ఒక వేళ సుదర్శన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినట్టే...
జస్టిస్ సుదర్శన రెడ్డి తీర్పులు అర్థమయితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతారు...
ఈ మధ్య ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి రాజీనామా చేసారు. అదే మిస్టరీ. వెంటనే ఎన్నికలు జరగాల్సిందే. మరి మనది ప్రజాతంత్రం కనుక, మనందరికీ స్వాతంత్ర్యం ఉంది కనుక! మనకు రిపబ్లిక్ ఉంది కనుక, తప్పనిసరిగా ఉప రాష్ట్రపతి పదవి ఉండవలసిందే. ప్రహసనం వంటి ఎన్నికలు మొదలై పోటీ ప్రారంభమైంది.
మన తాజా మాజీ ఉపరాష్ట్రపతి కన్నా ఎక్కువగా తీసేసిన తాసీల్దార్ (తీతా) ఎక్కువ విలువ ఉంటుందా ఏమి? (మాయాబజార్ తరువాత కొత్త పదాలు సృష్టించిన వారిలో తీతా అనే అద్భుత పదాన్నిపుట్టించిన వారు బాపు రమణ). తుమ్మితే ఊడి పోయే గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవి అయినా సరే, వారికి రాజ్యాంగ హోదా ఉంటుంది. అయినా కొత్త అభ్యర్థులు బిజెపి, కాంగ్రెస్ పెద్దలు తదితర మిత్రులు ఒకరినొకరు నిందలు ఎప్పుడో మొదలైంది.
అర్బన్ నక్సలైట్
జస్టిస్ (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డి నక్సలిజంకు సహాయం చేసినవాడు అని సాక్షాత్తూ హోం మంత్రి గారు సెలవించారు. పూర్తిగా అర్బన్ నక్సలైట్ అనలేదు కాని, దాదాపు అంతపని చేసారు. ఈ ఆరోపణపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ‘‘సాల్వా జుడుం తీర్పును నేను ఇవ్వలేదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రమే’’ అని స్పష్టం తేల్చారు.
సుప్రీంకోర్టు తీర్పును ఒకానొక జడ్జిగారు ఇచ్చారనడం ఏమాత్రం సరికాదు. బిజెపి వ్యతిరేకులు బిజెపి అభిమానులు ఏవైనా అనవచ్చు. సంక్లిష్టమైన తీర్పులు చదవజాలని మేధావులు, అర్థం కాని తదితర విద్యావంతులు, కేవలం నాలుగేళ్లపాటు డిగ్రీ చదవగానే నెలనెలా పాకేజ్ జీవితం, జీతం సాధించిన అదృష్టవంతులు, మిగిలిన వారు జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సలైట్ అని నిందిస్తూ ఉంటారు. దీన్ని విమర్శ అనడానికి వీల్లేదు. ఇవి తిట్లు. సమాజం గురించి తెలియని వాళ్లు, క్రికెట్ ఆడకుండా, టీవీలో క్రికెట్ ముందు కూచుని, సాఫ్ట్ వేర్ సెలవు తీసుకుని, ఆదివారమే అయితే వేడివేడిమిరపకాయి బజ్జీలు తిని ఎంజాయ్ చేసి కాలక్షేపం చేసే బాధ్యతారహితులకు ఈ సమస్యల గురించి తెలియదు. వారు పత్రికలు చదవరు. ఎడిట్ పేజి ఎందుకు దండగ అన్నట్టు సినిమా తిప్పి పేజీ మార్చేస్తారు. ఇంకే పేజీ చూడరు. ఏవీ వినరు.
ఓట్ చోరీ (Vote Theft) తెలియని వీరులు
ఇక మన ఓటు. అన్నింటికన్నా దారుణమేమంటే వయోజనులు కనీసం ఓట్లు వేయరు. ఓటు ఉందో లేదో కూడా మిడిల్ క్లాస్ పెద్దలు వెతుక్కోరు. 140 కోట్ల మంది జనాభా మన దేశం మనదేశం అంటూ ఛాతీ పెంచుకునే ఆ మొగాళ్లలో చాలా మంది ఓట్లు వేయరు, కనీసం వోట్ చోరీ అంటే ఏమిటో ప్రయత్నంచేయరు. తెలుసుకోరు. గ్రామాల్లో సామాన్యజనం మీద పడి దోపిడీ చేసే నేరాళ్లయిన నేతలను వ్యతిరేకించి పోరాడే దమ్ము ఎవరికైనా ఉంటుందా?
