పాత ప్రణాళికతోనే అమరాతి నిర్మాణం

అమరావతి నిర్మాణం పాత ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కొత్త ఆలోచనలు ఏమీ లేవు. ప్రపంచం ఏపీ వైపు చూసేలా నిర్మాణాలు జరుగుతాయి, అమరావతి పేరును రామోజీరావు సూచించారు

Update: 2024-07-03 12:51 GMT

అమరావతిలో కొత్త ప్రణాళికలు లేవు. పాత ప్రణాళికలతోనే నిర్మాణాలు మొదలవుతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద భూ సేకరణ ప్రాజెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు సూచన మేరకు అమరావతి పేరును ఏపీ రాజధానికి పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి నిర్మాణంపై ఆయన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

అమరావతి రాజధానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది. మొత్తం నిర్మాణానికి ఇంక ఎంత ఖర్చు కానుంది. ఇప్పటి వరకు ఖర్చు చేసిన దానిలో గత ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల ఎన్ని వందల కోట్లు మట్టిపాలయ్యాయి. అనే అంశాలను ముఖ్యమంత్రి స్వేతప్రతంలో ఎక్కడా పేర్కొనలేదు. అమరావతికి ఉన్న వనరులు, మణిహారంగా ఉన్న కృష్ణాతీరం గురించి వివరించారు. తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా అమరావతి నుంచి వచ్చానని గర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం ఉంటుందని చెప్పడం విశేషం.

2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని చేపట్టింది. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నీరు కార్చింది. ఎవరైతే అమరావతి కావాలని పట్టుపట్టి ఆందోళన చేశారో వారిపై ఉక్కుపాదం మోపింది. చివరకు ఉద్యమకారులు విజయం సాధించారు. ఉద్యమంతో సంబంధం ఉన్న వారు ఎక్కువ మంది ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు.

అమరావతి అనేది దేవతల కాలంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చాం. అంటూ చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చెప్పుకున్నారు. జగన్ ను విమర్శించేందుకు మాత్రమే స్వేతపత్రం విడుదల చేసినట్లు వుంది తప్ప నిర్మాణానికి నిధుల పరిస్థితి ఏమిటి? ఎంతవుతుందనేది ఎక్కడా ప్రస్తావించలేదు.

రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్‌ ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌ ఎక్కడా లేదు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్‌ అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పడం విశేషం.

విభజన సమయంలో లోటు బడ్జెట్‌ఉంది. ప్రాజెక్టు ఏదైనా విన్‌ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లా. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్‌ మనకు మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్‌, నాలెడ్జ్‌, టూరిజం, ఎలక్ట్రానిక్‌, హెల్త్‌ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలోని ఏ నగరానికీ అమరావతి లాంటి సౌలభ్యం లేదు. జగన్‌ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని స్వేత పత్రంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

క్యాపిటల్ మారిస్తే ఏమి జరుగుతుందో జగన్ కు జనం చూపించారు. ఇది దేశానికి కేస్ స్టడీ, అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తాం. ఏం జరిగినా వెనక్కి చూడను. ముందుకే వెళ్తా. న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారు. ఇప్పుడు పెట్టుబడి దారులను రప్పించాలంటే చాలా కష్టపడాలి. మళ్లీ ఇబ్బందులు రావని భరోసా ఏమిటని అడుగుతున్నారు? ఏపీలో అవకాశాలు లేవా, ప్రజలకు తెలివితేటలు లేవా? మన రాష్ట్రం రైస్‌ బౌల్‌ అని దేశ వ్యాప్తంగా పేరుంది. మనకు మంచి భూములు ఉన్నాయి. పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అంచెలంచెలుగా పూర్తి చేస్తాం. అని చంద్రబాబు స్వేత పత్రంలో వెల్లడించారు.

Tags:    

Similar News