తెలంగాణలో అల్లుకుపోతున్న రాజస్ధాన్ , గుజరాత్ వ్యాపారులు
మరొక వైపు కార్పొరేట్ విస్తరణ. తెలంగాణలో గ్రామీణ సహకార సంఘాలను ప్రోత్సహించాల్సిన సమయం వచ్చింది.;
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ గత నాలుగు దశాబ్ధాలుగా పని చస్తున్నది. నాలుగు మండలాల పరిధిలో గ్రామీణ మహిళా రైతులను సంఘటితం చేసి 42 గ్రామాలలో బలమైన “సంఘం” నిర్మించారు. మాక్స్ చట్టం క్రింద ఒక సహకార సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాము పండించిన ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి “దుకాణం” కూడా ఏర్పాటు చేసుకున్నారు. విమొబైల్ వాహనం ద్వారా హైదరాబాద్ కు తమ సరుకులను, కూరగాయలను తెచ్చి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే 500 మంది వినియోగదారుల బేస్ ను ఈ సంఘం సమకూర్చుకున్నది. విత్తన బ్యాంకును, అనేక రకాల ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నది.
ఇటీవల ఆ సంఘం నిర్వహణపై రైతు స్వరాజ్య వేదిక బృందం అధ్యయనానికి వెళ్ళి, మీరు బయట నుండీ, ప్రభుత్వం నుండీ ఎటువంటి సహాయాన్ని కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు, “మేము అన్ని పనులూ చేసుకోగలం . కానీ నగరాలు, పట్టణాలలో మా ఉత్పత్తులను కొనే , వినియోగదారులు పెరగాలి. మేము నిరంతరం వారికి అన్ని రకాల సరుకులు సరఫరా చేయగలం. వినియోగదారుల మార్కెట్ ను చేరుకోవడమే మేము ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాల్” అని చెప్పారు. వారి ఆత్మ విశ్వాసం చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇటీవల మేము ఏ సహకార సంఘం దగ్గరకు వెళ్ళినా, ఎక్కువగా మాకు ఇదే జవాబు వినిపించింది.
సాధారణంగా బడా కార్పోరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో, అన్ని బాధ్యతలు ప్రభుత్వమే నిర్వహించాలని అడిగే వాళ్లున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాటి బాధ్యతను అవి తప్పకుండా నిర్వహించాల్సిందే. రాజ్యాంగం నిర్దిష్టంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన బాధ్యతలను ఆయా ప్రభుత్వాలు తప్పకుండా నెరవేర్చాలి . అదే సమయంలో రాష్ట్రాల పరిధిలోకి, కేంద్ర ప్రభుత్వ అక్రమ చొరబాటును కూడా మనం వ్యతిరేకించాలి.
ప్రపంచీకరణ విధానాల తర్వాత ప్రభుత్వాలు ఎక్కువగా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయి. దేశంలోకి నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించాలని కోరుతున్నాయి. రాను రాను ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పరుస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ భారతంలో కూడా ఈ విధానాల దుష్పలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంరంలో సన్న, చిన్నకారు రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. అందుకే రైతులు ఉమ్మడిగా నిలబడి, తమ చైతన్యాన్ని, గొంతును పెంచుకోవాలి. స్వయంగా తమ సహకార సంఘాలను నడుపుకోవాలి. నష్టాలకు కారణమవుతున్న ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, ఆదాయ భద్రత కోసం నేరుగా మార్కెట్ లో తమ బేరమాడే శక్తిని పెంచుకోవాలి. గ్రామాలలో అవసరమైన మౌలిక వసతుల కోసం, ప్రభుత్వాలను గట్టిగా డిమాండ్ చేయాల్సి ఉంటుంది. .
కాకపోతే, ఇవాళ ఉనికిలో ఉన్న సహకార సంఘాలపై చాలామందికి వ్యతిరేకత, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సహకార సంఘాలను విధ్వంసం చేయడంలో రాజకీయ పార్టీల పాత్ర పెద్దది. ఈ పార్టీల వైఖరిని ప్రశ్నించాలన్నా,తప్పుడు ధోరణుల నుండి సంఘాలను బయట పడేసుకోవాలన్నా, రైతులు ఐక్యంగా ఉండాలి. వాటిని తమ సంఘాలుగా స్వంతం చేసుకోవాలి.
