ఈ ఐపీఎస్ లకు చట్టాలపై ఉన్న గౌరవం ఇదేనా?
ఏపీలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని రెండు కేసుల్లో తీర్పు చెప్పారు.;
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు పాలకులు. ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చట్టం తన పని తాను చేయకుండా న్యాయాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకుని తీర్పులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కింది స్థాయి పోలీసులు ఇస్తున్న తీర్పులను ఆయా జిల్లాల ఎస్పీలు బలపరుస్తూ తప్పులు చేసిన పోలీసులకు అండగా నిలుస్తున్నారు.
ఏమిటి రెండు సంఘటనలు
గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్, ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో జరిగిన రెండు సంఘటనలు పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర చర్చను రేకెత్తించాయి. తెనాలిలో ముగ్గురు యువకులపై బహిరంగంగా లాఠీ ఛార్జ్ చేసిన సంఘటన, జాళ్లపాలెంలో ఒక ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఎస్ఐ మహిళలపై దాడి చేసిన సంఘటన పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. ఈ రెండు సంఘటనల్లో గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, ప్రకాశం ఎస్పీ దామోదర్ వైఖరి, చట్టబద్ధత, సమాజంపై ప్రభావం ఏమిటనే అంశం చర్చగా మారింది.
తెనాలి ఐతానగర్ సంఘటన
తెనాలిలో ఒక నెల క్రితం ఐతానగర్ లో కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై రౌడీ షీటర్ లడ్డూ (సముద్రాల పవన్ కుమార్) అనుచరులు వేము నవీన్. చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ కరీముల్లా లలో విక్టర్, బాబూలాల్, రాకేష్ గంజాయి మత్తులో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతానగర్ లో నడిరోడ్డుపైకి తీసుకెళ్లి, బహిరంగంగా లాఠీలతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చర్యలో తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్ అతి కర్కశంగా ఒకరి కాళ్ళపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ CI రమేష్ బాబు లాఠీ ఝుళిపించారు.
చట్టబద్ధతపై ప్రశ్నలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇచ్చారు. పోలీసు చర్యలు చట్టబద్ధంగా ఉండాలంటే, అవి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) ఇతర సంబంధిత చట్టాలకు అనుగుణంగా ఉండాలి. నిందితులను బహిరంగంగా శిక్షించడం, లాఠీ ఛార్జ్ చేయడం వంటివి చట్టవిరుద్ధం. మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. సుప్రీంకోర్టు డీకె బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ (1997) కేసులో పోలీసు కస్టడీలో దౌర్జన్యాన్ని నిషేధించింది.
తెనాలి సంఘటనలో పోలీసులు నిందితులను నడిరోడ్డుపై కొట్టడం చట్టవిరుద్ధం. ఇది పోలీసు విధానాలకు వ్యతిరేకం మాత్రమే కాక, న్యాయవ్యవస్థ ద్వారా శిక్షను నిర్ధారించే అధికారాన్ని పోలీసులు స్వీకరించడాన్ని తెలియజేస్తోంది. ఈ చర్యలకు సంబంధించి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితులు రౌడీలని, అందుకే వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇద్దరు సీఐలు చేసిన చర్యలపై మాట్లాడలేదు.
అదనంగా ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత పాత తేదీలతో కేసులు నమోదు చేయడం, బాధితులను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారిగా గుర్తించి, కులం కార్డు ఆడినట్లు ఆరోపణలు రావడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఇది పోలీసు వ్యవస్థలో పారదర్శకత లోపాన్ని సూచిస్తుంది.
జాళ్లపాలెం సంఘటన
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో, మర్రిపూడి ఎస్సై ఎ రమేష్ బాబు సూరంరెడ్డి కొండలరావు అనే వ్యక్తి ఇంట్లోకి మగవారు లేని సమయంలో దౌర్జన్యంగా ప్రవేశించి, ఇద్దరు మహిళలపై దాడి చేశారు. తన సిబ్బందితో వెళ్లి దాడి చేయడం చర్చకు దారి తీసింది. సమీపంలోని ఆలయాల్లో దొంగతనాల కేసు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ తీసుకునేందుకు వెళ్లిన ఎస్సై, ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆగ్రహించి, ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఈ ఘటన మే 28న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోమవారం బయటకు వచ్చింది. చంద్రమ్మ అనే మహిళను నెట్టి కింద పడేసి ఇంట్లోకి చొరబడి సీపీ పుటేజీ పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకుని రావడం వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలు బయటకు వచ్చిన తరువాత సోమవారం సాయంత్రం ఎస్పీ దామోదర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల విధులకు ఇంట్లోని వారు ఆటంకం కల్పించినందున వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం పలువురిలో చర్చకు దారి తీసింది.
