‘తిరుచ్చి’ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న నటుడు ‘విజయ్’
2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు;
By : The Federal
Update: 2025-09-13 05:33 GMT
తమిళనాడు అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు ప్రజలకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టిన కోలీవుడ్ నటుడు, దళపతి విజయ్ తన తొలి ఎన్నికల ప్రచారాన్ని ‘తిరుచ్చి’ నుంచి నేడు ప్రారంభించబోతున్నారు.
2026 ఎన్నికలే లక్ష్యంగా ఆయన ‘తమిళగ వెట్రి కజగం’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ఆయన నేడు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.
విజయ్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రాగానే ఆయన అభిమానులు కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ జెండాలు, టోపీలు, తలపాగాలు ధరించి బారికేడ్లను తోసుకుంటూ విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
తిరుచ్చిలో ఆయన బస చేసే ప్రదేశానికి విజయ్ బయల్ధేరగా దారిపొడవునా అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆయన వాహనం చాలా నిదానంగా కదిలింది.
బస్సు నుంచే ప్రజలకు విజయ్ అభివాదం చేశారు. అనేక వందల వాహానాలు విజయ్ వాహానాన్ని అనుసరించాయి. ఈ ర్యాలీకి పోలీసులు 20కి పైగా షరతులు విధించారు. వచ్చే ఏడాది జనవరిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ డీఎంకే అధికారంలో ఉంది.