గ్రామీణ ప్రజల పట్ల బాధ్యతతో పనచేసే సంస్థలు, వ్యక్తులు ఈ బాధ్యతను తమ భుజాల మీద వేసుకోవాలి. గ్రామీణ ప్రజలలో సహకార సంఘాల నిర్మాణ స్పృహను, వాటిని కాపాడుకునే చైతన్యాన్ని పెంచాలి. కార్పోరేట్ల వ్యతిరేక పోరాటంలో ఈ సంఘాలు తప్పకుండా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బలంగా ఉంటేనే కార్పోరేట్ల దోపిడీని నిజంగా తిప్పికొట్టగలం. మనం వీటి ఉనికిని గుర్తించకపోయినా, వాటిని సరైన దారిలో నడిపించడానికి పనిచేయకపోయినా, కార్పోరేట్లపై మనం చేసే ఉద్యమం సమగ్రం కాదు. రైతాంగ ఉద్యమాలతో, కొన్ని డిమాండ్లను సాధించుకోవచ్చు కానీ, వాటిని అమలు చేయించుకోవడానికి, రైతులు క్షేత్ర స్థాయిలో సహకార సంఘాలుగా నిర్మాణం అవడం అవసరం. తమ అవసరాలను గుర్తించడం ప్రభుత్వాలను అసలైన ప్రశ్నలను అడగడం గ్రామీణ ప్రజలు,సహకార సంఘాలు,ఎఫ్పిఓ లు నేర్చుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం , ముఖ్యంగా కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా 10 వేలకు పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నది. గ్రామీణ ప్రాంతా రైతులలో, ఇతర ఉత్పత్తిదారులలో తమ పార్టీ పట్టును పెంచుకోవడం అనే లక్ష్యం కూడా , బీజేపీ ప్రభుత్వానికి ప్రధానంగా ఉంది. అలాగే బడా కార్పొరేట్ సంస్థల ఒత్తిడితో, విత్తనాలు, ఎరువులు, పురుగు విషాల (వ్యవసాయ ఉపకరణాల) మార్కెట్ ను గ్రామాలకు మరింత విస్తరించడం కూడా కేంద్రం లక్ష్యంగా కనపడుతున్నది. వరి ధాన్యం తప్ప , రైతులు పండించే ఇతర పంటలను, గ్రామాలలో తయారయ్యే ఇతర ఉత్పత్తులను ఈ సంఘాల ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం లేదు.
కేంద్ర సంస్థల ప్రోత్సాహంతో గత పదేళ్లుగా రాష్ట్రంలో ఏర్పడిన ఈ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన దృష్టి పెట్టి, ముందుకు తీసుకు వెళ్ళడానికి పూనుకోవడం లేదు. “పాక్స్” ద్వారా, FCI కోసం ధాన్యం సేకరణ చేయడం తప్ప, వ్యవసాయ రంగంలో ఇతర కార్యక్రమాలను గ్రామాలలో ఇప్పటికే ఉన్న రైతు సహకార సంఘాల ద్వారా చేయడానికి పూనుకోకుండా, ఎక్కువగా మహిళా స్వయం సహాయక బృందాలపై, వారి సంఘాలపై ఆధారపడడానికి పూనుకుంటున్నది.
ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కొత్త రైతు సహకార సంఘాల/ FPO ల ఏర్పాటు విషయంలో, పాత వాటికి సహకారం అందించే విషయంలో పరస్పరం చర్చించుకుని ఒక విధాన పత్రాన్ని ఉమ్మడిగా రూపొందించాలి. ముఖ్యంగా రాజ్యాంగం ఎవరికిచ్చిన బాధ్యతను వారు నిర్వర్తించాలి. లేకపోతే సహకార సంఘాలపై ఆధిపత్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడడం అంతిమంగా రైతుల సహకార సంఘాల స్పూర్తిని దెబ్బతీస్తాయి.
