కుమారస్వామిని కల్సిన మంత్రి శ్రీధర్ బాబు

ఆ భూములు మాకు అప్పగించండి;

Update: 2025-06-25 14:44 GMT

రాష్ట్ర ఐటీ , పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి కుమార స్వామితో ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి ఈ భేటీలో చర్చించారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగసంస్థలుమూతపడ్డాయని కేంద్రమంత్రికి తెలిపారు. కొన్ని ఉత్పత్తులను నిలిపి వేయడం వల్ల  ఆ భూములు నిరుపయోగంగా మిగిలిపోయాయన్నారు. రాయితీకి అనేక భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఈ భూములు నిరుపయోగంగా ఉండటం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ భూములకు సరైన పరిహారం ఇవ్వకుండానే ప్రయివేటు కంపెనీలకు బదిలీ చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలో బిజీ బిజీ గా గడిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిరుపయోగ భూముల పై ఫోకస్ పెట్టింది. దాదాపు 10 వేల ఎకరాల భూములు నిరుపయోగంగా మిగిలిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈ మేరకు రెవిన్యూ యంత్రాంగం కసరత్తు చేసింది. మార్కెట్ ధర 45 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఈ భూములను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానాప్రభుత్వం ఇదే రకమైన డిమాండ్ తో ముందుకెళుతుంది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి కాసుల పంటే అని చెప్పొచ్చు. కానీ కేంద్రంలో ఎన్ డిఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవు.

అనేక పర్యాయాలు కేంద్రానికి రెవి న్యూ అధికారులు లేఖలు రాస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబు నేరుగా కుమార స్వామిని కలిసారు.

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం  కూడా ఈ భూములపై స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పటి మంత్రి కెటీఆర్ అనేక పర్యాయాలు కేంద్రాన్ని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Tags:    

Similar News