ప్రజలతో నేరుగా బాబు, పవన్, లోకేష్..

ప్రభుత్వం ప్రజల వద్దకు వెళుతోంది. ఇది ఎంతకాలం.. మొదలు పెట్టినంత స్పీడుగా తుది వరకూ ఏదీ కొనసాగించని పాలకులు తెలుగు వారు. అందుకే ఆరంభ శూరత్వం కాకూడదు.

Update: 2024-06-23 06:21 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం కాస్త రూటు మార్చింది. గతానికి ఇప్పటికి భిన్నత్వం కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిని కానీ, ఇతర మంత్రులను కానీ కలవాలంటే ప్రజలకు కష్టంగా ఉండేది. కానీ ఈ సారి అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం నేరుగా ప్రజల వద్దకే వెళుతోంది. గతంలో చాలా సార్లు ఈ ప్రయోగాలు చేసినా ఎక్కువగా ముందుకు సాగలేదు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నాయకులు, మంత్రులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఓపిగ్గా ఫొటోలు దిగారు. అర్జీలు స్వీకరించారు. ఇకపై ప్రతి వారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తానని మాటిచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రులు కూడా జిల్లాలో పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని, కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్‌లను ఆదేశించారు. తాను కూడా సోమవారం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తానని, ఎక్కడ అనువైన ప్రాంతమనేది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Delete Edit
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికే ప్రజా దర్బార్‌ పేరుతో అర్జీల స్వీకరణ ప్రారంభించారు. ప్రతి వారం మంగళగిరిలోని టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద శనివారం లోకేష్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎక్కువ మంది మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తన ఇంటి వద్దకు ఎవరైనా సమస్యలు చెప్పుకునేందుకు రావొచ్చని లోకేష్‌ చెప్పడం విశేషం. అయితే ముఖ్యమంత్రి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నందున పోలీసులు సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పర్యటనల్లో పరదాలు కట్టుకునే ప్రభుత్వం మాది కాదని లోకేష్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. తిరుమలలో వెంకటేశ్వస్వామిని కుటుంబ సమేతంగా చంద్రబాబు సందర్శించినప్పుడు లోకేష్‌ పరదాలపై విలేకరుల వద్ద సరదాగా జోకులు వేసి అందరినీ నవ్వించారు.
Delete Edit
ఉప ముఖ్యమంత్రి కె పవన్‌ కళ్యాణ్‌ అసెంబ్లీ నుంచి శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రాగా ఆయన కోసం చాలా మంది ప్రజలు అర్జీలు తీసుకుని సమస్యలు చెప్పుకునేందుకు ఉన్నారు. వారిని చూసిన పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఆఫీసు హెల్ప్‌డెస్క్‌ వద్ద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. అర్జీలు తీసుకుని ఒక్కొరితో ఓపిగ్గా మాట్లాడారు. భూ వివాదాలు, క్రైం అంశాలు, స్థానిక సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు వచ్చాయి. ప్రధానంగా వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విజయవాడలో చదువుకుంటున్న మైనర్‌ బాలిక తన కుమార్తె అని, ఆమెను ప్రేమ పేరుతో ఎవరో ట్రాప్‌ చేసి కనిపించకుండా చేశారని, తొమ్మిది నెలలుగా ఆమె జాడ కనిపించలేదని శివకుమారి అనే బాధితురాలు వాపోయారు. మాచవరం పోలీస్‌ స్టేషన్‌ సీఐకి ఫోన్‌ చేసి కేసు వివరాలు తెలుసుకుని బాధితులను తన కారులోనే పోలీస్‌ స్టేషన్‌కు పంపించడం విశేషం. కర్నూలు, గుంటూరు, పల్నాడు, ఎన్‌టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడారు. ప్రతి వారం జన దర్బార్ పేరుతో ప్రజలతో కలిసి వారి సమస్యలు వినే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి చేపట్టనున్నారు.

సచివాలయంలో కూడా అన్ని బ్లాకులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించారు. ఎనిమిదేళ్లుగా తాము సచివాలయంలో పనిచేస్తున్నామని, మేమంతా రాజధానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారమని, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించాలని హౌస్ కీపింగ్ సిబ్బంది విజ్నప్తి చేశారు.


Tags:    

Similar News