సహకార సంఘాల పునర్నిర్మాణం అవసరం :
గ్రామీణ ప్రజలు ఇప్పటికే వివిధ సహకార సంఘాల రూపంలో నిర్మాణమై ఉన్నారు. వాటి వెనక దశాబ్దాలపాటు అనేకమంది కొనసాగించిన కృషి ఉంది. వీటి బలోపేతానికి ఖర్చు పెట్టిన ప్రభుత్వ నిధులున్నాయి. ఈ సంఘాలలో రైతులు, ఇతర గ్రామీణ ప్రజలు పొదుపు చేసుకున్న నిధులు, సంఘాలకు వాటా ధనంగా చెల్లించిన డబ్బులు ఉన్నాయి. సహకార సంఘాలను నడుపుకోవడంలో పొందిన మంచీ, చెడు అనుభవాలు ఉన్నాయి. గతంలో ఇవేమీ జరగనట్లుగా, మళ్ళీ అవే గ్రామాలలో FPO ల నిర్మాణం పేరుతో చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.
ముఖ్యంగా గ్రామాలలో ఇప్పటికే ఉన్న PACCS, మహిళా సహకార సంఘాల నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. లక్షల సంఖ్యలో వున్న వాటి సభ్యత్వాన్ని గౌరవించాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇతర జీవనోపాధుల వారి సహకార సంఘాలను కూడా గుర్తించాలి. వీటన్నిటి మధ్య, సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖలు సీరియస్ గా ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఒక విధాన పత్రాన్ని, చర్చ , నిర్ణయాల కోసం ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలి.
ఇందుకోసం అవసరమైతే రాష్ట్ర స్థాయి MACS చట్టంలో కొన్న సవరణలు చేసుకోవచ్చు. ముఖ్యంగా సహకార సంఘంలో కుటుంబానికి ఒకరు మాత్రమే సభ్యులుగా ఉండాలి అనే నియమాన్ని తొలగించి, 18 సంవత్సరాలు దాటిన గ్రామీణ రైతులు, ఇతర ఉత్పత్తి దారులు ఎవరైనా సహకార సంఘంలో వాటాదనం చెల్లించి సభ్యులుగా చేరేలా చట్టాన్ని మార్చుకోవచ్చు. సంఘం పాలకవర్గంలో సగం మంది మహిళలు తప్పకుండా ఉండేలా, సంఘం పాలక వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా సవరణలు చేసుకోవచ్చు. సంఘం లక్ష్యాలను విస్తృత పరుచుకోవచ్చు.
గ్రామీణ ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఇప్పుడున్న సహకార సంఘాలను పునర్ నిర్మించాలి. ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో(1000 కుటుంబాలు లేదా 2500 ఎకరాలు) MACS చట్టం కింద ఒక సహకార సంఘం మాత్రమే ఉండాలి. ఇప్పటికే ఎక్కువ సభ్యులు కలిగిన సహకార సంఘాన్ని ప్రాతిపదిక సంఘంగా పెట్టుకుని,మిగిలిన వాటిని వాటిలో విలీనం చేయొచ్చు.
ఈ సహకార సంఘంలోనే పంటలు పండించే రైతులు, ఇతర ఉత్పత్తి దారులు కూడా సభ్యులుగా ఉండాలి. అన్ని రంగాల ఉత్పత్తిదారుల ప్రతినిధులు సంఘ పాలక వర్గం లో భాగంగా ఉండాలి. వారి వారి ప్రత్యేక సమస్యలను ఈ సంఘంలోనే చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సహకార సంఘం నిర్వహణకు మూడు సంవత్సరాల పాటు, మానవ వనరుల సహకారం అందించాలి.
సహకార సంఘాల అధ్యయనంలో భాగంగా మేము ఇటీవల గమనించిన ముఖ్యమైన సమస్య వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు లేకపోవడం. ఈ సమస్య పరిష్కారం కోసం 2007 లో జాతీయ వ్యవసాయ కమీషన్ సూచించినట్లుగా ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో APMC మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయాలి. దాని పరిధిలో ఉన్న గ్రామీణ సహకార సంఘాలు, ఈ APMC లో భాగస్వాములుగా ఉంటాయి. APMC పాలక వర్గాన్ని ఈ సంఘాలు ఉమ్మడిగా ఎన్నుకుంటాయి. ఈ APMC ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్, పంటల డ్రయ్యింగ్ యార్డులు, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, కస్టమ్స్ హైరింగ్ సెంటర్లు ఉండాలి. చిన్న కస్టమ్ హైరింగ్ సెంటర్లు గ్రామ సహకార సంఘం స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి రైతులకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలను APMC ద్వారా సేకరించి, గ్రామ స్థాయి సహకార సంఘాలకు సరఫరా చేయవచ్చు. అయితే , ఈ సంఘాలు, తమ కు అవసరమైన మౌలిక వసతుల నిర్మాణం కోసం పెట్టుబడి పెట్టగలిగిన స్థితిలో లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు APMC నిర్వహణలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెట్టాలి. APMC ఆధ్వర్యంలో అన్ని సహకార సంఘాల FPO ల భాగస్వామ్యంతో పంటల ప్రణాళిక కూడా చేసుకోవచ్చు. గ్రామీణ సహకార సంఘాల ద్వారాఈ పంటల సేకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు.స్థానిక రిటైల్ మార్కెట్ కూడా నిర్వహించుకోవచ్చు .
