ఆగస్టు 16న నామినేటెడ్‌ పదవుల ప్రకటన

నామినేటెడ్‌ పోస్టుల ఎంపికలో మంత్రి లోకేష్‌ చక్రం తిప్పుతున్నారు. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీ వ్యూహ కర్త రాబిన్‌ శర్మ నేతలకిచ్చే ర్యాంకింగ్‌ల మేరకే పదవులు వరించనున్నాయి.

Update: 2024-08-14 08:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల ప్రకటన ముహూర్తాన్ని ఖరారు చేశారు. మరో రెండు రోజుల్లో తొలి ప్రకటన చేయనున్నారు. అన్ని పదవుల నియామకాలు ఒకే సారి కాకుండా దశల వారీగా వీటిని భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా శుక్రవారం 15 లేదా, 16 నామినేటెడ్‌ పదవులను ఎవరికి కేటాయించారనేది ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా ఇప్పటికే కంప్లీట్‌ అయింది.

అత్యంత గోప్యంగా..
తొలుత కేబినెట్‌ ర్యాంకు కలిగిన నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తర్వాత తక్కిన నామినేటెడ్‌ పదవుల నియామకాలు చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. అత్యంత రహస్యంగా నామినేటెడ్‌ పదవుల ఎంపిక జరుపుతున్నారు. పార్టీలో సీనియర్‌ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. ఎవరిని నామినేటెడ్‌ పదవులు వరిస్తాయి అనే దానిని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పదవుల ఎంపిక అంతా సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ కనుసన్నుల్లో జరుగుతుండటమే ఈ గోప్యతకు కారణంగా ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
వర్క్‌ ప్రోగ్రెస్‌ కలిగిన నేతలకే..
ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్‌ శర్మ టీమ్‌ను రంగంలోకి దింపారు. లోకేష్‌ మదిలోని నేతల గురించి ఆరా తీస్తున్నారు. ఆ నేతలకు లీక్‌ కాకుండా వారి గురించిన పూర్తి స్థాయి డేటాను ఇప్పటికే సేకరించారు. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడి పని చేసిన వారికి ప్రాధాన్యత కల్పించే దిశగా లోకేష్‌ అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా పార్టీకి పని చేస్తున్నారు. లాయల్టీ, సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్, వర్క్‌ ప్రోగెస్‌ వంటి పలు అంశాలును ప్రాతిపదికగా చేసుకొని నేతలను ఎంపిక చేయనున్నారు. కష్టపడే వారికే పదవి వచ్చే విధంగా లోకేష్‌ పావులు కదుతున్నారు. పార్టీ కోసం పని చేయకుండా ఎన్నికల సయమంలో కేసులు పెట్టించుకోవడం, ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శించడం వంటి అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోపోవచ్చనే టాక్‌ అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల్లో కానీ పార్టీ కోసం కానీ వర్క్‌ ప్రోగ్రెస్‌ కలిగిని నేతలకు నామినేటెడ్‌ పదవులు వరించే విధంగా లెక్కలు వేస్తున్నారు. వీటితో పాటుగా కులాలు, ఉప కులాలు వంటి సామాజిక సమీకరణల అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.
ఐదుగురిలో దీ బెస్ట్‌ అనుకున్న వారికే..
ఎంతో మంది పోటీ పడుతున్న నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో ఒక్కో పోస్టుకు ఐదుగురు చొప్పున ఫిల్టర్‌ చేయనున్నారు. ఈ ఐదుగురిలో దీ బెస్‌ అనుకున్న వారికి పదవి కట్టబెట్టాలని లోకేష్‌ ఆలోచనలు చేస్తున్నారు. మాదిగ కార్పొరేషన్‌కు తిరువూరు నియోజక వర్గానికి చెందిన ఏ కొండూరు మాజీ ఎంపీపీ వాసం మునియ్య రేస్‌లో అగ్ర స్థానంలో ఉన్నట్లు తెలిసింది.
టీటీడీ చైర్మన్‌కు తీవ్ర పోటీ
అన్నింటి కంటే టీటీడీ చైర్మన్‌ పోస్టుకు పోటీ నెలకొంది. జనసేన, బీజేపీ నేతలు కూడా దీని కోసం పోటీ పడుతున్నారు. అయితే టీవీ–5 అధినేత బిఆర్‌ నాయుడుకు ఖరారు కావచ్చే టాక్‌ వినిపిస్తోంది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డికి ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు అత్యంత సన్నిహితుల్లో టాక్‌ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తనకే కావాలని ఆమె పట్టుబడుతున్నట్లు సమాచారం. ఏపీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమాకు, కడప జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌గా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబికి ఇవ్వొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ) చైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజాకు దక్కే చాన్స్‌ ఉందని లోకేష్‌ అత్యంత సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేనకు, బీజేపీకి ఎన్ని పదవులు కేటాయిస్తారనే దానిపైన ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి 70 శాతం, జనసేనకు 25 శాతం, బీజేపీకి 5 శాతం చొప్పున నామినేటెడ్‌ పదవులు ఇచ్చే విధంగా ఆ పార్టీ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చర్చ సాగుతోంది.
Tags:    

Similar News