పాకిస్తాన్ ది అత్యాశ, కల్పిత ప్రచారం: హిమాంత బిశ్వ శర్మ
చైనా బ్రహ్మపుత్ర నీటిని ఆపుతుందనే ప్రచారంపై ఆగ్రహం;
By : The Federal
Update: 2025-06-03 13:47 GMT
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ పాకిస్తాన్ పై విమర్శలు గుప్పించారు. భారత్ లోకి ప్రవేశించే బ్రహ్మపుత్రా నదీ జలాలను చైనా అడ్డుకుంటుందని ఇస్లామాబాద్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.
పహల్గామ్ లో పర్యాటకుల మతం అడిగి హిందువులని గుర్తించి కాల్చిచంపిన తరువాత పాకిస్తాన్ తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని న్యూఢిల్లీ అబేయన్స్ లో పెట్టిన సంగతి తెలిసిందే.
భారత్ లో భయాన్ని సృష్టించడానికి ఉగ్రదేశం ఈ విధంగా అసత్యప్రచారానికి పూనుకుందని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. బెదిరింపులను సృష్టించడం పాకిస్తాన్ తాజా వ్యూహమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి నిరాధారమైన, అసత్యాలతో ప్రజలను మోసం చేయడమే వాటి లక్ష్యం అని ఆయన అన్నారు.
What If China Stops Brahmaputra Water to India?
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025
A Response to Pakistan’s New Scare Narrative
After India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat:
“What if China stops the Brahmaputra’s water to India?”…
బ్రహ్మపుత్ర నదీ ఇక్కడ..
బ్రహ్మపుత్ర నది నీటి కోసం భారత్, చైనా దయపై ఆధారపడదని, భారత్ లో నదీ నీటి పరిణామం పెరగుతుందని శర్మ పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదిలోని నీటిలో దాదాపు 30- 35 శాతం మాత్రమే చైనా నుంచి వస్తుంది.
ఈ నీరు ప్రధానంగా టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని హిమానీ నదాలు కరగడం వలన వస్తుందని ఆయన అన్నారు. మిగిలిన 65- 70 శాతం భారత్ నుంచి వస్తుంది. ఇందులో ఎక్కువగా రుతుపవనాల నుంచి కురిసే వర్షం వలన వస్తుందని ఆయన చెప్పారు.
భారీ వర్షపాతం తో సుబన్సిరి, లోహిత్, కమెంగ్, మానస్ వంటి ఉపనదులు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలు నుంచి నీటిని తీసుకువస్తున్నాయి. చైనా జోక్యంతో సంబంధం లేకుండా నదీ శక్తి భారత భూభాగంపై ఆధారపడి ఉంటుంది.
‘‘బ్రహ్మపుత్ర నది నీటి విషయంలో భారత్ ఎగువ దేశంపై ఆధారపడి లేదు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ, భారత భూభాగంలోకి ప్రవేశించిన తరువాత అది బలోపేతం అవుతుంది’’ అని శర్మ అన్నారు.
భయాన్ని తిప్పికొట్టడం..
పాకిస్తాన్ చేస్తున్న వాదనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అదుపు చేయడానికి ప్రయత్నిస్తే వర్షాకాలంలో అది వరదల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుందని, దీనివల్ల అస్సాంకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాల సమయంలో పొంగిపొర్లుతున్న నదుల వల్ల అస్సాం తీవ్రమైన వరదలకు గురవుతోంది.
నిరాశతోనే ఈ వ్యాఖ్యలు..
పాకిస్తాన్ కు దీర్ఘకాలంగా నీటిని అందిస్తున్న సింధు నదీజలాల ఒప్పందం నిలిపివేయడం వలన పాకిస్తాన్ నిరాశ చెంది ఈ ప్రకటన చేసిందని శర్మ పేర్కొన్నారు.
గత 74 సంవత్సరాలుగా సింధు నదీ వ్యవస్థలోని 80 శాతం జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి భారత్ అనుమతి ఇచ్చింది. పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇటీవల కాలంలో ఉగ్రవాద చర్యల కారణంగా ఆ ఒప్పందం నిలిపివేశారు. దీనితో పాకిస్తాన్ బ్రహ్మపుత్ర నదీ జలాలను నిలిపివేయాలనే పగటి కలలు కంటోందని అన్నారు.
జల ఒప్పందాలపై భారత్ తీసుకున్న నిర్ణయం న్యాయమైనదని, చాలాకాలంగా వాయిదా పడిందని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ చర్యను భావోద్వేగ, అశాస్త్రీయ ప్రతిస్పందన, భయపెట్టే వ్యూహంగా విమర్శించారు.
ప్రకృతి భారత్ కు అనుకూలంగా..
బ్రహ్మపుత్ర నది విషయానికి వస్తే భారత సహజ బలాన్ని శర్మ గట్టిగా ప్రస్తావించారు. నదీ వాస్తవ పరిమాణం, శక్తి భారత భౌగోళిక స్థితి, రుతుపవనాల వ్యవస్థ, బలమైన ఉపనదులు నెట్ వర్క్ ఫలితమని ఆయన వివరించారు.
‘‘బ్రహ్మపుత్ర నది ఒకే దానిపై ఆధారపడి ఉండదు. ఇది మన భౌగోళికం, మన రుతుపవనాలు, మన నాగరికత స్థితి స్థాపకత ద్వారా శక్తిని పొందుతోంది’’ అని శర్మ అన్నారు.