ఢిల్లీలో మోగిన సైరన్..
మాక్డ్రిల్లో భాగంగా మోగించిన భద్రతా సిబ్బంది.. రెండు రోజుల్లో ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో సైరన్ల ఏర్పాటు..;
భారత్ - పాక్(India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ(Delhi) ప్రభుత్వం శుక్రవారం మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించింది. అందులో భాగంగా సైరన్ మోగించింది. పౌర రక్షణ డైరెక్టరేట్ ఐటీఓలోని పీడబ్ల్యూడీ ప్రధాన కార్యాలయంలో ఈ సైరన్(siren)ను పరీక్షించారు. అంతకుముందు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కేవలం మాక్డ్రిల్ మాత్రమేనని, ప్రజలు భయాందోళనకు గురికావొద్దని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ మాక్ డ్రిల్లో రెండుసార్లు సైరన్ను మోగించారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ 40-50 సైరన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పర్వేశ్ వర్మ తెలిపారు. ఒక్కో సైరన్ 8 కి.మీ దూరం వరకు వినిపిస్తుందని చెప్పారు. సైరన్ల ఏర్పాటు రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. అత్యవసర సమయంలో ఇవి 5 నిముషాల పాటు మోగుతాయని, ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్క్షప్తి చేశారు.
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దు జిల్లాలో పాక్ భద్రతా బలగాలు గురువారం (మే 8) క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.