పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్.. హైదరాబాద్ స్టేషన్లో హాహాకారాలు
హైదరాబాద్ నాంపల్లిలో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఐదో నంబర్ ప్లాట్ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది
కొత్త సంవత్సరం మొదలై పది రోజులైందో లేదో అప్పుడే రైలు ప్రమాదాలు మొదలయ్యాయి. ఒడిషా ప్రమాదం మది నుంచి తొలిగిపోకమునుపే హైదరాబాద్ నాంపల్లిలో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 50 ప్రయాణీకులు గాయపడ్డారు. నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఐదో నంబర్ ప్లాట్ఫాంపైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయలైన పది మందిని లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.
రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది.
కొంతమందికి గుండెపోటు రావడంతో లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి పొన్నం ఆదేశం
నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.