Horsley Hills | హార్స్ లీ హిల్స్ లో పతంజలి అంతర్జాతీయ యోగా కేంద్రం

యోగా గురువు రాందేవ్ బాబా హార్సిలీహిల్స్ లో గురువారం పరిశీలించారు. దీనిపై పర్యాటక శాఖ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.;

Byline :  The Federal
Update: 2025-06-26 11:23 GMT
హార్సిలీహిల్స్ వ్యూ పాయింట్ నుంచి కనిపించే ప్రకృతి సోయగం (ఫైల్)

చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి సమీపంలో ఉన్న హార్సిలీహిల్స్ ( Horseley Hills )కు ఆంధ్ర ఊటీగా పేరు. రాష్ట్ర గవర్నర్కు వేసవి విడిది కేంద్రం అయిన ఈ ప్రదేశం లో అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గురువారం హార్సిలీ హిల్స్ సందర్శించారు.

మదనపల్లెకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్స్లీ హిల్స్ సముద్రమట్టానికి 4230 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల వేసవిలో కూడా చల్లదనంతో నిండి ఉంటుంది. పూర్తి అటవీ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఈ వేసవి విడిది కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధీనంలో నిర్వహిస్తున్నారు.
పతంజలి యోగ బాబా రాందేవ్ డెహ్రాడూన్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి గురువారం ఉదయం ఆయన హెలికాప్టర్లో మదనపల్లి బీటీ కాలేజీ మైదానం వద్దకు చేరారు. బాబా రాందేవ్ కు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, పోలీసు అధికారులు స్వాగతించారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన కారులో అధికారులతో కలిసి రాందేవ్ బాబా హార్సిలీ హిల్స్ కు చేరుకున్నారు.


మదనపల్లెలో రాందేవ్ బాబాను స్వాగతిస్తున్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, అధికారులు

కాలుష్యం ఏమాత్రం కనిపించని ప్రశాంత వాతావరణంలో చూసిన రాందేవ్ బాబా ముక్తుడయ్యారు. ఇక్కడి చల్లటి ప్రదేశంలోని ప్రకృతి రమణీయతను కూడా ఆయన ఆస్వాదించారు.
"హార్సిలీ హిల్స్ లో అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటుకు ఎంపీగా చేసిన స్థలాన్ని పరిశీలించారు" ఇంతటి చక్కటి వాతావరణం లో యోగా కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉంది అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.
"ముందు చూపుతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం ఎన్ చంద్రబాబు విజనరీ లీడర్" అని యోగ గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన "హార్సలి హిల్స్ పై ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నాం" అని బాబా రాందేవ్ ప్రకటించారు.
ముందస్తు పరిశీలన
హార్సిలీ హిల్స్ లో పతంజలి ప్రతినిధులు బృందం ఏప్రిల్ 14వ తేదీ పరిస్థితుల్లో పరిశీలించింది. ఇక్కడి అటవీ శాఖ అతిథి గృహాలు, ప్రైవేటు రిసార్ట్ లు, పర్యాటకశాఖ హోటల్, గదులను కూడా పరిశీలించింది. రెవెన్యూ గెస్ట్ హౌస్ కు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా పతంజలి ప్రతినిధులు పరిశీలించి, ఇంటర్నేషనల్ వెల్నెస్ సెంటర్ (international wellness centre) ఏర్పాటుకు అనువైన ప్రశాంత, కాలుష్య రహిత ఈ చల్లటి ప్రదేశం అనుకూలంగా ఉందనీ నిర్ధారించారు.
దీంతో యోగా గురువు రాందేవ్ బాబా స్వయంగా హార్స లీ హిల్స్ సందర్శనకు రావడానికి ఆస్కారం ఏర్పడిందని ఆ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలుస్తుంది.
బ్రిటిష్ అధికారి నిర్మించిన బంగ్లా

హార్సలీ హిల్స్ కు మొదట ఉన్న పేరు ఏనుగు మల్లమ్మ కొండ.. మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారని, ఆమెకు ఓ ఏనుగు పండ్లు తెచ్చి ఇవ్వడం ద్వారా సంరక్షించినట్లు ఒక కథనం. ఇప్పటికీ అత్యంత పురాతన ఆలయం కూడా ఉంది.
వేసవి విడిది కేంద్రంగా ఉన్న హార్సిలీ హిల్స్ లో గవర్నర్ బంగ్లా కూడా ఉంది. రాష్ట్రపతికి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్కు కూడా హార్స్లీ హిల్స్ అలాంటిదే.
బ్రిటిషర్ల కాలంలో మదనపల్లె కలెక్టర్ గా పని చేసిన డబ్ల్యూ. డి. హార్సిలీ అనే అధికారి 1863లో ఇక్కడ వేసవి విడిది కోసం ఓ ఇంటిని నిర్మించారు. ఓ బంగ్లా కూడా కొండపై నిర్మించారు. ఆ భవంతే ప్రస్తుతం ఫారెస్ట్ బంగ్లాగా మారింది. ఇప్పటికీ అవి పదిలంగానే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హార్సిలీ కొండకు ఆయన పేరే పెట్టారు. ఇక్కడ చల్లటి వాతావరణం వల్ల ఆంధ్ర ఊటీగా ఇది పర్యాటక ప్రదేశంగా మారింది. హార్సిలీ ప్రభువు 1859లో నాటిందని చెబుతున్న నీలగిరి చెట్టు ఏపుగా ఎదిగి పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. దీనికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు 1995లో మహావృక్ష పురస్కారం కూడా రాష్ట్ర అటవీ శాఖకు ప్రధానం చేశాయి.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో..
పర్యాటకశాఖ పెత్తనం
ఈ భూభాగం అటవీ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అందులో భాగంగా పర్యాటకశాఖకు పున్నమి హోటల్ తో పాటు రెస్టారెంట్, పర్యాటకులకు వస్తే గదులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి ఆదాయం కూడా ఏటా. కోట్ల రూపాయలలో ఉంటుంది.
భౌగోళికంగా, పర్యావరణపరంగా, పర్యాటకంగా చారిత్రక నేపథ్యం కలిగిన హార్సిలీ హిల్స్లో పతంజలి అంతర్జాతీయ యోగా కేంద్రం ఏర్పాటు వల్ల తమ ఉనికి ప్రమాదం ఏర్పడుతుందని పర్యాటక శాఖ అధికారి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంతకుముందు కూడా స్టెర్లింగ్ అనే సంస్థ హార్సిలీ హిల్స్ ను పరిశీలించింది. కొన్ని రోజుల తర్వాత ఆ సమస్త ముందుకు రాకపోవడంతో పర్యాటకశాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా
హార్సిలీ హిల్స్ లో పతంజలి యోగ సంస్థ పక్షాన అంతర్జాతీయ యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశీలన నేపథ్యంలో ఏమి జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News