సమాజంలో రేపిస్టులనుంచి రక్షించే వీర శూర హీరోలు కేవలం సినిమాల్లో మాత్రమే కనపడతాం. ఎక్కడో దర్నా లో కొద్ది సేపు నిలబడిఫోటో తీయించుకున్న వెంటనే వెళ్లిపోయి, ఆ వారిపై పోరాడినట్టు నటించే వారు ఎంఎల్యేలూ ఎంపీలు అయిపోతూన్నారు. మరొక వైపు అభిమానుల హీరోల సినిమాలు పది వేల రూపాయలైనా సరే తగలేసి ధియేటర్లో చిప్స్ తింటూ తనివి తీరగా ఆనందించే వాళ్లు ఎక్కువవుతున్నారు. ఇక ఎలెక్షన్ కమిషన్ అనే ఈసి బృందంలో సాగుతున్న వింత విడ్డూరాల గురించి ఆలోచించే తీరికి ఎక్కడుంది?
శకుని చాణక్యం ముందు ఎవరు గెలుస్తారు?
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎదురొగ్గి నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్ ఎన్ డి ఏ అభ్యర్థి అయిన సి పి రాధాకృష్ణన్ ఢీ అంటున్నారు. చాణక్యంలో నిపుణులైన శకుని తో దుష్టచతుష్టయం సహా 100 మంది కౌరవులు గెలుస్తారు, గ్యారంటీ. వైస్ ప్రెసిడెంట్ పోటీలో వోట్ చోరీ కూడా జరుగుతుందో లేదో? క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఫిరాయింపులు కేసులు రావచ్చు. హటాత్తుగా పార్టీ మార్చిన మహానుభావులు కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వైపుకు మారిన 10 మంది బి ఆర్ ఎస్ ఫిరాయింపు వీరులు ఇటు ఓట్లు వేస్తారు. సిగ్గు విషయం పక్కనుంచితే, వేసినా వేయకపోయినా కేసులు పెడతారు. ఓడిపోయినా, గెలిచినా ఫరవాలేదు. వారికే అవసరమూ లేదు.
ఆ 11 తో కుమ్మక్కయిన ముగ్గురు
క్రికెట్ లో 11 మంది ఇద్దరు అంపైర్ లు (మూడో కెమెరాతో) కూడా, ముఖ్యంగా ముగ్గురు ఎన్నికల కమిషనర్ల వంటి మహానుభావులైనా అధికార పార్టీతో సవ్యంగా అతిసమీపంగా ఏ రకమైన మిరకిల్స్ చేస్తారో చెప్పలేం. ఎన్నికల కమిషన్ (ఇసి) పెద్దలు ప్రతిదానికి అఫిడవిట్ అడుగుతున్నారు. ఫలానా వారు మన ఎంపీగారా లేదా అనీ, ఆధార్ కార్డు ఉందా అనీ నిలదీసి అడగవచ్చు. అసలు నువ్వు వోటర్ వేనా కాదా లేదా అంటూ ఈసిగారే బి సుదర్శన్ రెడ్డి గారిని అడగవచ్చు. ఇవ్వాళటి పరిస్థితి ఇది.
రిగ్గింగా, ఓటింగా, నెగ్గడమే ముఖ్యం
అసలు ఓట్లు పడతాయా? వోట్ చోరీని ఆప గలరా? ఇదివరకు రిగ్గింగ్ అని అనే వాళ్లం. కాని మన హై టెక్ (టెక్నాలజీ) దొంగతనాలు సులువైపోయినాయి. ఆ నిపుణులకు ఖచ్చితంగా తెలుసు. ఇతరులెవరికీ అనుమానం కూడా రాదు. చదవరు. తెలుసుకునే ప్రయత్నం చేయరు.
రిజల్ట్ మాకు తెలుసు
కనుక ఎన్ డి ఎ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి గెలుస్తారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ‘రాష్ట్రపతి’ పదవిలో ఎవరైనా పోటీ గెలువవచ్చు. కాని మనమంతా ఎవడి పనులలో వాళ్లుంటారు. బిజీగా ఉంటాం. ముందు గణపతి నవరాత్రులు, ఆ పదిరోజుల పాటు కాలం గడిచిపోతూ ఉంటుంది. తరువాత దుర్గమ్మ పూజల పదిరోజులు జరుగుతాయి. ఇక వేడుకలన్నీ అయిపోగానే కొత్త ఉపరాష్ట్రపతికి సన్మానాలు చేస్తూ ఉంటారు.
కనీసం ఒక్కడు కూడా ఇంతకుముందున్న ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగ్దీప్ ధంకర్ ఎందుకు రాజీనామా చేసాడు? అని పాత ఉపరాష్ట్రపతిగారో మన రాష్ట్రపతిగారో కూడా అడగరు. రాజీనామా ఎందుకు చేసాడని రాబోయే ఎన్నికయిన ఉపరాష్ట్రపతి కూడా అడగరు. అనవసరం. పొరబాటున గెలిస్తే జస్టిస్ (మాజీ) న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి గారు ఇతర వర్గాలను నిలదీసే అడిగే అవకాశం ఉంది. అదో గొడవ. కాని ఓటరు ఒక్కరంటే ఒక్కరికి ఈ ప్రశ్న రాదు, జవాబు ప్రయత్నం చేయరు.
