మంచి మిత్రుల మధ్య వివాదం లేపిన టీటీడీ లడ్డు

మంచి మిత్రులైన వారి మధ్య లడ్డూ వివాదం పాగా వేసింది. మాటలు తారా స్థాయికి చేరాయి. ట్వీట్లతో ప్రకాష్‌రాజ్‌ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగానే హెచ్చరించారు.

Update: 2024-09-28 14:01 GMT

ప్రకాష్‌రాజ్, పవన్‌ కళ్యాణ్‌లు మంచి మిత్రులు. కలిసి నటించారు. ఒకరనొకరు గౌరవించుకుంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. ఎన్నో విషయాలు చర్చించుకుంటారు. అది సినిమా కావచ్చు. సిద్ధాంతాలు కావచ్చు. రాజకీయాలు కావచ్చు. పుస్తకాలు కావచ్చు. సాహిత్యం కావచ్చు. కళలు, కళాకారులు కావచ్చు. కానీ ఏనాడు వారి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు. పొరపుచ్చాలు తలెత్త లేదు. గత ఎన్నికల వరకు ఆ బంధం అలానే కొనసాగింది. తిరుపతి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చే నాటి వరకు వారి బంధం ధృడంగానే ఉంది. అదంతా గతం. కానీ వారిద్దరి మధ్య పొపుచ్చాలొచ్చాయి. భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. లడ్డూ వివాదం దూరడంతో అవి తారా స్థాయికి చేరుకున్నాయి.

లడ్డూ వివాదం దేశ వ్యాప్తం కావడం, పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షకు దిగడం, హిందూ ధర్మం అపవిత్రమవుతుంటే కోపమెందుకు రావడం లేదు, బయటకు ఎందుకు రావడం లేదని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం తన ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించడంతో ప్రకాష్‌రాజ్‌ ఎంట్రీ ఇచ్చారు. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీట్లతో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. మీరు అధికారంలో రాష్ట్రంలో ఇది జరిగింది. విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. కానీ మీరు అది చేయడం లేదు. వివాదం సృష్టిస్తున్నారు. విద్వేషాలను రెచ్చ గొడుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉన్న మత విద్వేషాలు చాలు. అంటూ తన ట్వీట్ల పరంపరను ప్రారంభించారు.

ప్రకాష్‌రాజ్‌ విలక్షణ నటుడు. బహు భాషాకోవిదుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు, కన్నడతో పాటు పలు ల్యాంగ్వేజెస్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. నటనలోనే కాదు సమాజాన్ని తన కోణం నుంచి అధ్యాయనం చేసిన వ్యక్తి. బలమైన లౌకిక వాది. సర్వ మతాలు సమానమని చాటి చెప్పే వ్యక్తి. అనేక భాషల్లో ఆయన నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందూ మతం పేరుతో విద్వేషాలను ఆయన ఖండిస్తారు. దేశ సౌభాగ్యానికి, ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని నమ్ముతారు. పరమత సహనం ఖచ్చితంగా ఉండాలంటారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే సెక్యులరిజమ్‌ బలంగా ఉన్నప్పుడే సాధ్యమని చెబుతుంటారు. వాటిపైన గొంతెత్తి మాట్లాడుతారు. అది నేరుగా అయినా.. సామాజిక వేదికల ద్వారా అయినా.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంతో చోటు చేసుకున్న మత విద్వేషాలపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తూనే ఉన్నారు. విదేశాల్లో షూటింగ్‌ల్లో ఉన్నానని, వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతీ మాటకు సమాధానం చెబుతనాని ఇప్పటికే సామిజిక వేదిక ద్వారా చెప్పారు.
తాజాగా ఆయన శుక్రవారం మరో సారి స్పందించారు. ఎక్స్‌ వేదికగా మరో పోస్టు చేశారు. ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్‌ ఆస్కింగ్‌’’ అని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.
లడ్డూ వివాదంపై ఆయన పోస్టులు ఇప్పటికే వైరల్‌గా మారాయి. అధికారంలో ఉండి, విచారణ చేపట్టి దోషులను శిక్షించకుండా ప్రజలలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం మంచిది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. దీనిపైన స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ ప్రకాష్‌రాజ్‌పై తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. తన పోస్టులను సరిగా అర్థం చేసుకోలేదని, ఒక సారి చదివి అర్థం చేసుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ను కోరారు. ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్‌పై జనసేన నేతలే కాకుండా హిందూ సంఘాల నాయకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గని ప్రకాష్‌ రాజ్‌ వరుస ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
గురువారం చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌గా మారింది. ‘చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేమిటో జస్ట్‌ ఆస్కింగ్‌ అని పోస్టు చేశారు. గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్‌ ఆస్కింగ్‌ని పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. బెదిరింపులకు, విమర్శలకు తలొగ్గకుండా తన అభిప్రాయాన్ని ఎక్స్‌ వేదికగా ప్రకాష్‌రాజ్‌ పోస్టు చేయడం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగానే మారింది.
Tags:    

Similar News