కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడటంలో రేవంత్, మంత్రులు విఫలమయ్యారా?
పౌర సమాజంతో చర్చించి ముందుకు వెళ్ళే లక్షణం రాష్ట్ర క్యాబినెట్ కు లోపించింది.;
2025 జూన్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలలు (సంవత్సరంన్నర ) నిండాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు వచ్చాయి కానీ, స్థిరంగా ప్రభుత్వం నడపడానికి , ఆశించిన స్థాయిలో సీట్లు మాత్రం రాలేదు.
ఈ ఏడాదిన్నర లో 2024 తొలి అర్థ భాగంలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో గత పార్లమెంటు స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ, మొత్తం 17 స్థానాలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలు మాత్రమే గెలుపొందింది. ప్రధానంగా BRS పార్టీ ఓట్ల బదిలీ తో బీజేపీ పార్టీ రాష్ట్రంలో గతం కంటే ఎక్కువగా 8 స్థానాలలో గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి ఓట్లు వేశారు.
2025 తొలి అర్థ భాగంలో జరిగిన ఉత్తర తెలంగాణ లో శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధులు రెండు చోట్ల గెలుపొందారు. హైదరాబాద్ GHMC పరిధిలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ చేయలేదు. బీజేపీ మజ్లిస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి, రెండవ స్థానంలో ఉంది. వీటన్నిటినీ గమనిస్తే, రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి, రెండవ స్థానానికి ఎగబాకడానికి, తద్వారా , రాష్ట్రంలో అధికారం చేపట్టేలా మొదటి స్థానానికి చేరడానికి బీజేపీ సీరియస్ గా ప్రయత్నం చేస్తుందని రుజువైంది.
రాబోయే రోజుల్లో బీజేపీ కి జూనియర్ పార్టనర్ గా మారడానికి BRS పార్టీకి పెద్దగా అభ్యంతరాలేమీ లేవని కూడా, ఆ పార్టీ ముఖ్య నాయకురాలు, మాజీ ముఖ్య మంత్రి KCR కుమార్తె కవిత ఇటీవలి ప్రకటనలు బయట పెట్టాయి. BRS నాయకులు పదేళ్ళ పాటు అనుసరించిన తప్పుడు విధానాలపై, ప్రాజెక్టులపై , అవినీతిపై కమిషన్ విచారణలు కూడా జరుగుతున్న సందర్భంలో ఆ పార్టీ తన భవిష్యత్ రాజకీయ మనుగడ కోసం మరింత దూకుడుగా, చురుకుగా పని చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ , తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తన రాజకీయ ప్రభావాన్ని కాపాడుకోవడానికి, పరిపాలన సజావుగా చేయ వలసి ఉంటుంది. అలాగే నిర్మాణ పరంగా మరింత బలపడాల్సి ఉంటుంది. బీజేపీ , BRS పార్టీలు బలపడకుండా, ఆయా పార్టీలు చేసిన తప్పులను ప్రజలలో బహిర్గతం చేయడం ద్వారా ఆ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపకుండా ఆపాల్సి ఉంటుంది. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడం ద్వారా , ప్రజల మెప్పును పొందాల్సి ఉంటుంది.
కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లా వ్యవహరించడంలో రేవంత్ రెడ్డి , ఇతర క్యాబినెట్ మంత్రులు విఫలమవుతున్నారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట పెరగడానికి బదులుగా, రోజు రోజుకూ దిగజారుతున్నదని గ్రామీణ ప్రజల నుండీ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలు . హైదరాబాద్, దాని చుట్టుపక్కల నగర ప్రాంత అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి అతిస్వల్పమని గుర్తుంచుకుంటే, గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడం ఆ పార్టీ భవిష్యత్తుకు చేటు తెచ్చే అంశమే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీ పని తీరుకు ప్రతిస్పందనగా ఉండ బోతున్నాయి.
