ఒడిశాలో ‘కలరా’ డేంజర్ బెల్స్
వ్యాధి దశ నుంచి అంటు వ్యాధి దశకు చేరుతున్నట్లు అధికారుల ఆందోళన, ఏడుగురు మృతి;
By : The Federal
Update: 2025-06-17 13:38 GMT
ఒడిశాలో కలరా కలకలం చెలరేగింది. ఆ వ్యాధి వ్యాప్తి ఇప్పుడు అంటు వ్యాధి దశకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. కటక్, జాజ్ పూర్, భద్రక్, దెంకనల్, కియోంజర్, కేంద్రపాడతో సహ కనీసం ఆరు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
ఈ వ్యాధికి కేంద్ర బిందువుగా ఉన్న జాజ్ పూర్ లో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. జిల్లాలో మరో 260 మందికి పైగా విరేచనాల వంటి తీవ్రమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.
కలరా బాక్టీరియా
ఈ వ్యాధి వ్యాప్తిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైద్య బృందం జాజ్ పూర్ లో సేకరించిన నమూనాలలో కలరాకు కారణమయ్యే బ్యాక్టీరియో విబ్రియో కలరా ఉన్నట్లు గుర్తించారు.
జాజ్ పూర్ జిల్లాలోని బారీ, ధర్మశాల, వ్యాసనగర్, బింఝర్ పూర్ లో ప్రాంతాలలో స్థానిక పరిపాలన హోటళ్లు, తినుబండారాలు, ఫాస్ట్ పుడ్ స్టాల్స్, మాంసం దుకాణాలు వాటర్ ప్యాకేజింగ్ యూనిట్లను తాత్కాలికంగా మూసేసినట్లు అధికారులు ప్రకటించారు.
వివాహాలు, పుట్టిన రోజులు, మతపరమైన ఆచారాలు, విందులు, సమాజ సమావేశాలపై ఆంక్షలు విధించారు.
ముందస్తు నియంత్రణ తప్పనిసరి..
జాజ్ పూర్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాలుష్యానికి మూలాన్ని త్వరగా గుర్తించి తటస్థీకరించకపోతే ఆ అంటు వ్యాధి రాష్ట్రం మొత్తం వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకూ జాజ్ పూర్ జిల్లా వెలుపల ఎటువంటి వ్యాప్తి లేదని, మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. వ్యాధులను ముందస్తుగా అరికట్టడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
దెంకనల్, కేంద్రపాడ, కియోంజర్, భద్రక్ లలో నీటి నాణ్యత పర్యవేక్షణను ముమ్మరం చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య సౌకర్యాలలో అత్యవసర వార్డు పడకలను సిద్దం చేయాలని, వ్యాప్తిని నియంత్రించడానికి వేగవంతమైన ప్రతిస్పందన బృందాలను నియమించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
ఇతర జిల్లాల్లో..
ఒడిశా టీవీ నివేదిక ప్రకారం.. వ్యాప్తి ఇప్పుడు అంటు వ్యాధి దశకు చేరుకుందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. జాజ్ పూర్ తో పాటు కటక్ జిల్లాలోని టాంగి, చౌద్వార్ ప్రాంతాలు దెంకనల్ జిల్లాలోని భుబన్ నాక్ కేంద్రపారా జిల్లాలోని ఔల్ బ్లాక్, భద్రక్ జిల్లాలని భండారి పోఖారి, ధమ్ నగర్ ప్రాంతాలు, కియోంజర్ జిల్లాలోని ఆనందపూర్ లలో అతిసార కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
సోమవారం కటక్ జిల్లాకు ఈ మహమ్మారి వ్యాపించింది. సఫా పంచాయతీలోని సుందరి గ్రామానికి చెందిన కనీసం 15 మందిలో అతిసారం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. వారిలో చాలామంది ఆసుపత్రిలో చేరి పరిశీలనలో ఉన్నారు. కటక్ జిల్లా యంత్రాంగం జిల్లాలోని పరిధీయ ప్రాంతాలలో నిఘా, నీటి పరీక్ష ప్రయత్నాలను పెంచింది.
ప్రజలకు విజ్ఞప్తి
రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినకుండ శుద్ది చేసిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య అధికారులు సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలను సకాలంలో వైద్య సాయం పొందడానికి వీలైనంత త్వరగా నివేదించాలని ప్రజలను కోరారు.
ఒడిశా ఆరోగ్య కార్యదర్శి ఎస్ అశ్వతి మాట్లాడారు. జాజ్ పూర్ జిల్లాలోని క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. బాధిత వ్యక్తులు చేరిన అనేక ఆస్పత్రులను ఆమె సందర్శించారు. తరువాత జిల్లా అధికారులు, నిఘా బృందాలు, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఒడిశా ప్రభుత్వం పై కాంగ్రెస్ విమర్శలు..
ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కమలదళం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎనిమిది రోజుల పాటు వేడుకలు నిర్వహించినందుకు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోమవారం తీవ్రంగా ఖండిచింది.
‘‘ఒడిశాలో ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం అంటు వ్యాధి లాంటి పరిస్థితి ఉంది. ఉత్సవ్ నిర్వహించడానికి ఇది సరైన సమయమా? పాలన ఉత్సవాలు జరుపుకోవడానికి ఏమి ఉంది’’? అని ఓపీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించడానికి బదులుగా తీవ్రతరం అవుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆయన అన్నారు.