రెవెన్యూ , వ్యవసాయ, ఉద్యాన, మత్స్య,పశు సంవర్ధక,గ్రామీణ అభివృద్ధి శాఖలన్నీ ఈ APMC ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉమ్మడిగా సేవలు అందించవచ్చు. రైతు వేదిక భవనాలను గ్రామ సహకార సంఘాలకు అప్పగించవచ్చు.
ఇప్పటికీ సహకార సంఘాలు లేని గ్రామ పంచాయతీల్లో మాత్రమే కొత్త సహకార సంఘాల నిర్మాణం జరగాలి. దశాబ్ధాలుగా సహకార సంఘాలు ఉన్న గ్రామాలలో కొత్త ఎఫ్పిఓ ల నిర్మాణం చేయడం సమయాన్ని, వనరులను వృధా చేయడమే.
కాకపోతే మండల, జిల్లా స్థాయిలో, సహకార సంఘాల ఫెడరేషన్ ల ఏర్పాటుకు ప్రయత్నం చేయవచ్చు. కొన్ని ఉత్పత్తుల కోసం రాష్ట్ర స్థాయి ఫెడరేషన్ లు కూడా అవసరం పడొచ్చు. ఆయా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ ఫెడరేషన్ లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించాలి.
రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఏర్పడి ఉన్న FPO ల నిర్వహణలో సమస్యలను పరిష్కరించడానికి నూతన మార్గ దర్శకాలను జారీ చేయాలి. స్థానిక FPO లపై విధించిన జరిమానాలను పూర్తిగా రద్దు చేయాలి. ఇప్పటికే వసూలు చేసిన జరిమానా మొత్తాలను కూడా ఆయా సంఘాలకు రీయంబర్స్ చేయాలి. ఈ సహకార సంఘాలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ , ఇతర ఫర్నీచర్, రాష్ట్ర బడ్జెట్ నుండీ సమకూర్చాలి.
రైతులు పండిస్తున్న పంటలను, ప్రాసెస్ చేసుకోవడానికి తగిన ప్రాసెసింగ్ యూనిరట్లను సమకూర్చాలి. ఇతర గ్రామీణ చేతి వృత్తుల ఉత్పత్తులను మెరుగులు దిద్దాలి. పాలు, మాంసం, గుడ్లు, చేపలు లాంటి ఉత్పత్తులకు కూడా సరఫరా చైన్ బలోపేతం చేయాలి. గ్రామాలలో, ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ఆధారిత కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి సహకారం అందించాలి.
రాజస్తాన్ , గుజరాత్ వ్యాపారులు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వరకూ చేరుకున్నారు. తమ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దూరాల నుండీ చవక ధరలకు ఉత్పత్తులను తెచ్చి, స్థానిక ఉత్పత్తులకు సరైన మార్కెట్ లేకుండా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మన సహకార సంఘాల ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో,రాష్ట్ర రాజధాని స్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ఈ దుకాణాలను నిర్వహించే బాధ్యత స్థానిక మహిళా బృందాలకు అప్పగించవచ్చు. తద్వారా, గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగ సంక్షోభం కూడా సమసి పోతుంది.
స్థానిక సహకార సంఘాలు ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా, వాటికి బ్యాంకుల నుండీ వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చాలి. రాష్ట్ర బడ్జెట్ నుండీ ఈ వడ్డీ రాయితీలను బ్యాంకులకు చెల్లించాలి. సహకార సంఘాల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల పరిధిలో వివిధ కోర్సులను తక్షణమే ప్రారంభించాలి.