వివిధ అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్నది. వాటిని నిజాయితీగా గుర్తించడం ద్వారా, సరిచేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి , ఆయన క్యాబినెట్ - ప్రజలు , ప్రజల సంక్షేమం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కేంద్రంగా ఆలోచించి, ఒక టీం గా పని చేయడం లేదనే అంశం స్పష్టంగా, బహిరంగంగా కనపడుతున్నది. రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న వారు వ్యక్తులుగా తమ ప్రాధాన్యతలను తాము నిర్ణయించుకుని, వాటి చుట్టూ పని చేసుకుంటున్నారు తప్ప, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి వారి మనసు లోకి కూడా రావడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తున్నది.
ముఖ్యంగా ప్రజల సమస్యల పరిష్కారానికి, ఆయా జిల్లాల అభివృద్ధికి గాను, జిల్లాల వారీ ప్రాధాన్యతలు నిర్ణయించి, స్థానిక ప్రజా ప్రతినిధులతో, ప్రజా సంఘాలతో, పౌర సమాజంతో చర్చించి ముందుకు వెళ్ళే లక్షణం రాష్ట్ర క్యాబినెట్ కు లోపించింది. నిజానికి ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ ఆయన కూడా మెట్రో విస్తరణ, మొదటి ప్రాధాన్యతగా దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం , దాని చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళన, దాని చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ పేరుతో వేలాది ఎకరాలను మళ్లించి , రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆయన అభివృద్ధి నమూనా లో కీలక పాత్ర పోషిస్తున్నాయి గ్రామీణ రైతుల నుండీ బలవంతంగా సేకరిస్తున్న భూమిని ఎరగా చూపించి పారిశ్రామిక సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలు, పర్యాటకాభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి , ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేని అందాల పోటీల నిర్వహణ - ఇవన్నీ తాను ఒక ప్రజా నాయకుడిగా ఎదగాల్సిన అవసరాన్ని గుర్తించకుండా చేస్తున్నాయి. ఇవన్నీ చూసి, ప్రజలు ఆయనను దార్శనికత కలిగిన ప్రజా ముఖ్యమంత్రిగా కాకుండా, కేవలం దూకుడు స్వభావంతో వ్యవహరించే , రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ గా చూసే ధోరణి పెరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు చాలా కాలంగా కాంట్రాక్టర్ లు గా , పారిశ్రామిక వేత్తలుగా ఉన్నారు. ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్నా, ఆ ప్రభుత్వం లో చేరి, తమ వ్యాపార, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకునే వ్యవహార శైలి వారి స్వంతం. కాంగ్రెస్ పార్టీ కి ఉండే కనీస సైద్ధాంతిక విషయాలలో కూడా వారికి విశ్వాసం ఉన్నట్లు కనిపించదు. భవిష్యత్తులో ఏ రోజైనా , అధికారం లోకి వచ్చే అవకాశం ఉన్న ఏ పార్టీలో కయినా , జంప్ చేయగలిగిన స్వభావం కూడా వీరికి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళు , కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం పెట్టుబడి పెట్టారు. అధికారంలో ఉన్న కాలంలో ఆ నిధులు తిరిగి జమ చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వీళ్ళు పని ప్రణాళిక చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే, ఓట్ల కోసం వాటిని వెదజల్లితే, మళ్ళీ గెలవచ్చనే రాజకీయ ఆటలో వీళ్ళంతా పండిపోయారని అనిపిస్తుంది.
నిజానికి మోడీ నేతృత్వం లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి నమూనా దక్షిణాదికి మేలు చేసేది కాదు. కానీ ఈ ప్రాంతంలో కూడా తన సన్నిహితులకు ప్రైవేట్ రంగంలో విమానాశ్రయాలు, డ్రై పోర్టులు, రోడ్లు, బ్రిడ్జీలు , రైలు మార్గాలు లాంటి మౌలిక వసతుల నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వడం మోడీ ప్రభుత్వ లక్ష్యం. ఈ కాంట్రాక్టుల కోసం అర్రులు చాచడం, అందుకోసం తమ క్యాబినెట్ స్థానాలను ఉపయోగించుకోవడం ఒక ధోరణిగా వీరిలో కనపడు తున్నది.
