‘బీఆర్ఎస్ హయాంలో కమీషన్ల కోసమే ప్రాజెక్ట్లు’
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఇరిగేషన్ చీకటి రోజులను చూసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం కమిషన్ల కోసమే రూపొందించారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల సుదీర్ఘ పాలనలో ఒక్క పూర్తి స్థాయి ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనే కనీస చిత్తశుద్ధి కూడా గత ప్రభుత్వానికి లేదని మంత్రి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీటిపై పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ గట్టిగా డిమాండ్ చేయలేదని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చివరకు మూడు బ్యారేజీలు కూలిపోయే స్థితికి చేరిందని ఆయన మండిపడ్డారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంచి పేరు ఉండేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రూపకల్పనను మార్చి, ట్రంక్ లైన్ల పేరుతో భారీగా కమిషన్లు సంపాదించారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టినప్పుడు వాటిని అడ్డుకోవాలని కేంద్రం అపెక్స్ సమావేశం ఏర్పాటు చేస్తే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమావేశానికి హాజరుకాకపోవడం ఇరిగేషన్ శాఖ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.
గణాంకాలతో బీఆర్ఎస్ వైఫల్యాలను వివరించిన మంత్రి, 2004 నుంచి 2014 మధ్య కాలంలో 715 టీఎంసీల కృష్ణా జలాలు బేసిన్ దాటి వెళ్లగా, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏకంగా 1,442 టీఎంసీల నీళ్లు బేసిన్ దాటి బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. పదేళ్లలో ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయి, ఇప్పుడు కోవిడ్ నెపం చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిచిపోయాయని, వచ్చే మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేస్తామని సభకు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేస్తూ, బడ్జెట్ విడుదలైన వెంటనే కమిషన్లు తీసుకునే అలవాటు తమకు లేదని, పద్మాలయ స్టూడియో తరహా రాజకీయాలు తమకు రావని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి లెక్క చెబుతామని, ఇరిగేషన్ శాఖను చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పదవీకాలం ముగిసేలోపు పెండింగ్లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నీళ్లు, పనులు ఆంధ్రకు ఇచ్చామంటూ బీఆర్ఎస్ సభలు పెట్టి అబద్ధపు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.