ఢిల్లీలో బాగా పడిపోయిన గాలి నాణ్యత..
ఇంటి నుంచి పనిచేయాలని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆదేశాలు జారీ..
ఢిల్లీ(Delhi)లో గాలి నాణ్యత(AQI) బాగా పడిపోయింది. ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు AQI 462గా నమోదయ్యిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) పేర్కొంది. నగరమంతా దట్టమైన పొగమంచు ఆవహించింది. వాహనాలు విడుదలచేసే కాలుష్యం, వరి-గడ్డి దహనం, పటాకులు కాల్చడంతో గాలి నాణ్యత బాగా పడిపోయింది.
క్షీణిస్తున్న గాలి నాణ్యత దృష్ట్యా.. ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ కొన్ని సూచనలు చేసింది. అన్ని పాఠశాలల్లో తరగతులను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఆదేశించింది. ఇక కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) GRAP కింద స్టేజ్-IV చర్యలను తక్షణం అమల్లోకి తెచ్చింది.
వర్క్ ఫ్రం హోమ్..
ప్రభుత్వ కార్యాలయాలకు 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు కావాలని, మిగతా 50 శాతం మంది ఇంటి నుండే పని చేసేలా విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. అయితే విభాగాధిపతులు కార్యాలయానికి తప్పక హాజరు కావాలని పేర్కొంది.
ప్రైవేట్ కార్యాలయాలు కూడా తమ సిబ్బందిలో 50 శాతం మందిని మాత్రమే కార్యాలయానికి వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం కోరింది. మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించింది. అత్యవసర సేవలయిన ఆస్పత్రులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, అగ్నిమాపక సిబ్బంది, జైళ్లు, ప్రజా రవాణా, విద్యుత్, నీరు, పారిశుధ్యం, మునిసిపల్ కార్యాలయ సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బందికి మినహాయింపు లేదని స్పష్టం చేశారు.
AQI లెక్కలు..
0–50: మంచిది
51–100: సంతృప్తికరం
101–200: మధ్యస్థం
201–300: పేలవం
301–400: అతి పేలవం.
401–500: తీవ్రం