రాహుల్ గాంధీ రోజూ ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కాంట్రాక్టర్ల గురించి, ఆర్. ఎస్. ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం అమలు చేసే హిందుత్వ ద్వేష రాజకీయాల గురించి విమర్శలు చేస్తుంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రులు మాత్రం, ఆదానీ, అంబానీ తో వ్యాపార భాగస్వామ్యం పెట్టుకోవడానికి, తాము కోరుకున్న ప్రాజెక్టుల కోసం, మోడీ చుట్టూ, కేంద్ర ప్రభుత్వ మంత్రుల చుట్టూ తిరగడానికి వీళ్ళు వెనకాడరు. ఇందుకోసం , ఆర్. ఎస్. ఎస్ పై చేయాల్సిన సైద్ధాంతిక పోరాటాన్ని, బీజేపీ పై చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని కూడా వదులు కుంటారు. బీజేపీ రాష్ట్రంలో విస్తరిస్తున్నా, బలపడుతున్నా , సంవత్సరంన్నర గడిచినా - ఇంకా ఇప్పటికీ, KCRపై ,KTR పై విమర్శలకే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. వారిపై విరుచుకు పడతారు. ప్రజలను విభజించి పాలించే మోడీ విధానాలపై మాత్రం ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడరు. కాంగ్రెస్ మంత్రులు అనుసరిస్తున్న ఈ పద్ధతులు రాహుల్ గాంధీ ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచడానికి ఉపయోగ పడేవి కావు.పైగా నష్టం చేస్తాయి.
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో కూడా రేవంత్ ప్రభుత్వం పని తీరు , కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతిష్టను పెంచేదిగా లేదు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు ఋణమాఫీ పథకం ఒక మేరకు రైతులకు ఉపయోగపడిన పథకమే అయినా, దానిని అమలు చేసిన తీరు , 2 లక్షల పైన పంట రుణాలను కూడా రద్ధు చేస్తామని హామీ ఇచ్చి నా, ఆ హామీని నిలబెట్టుకోలేని తీరు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమే చేసింది. పెద్ద భూస్వాములకు రైతు భరోసా ఇవ్వబోమనీ, కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా ఇస్తామనీ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదు. 2024 ఖరీఫ్ లో రైతులకు రైతు భరోసా ఇవ్వక పోవడం, రబీ లో కూడా ఇప్పటికీ, కేవలం నాలుగు ఎకరాల వరకే పెట్టుబడి సహాయం చేయడం, ఖరీఫ్ లో సన్నధాన్యానికి బోనస్ ఇచ్చినా, 2024- 2025 రబీలో ఇప్పటి వరకూ బోనస్ చెల్లించక పోవడం , వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీమా పథకం విస్తరిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం, 2024 ఖరీఫ్ నుండీ పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పినా అమలు చేయకపోవడం –ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అంశాలే.
గ్రామీణ రైతులతో ఇటీవల మాట్లాడినప్పుడు, ఇకపై రైతు భరోసా వస్తుందని తమకు ఏ మాత్రం నమ్మకం లేదని ఓపెన్ గా వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయం గ్రామీణ ప్రజలలో కలగడం, స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అంశమే. ధాన్యం సేకరణ సమయంలో అసలు కోతలు ఉండబోవని మానిఫెస్టో లో హామీ ఇచ్చినా, రకరకాల పేర్లతో, రైస్ మిల్లర్లు భారీగా కోత పెడుతున్న విషయం రైతులు అన్ని చోట్లా చెబుతున్నారు. ఫలితంగా రైతులు నుండీ ధాన్యం కొనుగోలు చేసిన మహిళా బృందాలు, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపనీలు కూడా నష్ట పోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ పని తీరు పట్ల వారెవరూ సంతోషంగా లేరు. ఫార్మా సిటీ కొనసాగింపు, వివిధ జిల్లాలలో భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇథనాల్ కంపనీలను వ్యతిరేకిస్తున్న గ్రామీణ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం కూడా గ్రామీణ ప్రజలలో అసంతృప్తిని పెంచుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కి రాజకీయంగా నష్టం చేసే మరో అంశం – అర్హులైన వారికి కూడా గత మూడేళ్లుగా ఆసరా పెన్షన్ లో మంజూరు చేయకపోవడం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా, ఇప్పటికీ దానిని పట్టించుకోకపోవడం. అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతు మహిళలు ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. నెలకు 2016 రూపాయల పెన్షన్ ను , 4016 రూపాయలకు పెంచి ఇస్తామని మానిఫెస్టో లో ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదు. 40 లక్షల మందికి పైగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధి దారులు కూడా ఈ విషయంలో అసంతృప్తి గా ఉన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న ఈ రాజకీయ దెబ్బను ఏ మాత్రం పరిగణనలో ఉంచుకోవడం లేదని అనిపిస్తున్నది.
