మారిన ఇసుక కొనుగోలు విధానం

ఇసుక కొనుగోలు విధానం మారింది. కావాల్సిన వారు సీనరేజీ చెల్లించి తీసుకుపోవొచ్చు. ఎవరికైనా ధర ఒకటిగానే ఉంటుంది. కొత్త మార్గదర్శకాలు ఈనెల 8 నుంచి అమలు కానున్నాయి.

Update: 2024-07-04 05:56 GMT

ఇసుక వివాదం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దుమ్మురేపింది. గత ప్రభుత్వం ఓటమి పాలు కావడానికి ఇసుక పాలసీ కూడా ఒక కారణం. ఈ కారణంగా భవన నిర్మాణాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. కూలీలకు పనిలేకుండా పోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నామినల్‌ ధరకు ఇసుక ఇచ్చే వారు. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా ఇసుక టన్ను ధరను మూడింతలు పెంచింది. పైగా ఇసుక అందుబాటులో లేకుండా చేసింది. దీంతో కట్టడాలు ఎక్కడికక్కడ కునారిల్లాయి. కాంట్రాక్టర్లు దిమ్మరపోయారు. బిల్డర్లు భవన నిర్మాలు కొంత కాలం ఆపివేశారు. కొత్తగా కట్టే వారు వాయిదా వేసుకున్నారు. ఇక సాధారణ వ్యక్తులు ఇల్లు నిర్మించుకుందామంటే టన్ను ఎనిమిది వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు మారనున్నాయి. టన్ను ఇసుక ట్రాన్స్‌పోర్టు చార్జీలతో సంబంధం లేకుండా కేవలం రూ. 88లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులశాఖ అధికారులు కొత్త పాలసీని రూపొందించారు. కొత్త ఆదేశాలు ఈనెల 8 నుంచి అమలులోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇకపై కేవలం రూ. 88 వసూలు చేస్తారు. ఆ మొత్తం స్థానిక సంస్థలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సీనరేజ్‌ ఛార్జి కింద టన్నుకు తీసుకునే రూ.66లు నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతాయి. జిల్లా ఖనిజ నిధి కింద రూ. 19.80 చొప్పున వసూలయ్యే మొత్తం రీచ్‌ ప్రాంత అభివద్ధికి జిల్లా ఖాతాలోకి వెళ్తుంది. ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ. 1.32 గనులశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్‌కు చేరుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విధానంతో పోలిస్తే ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుకు రూ. 287 భారం తగ్గుతుంది.
ఈనెల 8 నుంచి ఇసుక డంపింగ్‌ యార్డుల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ.88తో పాటు ఏ క్వారీ నుంచి ఇసుక తవ్వి డంపింగ్‌ యార్డుకు తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్‌ పాయింట్‌లో లోడింగ్‌ అయ్యే ఖర్చు డంపింగ్‌ యార్డులో తీసుకుంటారు. ఈ ధరను జిల్లా కలెక్టర్లు ఖరారు చేస్తారు.
బోట్స్‌మెన్‌ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను రూ. 625కి విక్రయించారు. ఇందులో బోట్స్‌మెన్‌ సొసైటీకి టన్నుకు రూ. 200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్‌మెన్‌ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు రూ. 200, సీనరేజ్‌ రూ.88 కలిపి రూ. 288కే ఇకపై వినియోగ దారులకు ఇసుక విక్రయం జరుగుతుంది.
సెప్టెంబరు వరకు ఆన్‌లైన్‌ పర్మిట్లు లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబరు నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్‌లైన్‌ పర్మిట్లు జారీచేసి, ఆన్‌లైన్‌ చెల్లింపులు తీసుకురానున్నారు. ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్‌ గనుల శాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓ రూట్‌కు అనుమతి తీసుకొని, మరో రూట్‌లో వెళితే చర్యలు తీసుకుంటారు.
ఇసుక సరఫరా విధానాన్ని పలువురు హర్షిస్తున్నారు. నదులు దగ్గరల్లో లేని ఊళ్లలో ట్రాన్స్‌పోర్టు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఇసుక కొనుగోలు చేసే వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా రద్దు చేసి ఆఫ్‌లైన్‌ విధానంలోనే ఇసుక ఇవ్వాలని, డంపింగ్‌ యార్డుల సిస్టం కూడా రద్దు చేసి క్వారీల వద్ద ఎవరికి కావాల్సిన ఇసుక వారు తీసుకునే విధంగా విధి విధానాలు రూపొందించాలని కొందరు ఇసుక వినియోగ దారులు కోరుతున్నారు.
Tags:    

Similar News