రాబోయే ఐదేళ్లలో మరో 75వేల మెడికల్ సీట్లు..
‘భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఇతర దేశాలతో పోల్చవద్దు’ - జేపీ నడ్డా..;
రాబోయే ఐదేళ్లలో వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను మరో 75 వేలకు పెంచుతామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. మానసిక ఆరోగ్య విద్య (mental health education), వృద్దాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల(Geriatrics)పై లోతుగా పరిశోధన జరగాల్సి ఉందని, ఆ దిశగా వైద్య విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. కేఎల్ఈ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ స్నాతకోత్సవంలో నడ్డా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను క్రమేణా పెంచుకుంటూ వచ్చామని చెప్పారు. అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్యను 45 వేల నుంచి 1.18 లక్షకు పెంచామని గుర్తుచేశారు.
దేశంలో 1.4 బిలియన్ల ప్రజలకు వైద్య సేవలందిస్తున్న భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఇతర దేశాలతో పోల్చవద్దని వైద్య విద్యార్థులను కోరారు. "మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా పటిష్టమైనది. పోలియోను నిర్మూలించడంలో విజయం సాధించాం. అలాగే కుష్టు వ్యాధి నిర్మూలనకు కూడా చాలా దగ్గరగా ఉన్నాం. అమెరికాలో కరోనా సర్టిఫికెట్ కావాలంటే కాగితం మీద రాసిస్తారు. కాని ఇండియాలో దాన్ని మీ మొబైల్లో పొందుతారు. అదే డిజిటల్ ఇండియా. దీన్ని మీరు గమనించాలి,’’ అని పేర్కొ్న్నారు.