విద్యా రంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పి, బడ్జెట్ లో కేవలం 8 శాతం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ధి చేసే విషయం ఏ మాత్రం పట్టించుకోకుండా, గత ప్రభుత్వం మార్గం లోనే, మరి కొన్ని స్కూల్స్ ను మూసేశారు. 20 అసెంబ్లీ నియోజక వర్గాలలో 20 కొత్త స్కూల్స్ నిర్మాణానికి మాత్రం 4000 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విద్యాభివృద్ధికి విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా, ఉన్న స్కూల్స్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయకుండా, ఉన్న ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వకుండా, వారి పనిని తగిన పద్ధతిలో పర్యవేక్షించకుండా కాల యాపన చేస్తున్నారు.
రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలను కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. మన దగ్గర ఉన్న విద్యా రంగ నిపుణులను,వారి సలహాలను పట్టించుకోకుండా , స్మార్ట్ విద్య, డిజిటల్ విద్య, సామర్ధ్యాల పెంపు , బాలికల విద్య పేరుతో మన రాష్ట్రానికి చెందని 6 బడా NGO సంస్థలకు ( ఫౌండేషన్ లకు ) బాధ్యతలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒప్పందాలు చేసుకోవడం ఆత్మహత్యా సదృశ్యం. స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని బలోపేతం చేయకుండా ఆ పనిని ఆర్. ఎస్. ఎస్ సంస్థకు దగ్గరగా ఉండే అక్షయ పాత్ర సంస్థ సెంట్రల్ కిచెన్ కు కొడంగల్ నియోజక వర్గంలో పైలట్ ప్రాజెక్టు ఇవ్వడం కూడా సరైంది కాదు. ఇవన్నీ రాజకీయంగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలే. రాష్ట్ర ఉపాధ్యాయులలో, విద్యావేత్తలలో , విద్యార్ధి సంఘాలలో అసహనానికి కారణ మయ్యే విధంగా విద్యా రంగం లో ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ.
వీటన్నిటికీ మించి , రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద రాజకీయ తప్పిదం ముస్లిం ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు. గత అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ, పార్లమెంటు ఎన్నికలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో ముస్లిం ప్రజలు పూర్తిగా వివక్షకు గురవుతున్నారని మెజారిటీ ముస్లిం ప్రజలలో, వారి సంక్షేమం కోసం పని చేస్తున్న సంఘాలలో బలమైన అభిప్రాయం ఏర్పడింది. తాజా మంత్రివర్గ విస్తరణ తో సహా, రాష్ట్ర క్యాబినెట్ లో ముస్లిం లకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం తో ఈ అసహనం మరింత పెరిగింది. రాష్ట్రంలో ముస్లిం ప్రజలపై దాడులు పెరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం కూడా ముస్లిం ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నది. ముస్లిం ప్రజలను ఇంత త్వరగా దూరం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైఫల్యం గానే భావించాలి.
ప్రజాస్వామిక పాలన గురించి ఎన్ని హామీలు ఇచ్చినా, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాలన, పోలీసుల ప్రవర్తన లేకపోవడం, ప్రజలపై, ప్రజా సంఘాల కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను సమీక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయకపోవడం కూడా రాజకీయ వైఫల్యమే .