ఫుడ్ ప్రాసెసింగ్‌పై సీఎం ఫోకస్.. ఎంఎస్ఎంఈ పార్కులపై కసరత్తు

ఎన్నికల సమయంలో సంపద సృష్టించి అప్పుల్లో ఉన్న ఏపీకి గాడిన పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారం చేతబట్టినప్పటి నుంచి కూడా ఏపీకి కొత్త పరిశ్రమలను తీసుకురావడానికి, సరికొత్త పరిశ్రమ స్థాపనకు కూటమి సర్కార్ కసరత్తులు చేస్తూనే ఉంది.

Update: 2024-09-12 12:11 GMT

ఎన్నికల సమయంలో సంపద సృష్టించి అప్పుల్లో ఉన్న ఏపీకి గాడిన పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారం చేతబట్టినప్పటి నుంచి కూడా ఏపీకి కొత్త పరిశ్రమలను తీసుకురావడానికి, సరికొత్త పరిశ్రమ స్థాపనకు కూటమి సర్కార్ కసరత్తులు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఆహార శుద్ది ద్వారా విలువ పెంచవచ్చు అన్న అంశంపై అధికారులతో ఈరోజు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహాలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమల ద్వారా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా ఆక్వా పంటలకు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు సహకారం లభిస్తుందని చెప్పుకొచ్చారు సీఎం. ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పనలో చాలా కీలకమని, వీటిని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి అభివృద్ధికి పాటుపడాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి శాఖల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి పనితీరును మెరుగుపరిచేలా, మరింత ప్రభావవంతం చేసేలా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్ఎంఈ రంగం అనేక సవాళ్లతో దెబ్బిన్నదని, ఇటువంటి రంగానికి ప్రభుత్వం తరుపున తగిన ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెప్పుకొచ్చారు.

పరిశ్రమల ఏర్పాటు వేగవంతం

‘‘ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటును వేగవంతం చేయాలి. వాటితో పాటుగా ఆ పార్కుల్లో పూర్తిస్థాయి వసతులు, సౌకర్యాలు అందించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తాం. ప్రతి ప్రాంతంలో అక్కడి రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసుకునేలా కసత్తు చేయాలి. భూములు ఉన్న రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని మల్లోకి తీసుకురావాలి. రాజధానిలో భాగస్వామ్యమైన రైతులకు ఎలాగైతే లబ్ధి చేకూర్చామో.. అదే తరహాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో కూడా రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులకు సూచించారు. ఇలాంటి విధానం పూణే వంటి ప్రాంతాల్లో అమలవుతోందని, వాటిని పరిశీలించి మరింత మెరుగ్గా రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు.

ఆ నిబంధనల తొలగించాలి

‘‘పరిశ్రమల ఏర్పాటు విషయంలో అనేక అర్థం పర్థం లేని నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తించి తొలగించాలి. ఏపీలో పరిశ్రమ పెట్టుకోవాలంటే కావాల్సిన అనుమతులు సులభంగా లభించేలా ఉండాలి. పరిశ్రమ ఏర్పాటుకు నిర్దేశిత సమయంలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. నిర్దేశిత సమయంలో కనుక ఏ అధికారి అయినా, విభాగం అయినా అనుమతి ఇవ్వకుండా అనుమతి ఆటోమేటిక్‌గా లభించేలా సరికొత్త విధానాన్ని అమలు చేయాలి. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ వంటి సదుపాయాలు కల్పించడం ద్వారా చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు కూడా గిరాకీ పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని తెలిపారు.

క్రెడిట్ గ్యారెంటీకి రూ.100 కోట్లు

ఈ సందర్భంగానే డ్వాక్రా మహిళలు వంటి సంఘాలను కూడా ఎంఎస్ఎంఈలతో కలపాలని సూచించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లోనే ఉన్న ఇన్సెంటివ్స్‌ను ఇవ్వాలి. ఈ విషయంలో అధికారులు అంతా కసరత్తులు మొదలు పెట్టాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏడు క్లస్టర్లను పూర్తి చేయాలి. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యాంరెటీ రూ.100 కోట్లు కేటాయిస్తాం. కేంద్ర పథకాల ద్వారా వ్యాపారస్తులకు రుణాలు, ప్రోత్సాహకాలు అందేలా చూడాలి’’ అని అధికారులకు వివరించారు. ఆహార శుద్ధి ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని, తద్వారా వ్యవసాయరంగం బలోపేతం అవుతుందని, ధరలు పలక్క సంభవించే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనువైన పరిస్థితులు

ఏపీలో ఫుడ్‌ప్రాసెసింగ్‌కు అపార అవకాశాలతో పాటు అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయని సీఎం అన్నారు. ఆహార శుద్ది పరిశ్రమ ద్వారా హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్పత్తులకు విలువ కూడా అపారంగా పెరుగుతుందని చెప్పారు. రైతులు తాము పండించే పంటకు వాళ్లే వాల్యూ ఎడిషన్ ఇచ్చుకునే పరిస్థితి కల్పించే విధంగా పాలసీ తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలకు డిమాండ్ ఉంటుందని, వాటిని కూడా ప్రోత్సహించాలని అన్నారు. అన్ని పంటలకు అక్కడిక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, వారి ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

Tags:    

Similar News