తుని రైలు దహనం కేసును తిరుగదోడుతున్న చంద్రబాబు నాయుడు
కాపు పెద్ద ముద్రగడ మీద ఎక్కు పెట్టిన బాణం కాపు నేత పవన్ కు తగులుతుందా?;
2016 జనవరి 31 ఆంధ్రప్రదేశ్ తుని పట్టణం సమీపంలో కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో జరిగిన రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసును రీఒపెన్ చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశాన్ని కుదిపేసిన ఈ రైలు దహనం కేసులో కాపు రిజర్వేషన్ ఉద్యమకారుడు, చంద్రబాబు నాయుడి బద్ధవ్యతిరేకి అయిన ముద్రగడ పద్మనాభంతో పాటు అనేక మంది కాపునేతలను ముద్దాయిలను చేశారు. అయితే, ఈకేసును విజయవాడలోని VII అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2023 మే 1న కొట్టి వేశారు. ఆ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ తెలుగు దేశం నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం జీ వొ జారీ చేసింది. దీని మీద కాపునేతలు ముఖ్యంగా వైసిపికి చెందిన నేతలు మండి పడుతున్నారు. ఇది కాపులు మీద కక్ష సాధింపు చర్య అంటున్నారు. అయితే, కాపు నాయకుడు, జనసేన నేత, డిప్యూటి చీఫ్ మినిస్టర్ అయిన వపన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
“భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023 (చట్టం నం. 46 ఆఫ్ 2023) లోని సెక్షన్ 419 కింద రైల్వే కోర్టు జారీ చేసిన నిర్దోషి తీర్పుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతిలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తోంది” అని జీవోలో పేర్కొన్నారు.
ఈ సంఘటన 2016 జనవరి 31, మాజీ, ప్రముఖ కాపు నేత మంత్రి ముద్రగడ పద్మనాభం 'కాపు గర్జన'కు పిలుపు ఇచ్చారు. దీనికి వేలాది మంది హాజరయ్యారు. అపుడు గర్జనలో పాల్గొన్న కొంతమంది తుని రైల్వే స్టేషన్పై దాడి చేసి రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టారన్నది ఆరోపణ.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సెక్షన్ 143 IPC (చట్టవిరుద్ధమైన సమావేశం), సెక్షన్ 147 (అల్లర్లు), సెక్షన్ 148 (ప్రాణాంతక ఆయుధాలతో ఆయుధాలు ధరించి అల్లర్లు), సెక్షన్ 353 IPC (ప్రభుత్వ ఉద్యోగిపై నేరపూరిత దాడి), సెక్షన్ 438 (అగ్ని లేదా పేలుడు పదార్థాన్ని ఉపయోగించి దుష్ప్రవర్తనకు పాల్పడటం), సెక్షన్ 120 (b), ఇండియన్ రైల్వేస్ చట్టం, 1989, ప్రజా ఆస్తికి నష్టం నిరోధక చట్టం, 1984 అభియోగాల కింద ముద్రగడతో పాటు అనేక మంది కాపు నేతల మీద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన ఏడు సంవత్సరాల తరువాత, విజయవాడ రైల్వే కోర్టు 41 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసి, ఈ కేసులో తప్పు దర్యాప్తు చేసినందుకు ముగ్గురు RPF అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దర్యాప్తు అధికారులు 2021లో కోర్టు ముందు చార్జిషీట్ సమర్పించారు మరియు 2021 మరియు 2023 మధ్య విచారణ ప్రక్రియలో న్యాయమూర్తి మొత్తం 25 మంది సాక్షులను విచారించారు
మండిపడుతున్న కాపులు
చంద్రబాబు ప్రభుత్వం కాపులను లక్ష్గా చేసుకుని కక్ష సాధింపులకు దిగిందని వైపిపికి చెందిన మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ తోట నరసింహాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపుల పట్ల కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందని నిన్నటి జీవో చూసి షాక్ కు గురయ్యాను.
"రైల్వే కోర్టు కొట్టేసిన కేసును హైకోర్టులో అప్పీల్ చేయడమంటే కాపుల మీద కక్షసాధింపే. కాపు సామాజిక వర్గం మీద చంద్రబాబు ప్రభుత్వం ఎంత కక్ష పెట్టుకుందో ఏడాది తిరగక ముందే బయట పడింది. కాపు ఉద్యమకారులు..ఆకలి కేకలతో కంచాలు కొట్టిన మహిళ మీద అప్పటి చంద్రబాబు సర్కార్ అక్రమ కేసులు పెట్టింది .ఆ కేసులన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తి వేశారు. కాపు ఉద్యకారులపై కేసులు తిరగతోడడం మంచి పరిణామం కాదు..దీనిని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. రేపు వేలాది మంది కార్యకర్తలతో వెన్నుపోటు దినం నిర్వహిస్తాం,"అని వారు పేర్కొన్నారు.