గర్ల్స్‌హాస్టల్ సీక్రెట్ కెమెరా వ్యవహారంపై సీఎం ఆగ్రహం.. కాలేజీకి చేరుకున్న మంత్రి

ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా కలకలంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల భద్రతపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Update: 2024-08-30 11:08 GMT

ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా కలకలంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల భద్రతపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ వ్యవహారంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని, వాటికి కూడా చెక్ చెప్పాలని చెప్పారు. రాష్ట్రంలో ఆడపడుచులపై జరుగుతున్న దాడులు అధికం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కేసుల దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యం, జాప్యం అనేవి ఉండకూడదని హెచ్చరించారు. వెంటనే సంబంధిత అధికారులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని, దర్యాప్తు జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థినితులతో మాట్లాడి.. వారికి భరోసా ఇచ్చారు.

భయపడేలా చట్టాలు..

‘‘ఈ ఘటనలో వాస్తవాలను వెలికితీస్తాం. బాధ్యులు ఎవరైనా వదిలి పెట్టం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ఇటువంటి ఘటనలకు పునరావృత్థం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ కేసు దర్యాప్తును కూడా పర్యవేక్షించనున్నారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలి పెట్టకూడదని సీఎం ఆదేశించారు’’ అని తెలిపారు. ‘‘కళాశాలలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సంరక్షణ కల్పిస్తాం. విద్యార్థినుల భద్రత విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారు హాస్టల్ వార్డెన్ అయినా.. కళాశాల యాజమాన్యమైనా కఠిన చర్యలు ఉంటాయి. ఇక ఆడబిడ్డలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే భయపడేలా చట్టాలు తీసుకొస్తాం’’ అని భరోసా ఇచ్చారు.

మన ఇంటి ఆడబిడ్డలే అనుకోవాలి..

ఈ ఘటన విషయంలో విచారణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. ఇప్పుడు కూడా అలానే, అంతే సీరియస్‌గా స్పందించాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ సీక్రెట్ కెమెరా వివాదం నిగ్గు తేల్చాలని చెప్పారు. ‘‘ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థుల ఫిర్యాదును కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణపై కూడా దర్యాప్తు చేయండి. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉన్నట్లు నిర్ధారితమైతే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. విద్యార్థులు ఎవరి దగ్గరైనా ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే నేరుగా నాకే పంపండి. వాటిని బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

భయమొద్దు.. నేనున్నా..

‘‘చిత్రీకరించిన వీడియోల విషయంలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వీడియోలు తీసి ఉంటే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చేయడానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్చింతగా ఉండండి. ఆడబిడ్డల పట్ల త్పుగా ప్రవర్తించారని తేలితే వారు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలి పెట్టం. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను ప్రతి మూడు గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ చేయాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.

Tags:    

Similar News