ఏపీ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దిశ నిర్ధేశం

రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. వారికి దిశా నిర్దేశం చేశారు.;

Update: 2025-03-25 09:24 GMT

ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని ముఖ్యమంత్రి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మొదటిరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలపై మీ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని, మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వతంగా చూపిస్తాయని కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇంకా సమావేశంలో ఏమి చెప్పారంటే..

ప్రజా సంక్షేమం మీ బాధ్యత

సంక్షేమం ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరిస్థాయి వరకు చేరాలి. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను దానం చేసినట్లు కాకుండా గౌరవభావంతో ఇవ్వాలి. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలి. మీరు చేసే ప్రతి పనిని మేము సమీక్షిస్తున్నాం. పౌరులకు అందించే 22 సేవల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మా కోసమే పని చేస్తోందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలి.

డీఎస్సీ మెగా నోటిఫికేషన్

ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పగడ్బంధీగా మెగా డీఎస్సీ నిర్వహించాలి. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే మొదటి సంతకం చేశాం. పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలి. గతంలో రాష్ట్రంలో ఒకేసారి 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. 80 శాతం ఉపాధ్యాయులను మా హయాంలోనే నియమించాం.

విజన్ మనకు ఒక డైరెక్షన్

స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో 10 సూత్రాలు పొందుపరిచాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకూ ప్రణాళికలు ఉండాల్సిందే. జిల్లాలో విజన్ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కలెక్టర్ ఉంటారు. నియోజవకర్గాలకు ఎమ్మెల్యే ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలి. పర్యావరణ, ఇతర అనుమతులకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి.


పాలనకు ప్రజామోదం ఉండాలి

9 నెలల్లో 3వ సారి కలెక్టర్లతో సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రతి త్రైమాసికానికి ఒక సమావేశం పెట్టుకుని రాబోయే 3 నెలలు ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించడానికి మీరు ప్రయత్నించాలి. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసమే జరిగింది. దీంతో ప్రజల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమైంది. ఎన్నికల్లో కూటమికి 93 శాతం స్ట్రైక్‌రేట్ వచ్చింది. దీనికి కారణం విధ్వంస పాలనను ప్రజలు ఆమోదించలేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆశలు కూడా ఎక్కువగానే పెట్టుకున్నారు.

ఆదాయంతోనే సంక్షేమం సాధ్యం

సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అనే మూల స్తంభాలపైనే సుపరిపాలన ఆధార ఉంటుంది. పేదరికం పోయి ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాల అమలు తప్పనిసరి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలి. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే స్థిరంగా కొనసాగవు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పులు తీర్చాలి, వాటికి వడ్డీలు కట్టాలి.

చాలా హామీలు నెరవేర్చాం

దేశంలో ఎక్కడా లేని విధంగా ఫింఛన్‌లు రూ.4 వేలు ఇస్తున్నాం. రూ.200 ఉన్న పింఛన్‌ను 2014లో రూ.2 వేలు చేశాం. ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు ఒకేసారి పెంచాం. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేలు చేశాం. దాన్ని మళ్లీ ఇప్పుడు రూ. 6 వేలకు పెంచాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైనవారికి మానవతా దృక్పదంతో రూ.15 వేలు ఇస్తున్నాం. ఇంతమంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయాలి. అందుకే ప్రతినెలా 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

అన్నా క్యాంటీన్‌లు సందర్శించండి

రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి 204 అన్నా క్యాంటీన్‌లు నెలకొల్పాం. కలెక్టర్‌లు కూడా అన్నాక్యాంటీన్‌లను సందర్శించాలి. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్‌లు ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపులు 10 శాతం కేటాయించాం. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేశాం. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం. బీసీ, ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నాం. ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్తలు సూచించాలి. ఎక్కడా తాగునీరు లేదనే మాట రాకూడదు.

2027 కల్లా పోలవరం నిర్మాణం పూర్తి

పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడినపెట్టాం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. అమరావతి రాజధాని పనులు కూడా చేపట్టాం. ప్రపంచబ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం తీసుకుంటున్నాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌గా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలూ భాగస్వాములయ్యేలా చర్యలు ఉండాలి. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్ చేపట్టాలి. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అమరావతితో ప్రారంభమైంది. అమరావతి రాజధానికి కొత్త రైల్వేలైన్‌తో పాటు, విశాఖ రైల్వేజోన్ సాధించాం.

ప్రయాణం సాఫీగా సాగేలా రోడ్లు

రూ.861 కోట్లతో 20 వేల కి.మీ మేర గుంతలు పూడ్చివేస్తున్నాం. దాదాపు 95 శాతం మేర పనులు పూర్తయ్యాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీ ఇస్తున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళను చేశాం. రూ.4 వేల కోట్లతో 40 వేల పనులను పల్లె పండుగ కార్యక్రమం కింద ప్రారంభించాం. వాటర్ మేనేజ్మెంట్‌పై దృష్టి పెట్టాలి. మే నెలలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తాం. స్కూళ్లు తెరిచేలోపు అమ్మఒడి అందజేస్తాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20వేలు అందిస్తాం.


జీఎస్డీపీ పెరుగుదల తప్పనిసరి

విజన్ అమల్లో రాజకీయ ఒత్తిడిలు తలెత్తకుండా జిల్లాలకు స్థానికేతర అధికారులను జిల్లా ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించాం. జిల్లాల్లో సంపద సృష్టికి ఏం చేయగలుగుతారో ఆలోచించాలి. జీఎస్డీపీ పెరుగుదల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతంది, తద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు. రూ.3.27 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపట్టాం. వచ్చే ఏడాదికి 15 శాతం తగ్గకుండా జీఎస్‌డీపీ సాధించేలా కలెక్టర్‌లు కృషిచేయాలి. 2014-19 మధ్య 13.5 శాతం గ్రోత్ రేట్ ఉంటే 2019-24 మధ్య 10.32 శాతానికి తగ్గింది. 2024-25 మధ్య 12.02 గ్రోత్‌రేట్ సాధించాం. 1 శాతం గ్రోత్ రేట్ పెరిగితే రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. 2047 నాటికి రూ.54.60 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. తలసరి ఆదాయం 2023-24 మధ్య రూ.2.66 లక్షల ఉంటే, 2024-25 మద్య రూ.2.98 లక్షలకు పెరిగింది. స్వర్ణాంధ్ర విజన్‌లో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలనేది మన సంకల్పం.

వ్యవసాయరంగంపైనా దృష్టి పెట్టాలి

ఏపీ అంటే ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుంది. జిల్లాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైన దృష్టి పెట్టాలి. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలి. హార్టికల్చర్‌కు సీమలో మంచి అవకాశాలు ఉన్నాయి. సీమలో ఇప్పుడు డెల్టా కంటే మంచి ఆదాయం వస్తోంది. అనంతపురం ఒకప్పుడు కరువు జిల్లాగా మారుతుంది అనుకున్నాం... కానీ హార్టికల్చర్, పరిశ్రమల రాకతో రాష్ట్రంలో 5వ ఆర్థిక వ్యవస్థగా మారింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ఎనర్జీ పరిశ్రమలు వస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళ్తున్నాం. పర్యాటకంలో 20 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నాం.

బకాయిలు అన్నీ వసూలు చేయాలి

జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలి. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలి. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ శాఖలో ఫిర్యాదుల రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దు. గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపండి. శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్సీలతో కలిసి పనిచేయాలని సూచించారు.

Tags:    

Similar News