ప్రైవేట్ సైన్యం
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒక ప్రైవేట్ సైన్యం పుట్టించి దానికి కోయా కమాండ్స్ అంటూ సాల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేకం అని జడ్జి బి సుదర్శన్ రెడ్డి. ఎస్ ఎస్ నిజ్జార్ (ఇద్దరు సభ్యులతో) ఉన్నసుప్రీంకోర్టు ధర్మాసనం అని 2011లో తీర్పు చెప్పింది. ధర్మాసనం అనీ, 2011 సంవత్సరం అనేవి అంశాలు. ఇద్దరు జడ్జిలున్నారు కనుక ఇది రెడ్డిగారి సొంత తీర్పు అనుకోకూడదు. ఒకే జడ్జి నిర్ణయం అనుకున్నా ఇది ఆ జడ్జిగారి సొంత వ్యవహారం కాదు. సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించిన తీర్పు. 2011లో బిజెపి ప్రభుత్వం కాదు కనుక కాంగ్రెస్ పార్టీ వారంటూ సమర్ధించారనడానికి వీల్లేదు. పోనీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆంధ్రపదేశ్ హైకోర్టుకు జడ్జి పదవిలో నియమించినవారే అని అనదలచుకుంటే, తప్పుకదా, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి.
ఫిరాయింపులు లేకపోతే రాజ్యాంగమే ఉండదు
నిజానికి ఫిరాయింపులు లేకపోతే మనం చూసే కొత్త రాజ్యాంగమేదీ ఉండదు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్నో సార్లు పార్టీ మారారు. స్వయంగా చంద్రబాబు పార్టీ ఫిరాయించి ఎన్ డి ఎకు వచ్చి, మళ్లీ మాట, పార్టీ మారిపోయారు. ఏ లెక్కవేసుకుంటారు? ఈనాటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటూ ఇటూ మారి మారి, ఇప్పుడు కాంగ్రెస్ వారు గందరగోళం. చంద్రబాబు అటూ, జగన్ రెడ్డి గారు ఇటూ కూడా ఎన్ డి ఎ ను సమర్థించినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ ను బిజెపిని వ్యతిరేకించి బి ఆర్ ఎస్ నేత కేసిఆర్ ఇటువైపూ ఓటు వేయకపోవచ్చు. ఈ మధ్యలో సాల్వాజుడుం తీర్పు గురించి ఏ లెక్కలో వేసుకుంటారు?
మురికి డబ్బు
ఒకటీ రెండు లక్షల కోట్లు కాదు. భారతదేశాన్ని కొల్లగోట్టిన యు ఎస్ డి 462 బిలియన్ నల్ల డబ్బు కేసు సంగతేమిటి. మన మతం మత్తులో ఎన్నికల వాగ్దానాలు ఎప్పుడో మరిచిపోయారు. ఇది బిజెపి ఖాతాలో వేస్తారా లేక కాంగ్రెస్ కా? కేవలం నల్లడబ్బు ని ప్రపంచంనుంచి పట్టి బంధించి, బిజెపి భారతదేశానికి తెచ్చుకోగలిగితే వరసగా గెలవడం సాధ్యమే కదా. ఇంతమందిలో సుప్రీంకోర్టులో నియమితులైన ఒక అద్భుతమైన జడ్జి అని ప్రశంసిస్తూ సుదర్శన్ రెడ్డికి కనీసం పద్మవిభూషణ్ ఇవ్వాలి కదా. ఆ లెక్కన సుదర్శన్ రెడ్డి గారు మన రాష్ట్రపతి కావాలి. ఈ చరిత్రాత్మకమైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి తీర్పు గనుక పూర్తిగా అర్థమయితే, ఉపరాష్ట్రపతి పోటీలోఎన్ డి ఎ మిత్రులు ఏకాభిప్రాయంగా ఓట్లువేసి గెలిచి తీరాలి. సరే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావన అనవసరం. సుదర్శన్ రెడ్డి పేరున ఈ దేశాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు తీర్పు నిజంగా అమలు చేయదలచుకుంటే బిజెపి ఎన్నడూ ఓడిపోవడానికి వీల్లేదు?
అది సరే, చివరకు అయోధ్యలో అతిభవ్యమైన రామమందిరం అద్భుతంగా నిర్మించడం కోసం, ఒక మాజీ ఛీఫ్ జస్టిస్ కు ఎంపీ పదవి ఇవ్వడం కోసం తహతహలాడించే, దిగజారే అవసరం వచ్చే ఉండదు కాదుకదా.
ఎవరని, ఏమని ఏం లాభం? ఆ సిద్ధాంతాలు, సూత్రాలు ఇప్పుడెక్కడున్నాయి?
కనుక, గెలుపు ఓటమి గురించి తెలియని మిస్టరీ ఏమీ లేదు. జస్టిస్ (రిటైర్డ్) బి సుదర్శన్ రెడ్డి ఓడిపోవడం పక్కా. కాని నిజంగా గెలిచేది సుదర్శన్ రెడ్డి గారే.