌండ్ల విష పదార్థాలను వాతావరణంలోకి విడుదల చేశాయనీ, ఇది ఆయిల్ రిఫైనరీలు విడుదల చేసిన 14.5 మిలియన్ పౌండ్లకు సమీపంలో ఉందని తెలిపింది.
తగిన నియంత్రణ పద్ధతులలో 95 – 99 శాతం వరకూ వాయు కాలుష్యాన్ని తొలగించిన తరువాత అదనంగా ఇంత కాలుష్యం విడుదలైందని మనం గుర్తించాలి. నిజానికి భారత దేశంలో, మన రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్లకు ఇచ్చే పర్యావరణ అనుమతులలో యీ వాయు కాలుష్యాన్ని అసలు గుర్తించడమే లేదు. అందుకే ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైన నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు దుర్వాసనలతో తల్లడిల్లుతున్నారు.
ఇథనాల్ ప్లాంట్ వదిలే అక్రోలిన్ (శ్వాస సమస్యలు, ఆస్తమాకు కారణం), హెక్సేన్ (నాడీ మండలం దెబ్బతినడం), అసెటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ లు (క్యాన్సర్ కారకం) వంటి విష రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. అదనంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం పండించే మొక్కజొన్న ఉత్పత్తి, భూసార క్షీణతకు, అడవుల నిర్మూలనకు , ఆవాస నష్టానికి కూడా కారణమవుతుంది. ఇవన్నీ కలిపి భూతాపాన్ని మరింత పెంచుతాయి.
ప్రజలను ఆందోళన పరుస్తున్న ఇథనాల్ ప్లాంట్ ల కాలుష్య సమస్యకు సరైన వివరణ ఇచ్చి ప్రజలను సమాధాన పరచే బదులు, కంపెనీ యాజమాన్యం ఈ సమస్యను కుల సమస్యగా చిత్రించే ప్రయత్నం చేసింది. బీసీ కుల సంఘాల నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయించి , బీసీ లు పరిశ్రమలు నిర్మించి తెలంగాణ ను అభివృద్ధి చేస్తుంటే, ఓర్వలేని కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీల మద్దతుతో దాడులకు పాల్పడుతున్నారు ప్రకటించారు. ఈ వాదన ఆధారాలు లేనిది, ఎందుకంటే ఇప్పటివరకు చిత్తనూరు, దిలావర్ పూర్, పెద ధనవాడ ప్రాంతాలలో ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న వారిలో అత్యధికులు దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలే. వారు కేసులకు గురయ్యారు. రాజ్య హింసకు గురై జైలు పాలయ్యారు.
ప్రజల ఆందోళనలకు ఇథనాల్ ప్లాంట్ ల నుండీ వెలువడే కాలుష్య భయం ఒక ప్రధాన కారణం.పైగా ఈ ప్లాంట్లను నిర్మిస్తున్న ప్రాంతాలలో "రైతులకు ప్రయోజనం, నిరుద్యోగులకు ఉద్యోగాలు" అనే వాదనలు కూడా అబద్ధమని ఇప్పటికే తేలిపోయింది.
ఇప్పటి వరకూ దేశ వ్యాపితంగా ఈ ఇథనాల్ ప్లాంట్ లు ప్రారంభమైన ప్రాంతాలలో స్థానిక కంపనీలు కనీస మద్ధతు ధరలకు నేరుగా రైతుల నుండి వడ్లు, మొక్క జొన్న కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఎఫ్. సి. ఐ నుండి బియ్యం సరఫరా చేసింది. ఇప్పుడున్న కనీస మద్దతు ధరలతో తాము రైతుల నుండీ నేరుగా వరి ధాన్యం, మొక్క జొన్న కొనలేమని, అందువల్ల, ఈ ప్లాంట్ లకు FCI ద్వారా రాబోయే ఐదేళ్ల పాటు చవక ధరలకు బియ్యం సప్లై చేయాలనీ , జన్యు మార్పిడి మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామనీ, అందువల్ల దానిపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయాలనీ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాయి. అలాగే ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశాయి. ఈ ప్లాంట్ ల వల్ల రైతులకు ఏ లాభమూ లేదు.
పెట్టుబడిదారులు ఏ కులం వారైనప్పటికీ, కాలుష్యం అనేది అన్ని కులాలపై సమానంగా ప్రభావం చూపుతుందని కూడా గుర్తుంచుకోవాలి.
అందువల్ల ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ, ప్రభుత్వం స్వతంత్ర ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించాలి. ఫలితాలను ప్రజల ముందు ఉంచాలి. గ్రామాలలో బహిరంగ సమావేశాల ద్వారా ప్రజల ఆందోళనలకు కారణాలను పరిశీలించాలి. ప్రభుత్వ అధికారులు, పర్యావరణవేత్తలు, ప్రజలు , ప్రజా సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులతో ఒక సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి వాస్తవ ఆధారాల మీద, అంతర్జాతీయ నివేదికల మీద ఆధారపడి చర్చించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఇథనాల్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న వారిపై, నాయకులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. పోలీస్ దాడులలో గాయపడినవారికి, అరెస్టైన వారికి న్యాయం కల్పించేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలి.
ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన పెద ధన్వాడ ప్రజల ఉద్యమం, ఆ ఉద్యమంలో జరిగిన సంఘటనలు పర్యావరణ పరిరక్షణ అవసరం , ఆర్థిక అభివృద్ధి నమూనా మధ్య సమన్వయం కోసం మనల్ని ఆలోచింపజేస్తాయి. కులాల కంటే ముఖ్యం కాలుష్య రహిత భవిష్యత్తు. ప్రజల సమస్యలను శాంతి భద్రతల సమస్యలుగా మలచి హింస ప్రయోగించి భయభ్రాంతులను చేసి పరిష్కరించే విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమంజసం కాదు. కంపెనీల ప్రయోజనం కోసం కాలుష్యాన్ని దాచి ప్రజలు ప్రశ్నించడంపై ప్రభుత్వాలు చూపించే అసహనం అప్రజాస్వామికం.