జగన్‌దంతా డ్రామానే.. భద్రత అంశంపై హోంమంత్రి

ఇప్పుడు ఆంధ్రలో మాజీ సీఎం జగన్ భద్రతే హాట్ టాపిక్. దీనిపై తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అంత భద్రత కావాలా? అని ప్రశ్నించారు.

Update: 2024-08-06 13:49 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత.. ఇప్పుడు ఆంధ్రలో ఇదే హాట్ టాపిక్. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ జగన్.. హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉన్నా కూటమి ప్రభుత్వం కావాలనే భద్రత తగ్గించిందా? జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి నిబంధనలను సాకుగా చూపుతూ భద్రతను తగ్గించిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. జగన్ అంత భద్రత అవసరమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది పొందడానికి జగన్ ఆడుతున్న గేమ్స్‌లో హైకోర్టులో దాఖలు చేస్తున్న పిటిషన్లు కూడా ఒక భాగమేనని అన్నారు.

పులివెందుల నుంచి ప్రజాదర్భార్‌కు

‘‘టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఇందులో నేను స్వీకరించిన వినత్తులో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దోపిడీలు, దాడులు, అక్రమాలకు సంబంధించే ఉన్నాయి. జగన్ బాధితులు అంతా కూడా పులివెందుల నుంి ప్రజా దర్బార్‌కు వస్తున్నారు. వారందరి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ సందర్బంగానే భద్రతను పెంచాలంటూ జగన్ హైకోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ చురకలంటించారు. జగన్‌కు 980 మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు.

ఓటర్ల సంఖ్యతో సమానం

‘‘980 మంది అంటే ఓ చిన్న గ్రామంలో ఉండే ఓటర్లంత మంది. ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చే సెక్యూరిటీ అంత భద్రతా సిబ్బందిని జగన్ అడుగుతున్నారు. మాజీ సీఎంగా ఆయనకు నిబంధనల ప్రకారం ఎంత భద్రత ఇవ్వాలో అంత సెక్యూరిటీని కూటమి సర్కార్ అందిస్తోంది. ఇప్పుడు తనకు సీఎంగా ఉన్నప్పటి అంత భద్రత కావాలంటూ కోర్టుకెళ్లారు. అంత భద్రత ఎలా ఇస్తాం? అదెలా కుదురుతుంది? కోర్టులో పిటిషన్ వేసుకోండి.. విచారణ జరిపించండి. అంతేకానీ నిబంధనలను కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మాత్రం చేయొద్దు’’ అని సూచించారు.

ఆ విషయం ఐదేళ్ల తర్వాత గుర్తొచ్చిందా..

‘‘తనపై కోడికత్తి దాడి జరిగిందని జగన్‌కు ఐదేళ్ల తర్వాత గుర్తొచ్చిందా. సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉన్నా తన కేసును ఎందుకు పరిష్కరించుకోలేదు. చేతకాలేదా? ఈ కేసు విచారణ కోసం కోర్టు ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఒక కుంటి సాకు చెప్పి హాజరు కాలేదు. దీన్ని బట్టే ఆయన చేస్తున్నదంతా కూడా డ్రామా అని అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదా కోసం మొన్న ఒకసారి కోర్టుకు వెళ్లారు. అది సాధ్యంకాదని అర్థమవడంతో ఇప్పుడు భద్రత అంటూ డ్రామాలు చేస్తున్నారు’’ అని ఘాటుగా స్పందించారు.

Tags:    

Similar News