చట్టబద్ధతపై పరిశీలన
సీసీ టీవీ ఫుటేజ్ సేకరణకు సంబంధించి, CrPC సెక్షన్ 91 ప్రకారం పోలీసులు నోటీసు జారీ చేసి, చట్టబద్ధంగా ఆధారాలను సేకరించవచ్చు. అయితే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం, శారీరక దాడి చేయడం వంటివి చట్టవిరుద్ధం. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 441 ప్రకారం అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం నేరం. అలాగే సెక్షన్ 323, 354 ప్రకారం, శారీరక దాడి, మహిళలపై అసభ్య ప్రవర్తన కూడా శిక్షార్హమైన నేరాలు.
పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేయడం, ఎస్సై రమేష్ బాబును ఎస్పీ సమర్థించడం, ఈ ఘటనను ఆలస్యంగా బయటకు తీసుకురావడం పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం లోపాన్ని సూచిస్తుంది. ప్రకాశం ఎస్పీ ఈ విషయంలో బాధితుల గురించి మాట్లాడకుండా, ఎస్సైని సమర్థించడం ఏమిటనేది ప్రజలలో అసంతృప్తిని రేకెత్తించింది.
ఎస్పీల వైఖరి
గుంటూరు, ప్రకాశం ఎస్పీలు ఈ సంఘటనల్లో బాధితుల కంటే పోలీసు అధికారులను సమర్థించారు. ఇది చట్టబద్ధమైన పోలీసు విధానాలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ప్రాథమిక లక్ష్యం ప్రజల రక్షణ, న్యాయం అందించడం. అయితే ఈ సంఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసిన తరువాత గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఐతానగర్ ఘటనను ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రజలలో ఈ సంఘటనలపై ఉన్న ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి.
లీసుల తప్పిదం ఏమేరకు?
తెనాలి, జాళ్లపాలెం సంఘటనల్లో పోలీసుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. తెనాలిలో నిందితులను బహిరంగంగా కొట్టడం చట్టవిరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. జాళ్లపాలెంలో సీసీ టీవీ ఫుటేజ్ సేకరణ కోసం చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా దౌర్జన్యంగా వ్యవహరించడం, బాధితులపైనే కేసులు నమోదు చేయడం న్యాయ విరుద్ధం. ఈ రెండు సంఘటనల్లోనూ ఎస్పీలు బాధితుల గురించి మాట్లాడకుండా, తమ అధికారులను సమర్థించడం జవాబుదారీతనం లోపాన్ని సూచిస్తుంది.
సమాజానికి ఇచ్చే సందేశం
ఈ సంఘటనలు సమాజంలో పోలీసు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేసాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ప్రజలలో భయం, అసంతృప్తి పెరుగుతాయి. ఈ ఘటనలు పోలీసు సంస్కరణల అవసరాన్ని, అధికారులకు సరైన శిక్షణను, జవాబుదారీతనాన్ని నొక్కి చెబుతాయి.
పోలీసు దౌర్జన్యం స్పష్టంగా కనిపిస్తోంది: హై కోర్టు న్యాయవాది
ఈ రెండు సంఘటనలపై హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు ‘ధి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ రెండు సంఘటనల్లో పోలీసుల దౌర్జన్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ సంఘటనలపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. తెనాలి ఘటనపై ఇప్పటికే నిందితులతో మాట్లాడామని బుధవారం వారి వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుని కోర్టులో పోలీసులపై కేసు వేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు సీఐలను ఆ స్టేషన్ ల నుంచి తప్పించాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయ వ్యవస్థకు వారు అడ్డంకిటా మారతారన్నారు.
ప్రకాశం జిల్ల జాళ్లపాలెం సంఘటన కూడా దారుణంగా ఉందన్నారు. అడిగిన వెంటనే ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీ టీవీల పుటేజ్ ఇవ్వలేదని, వారిపై దౌర్జన్యం చేసి పుటేజీని తీసుకున్న తరువాత తమ విధులకు ఆటకం కల్పించారని ఎస్ఐ ఎస్సీ అయినంత మాత్రాన అట్రాసిటీ కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. సీపీ పుటేజ్ కావాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని సెర్చ్ వారంట్ ఇచ్చి చెక్ చేయవచ్చు. లేదా సీసీ పుటేజ్ తీసుకోవచ్చు. ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్న పోలీసులను పోలీస్ ఉన్నతాధికారులు సమర్థిస్తున్నారంటే వారు కూడా దౌర్జన్యాలను సమర్థిస్తున్నరని చెప్పక తప్పదన్నారు. హోం మంత్రి కూడా నిజాలు తెలుసుకోకుండా పోలీసు అధికారులు ఇస్తున్న తప్పుడు సమచారాన్ని సమర్థించడం మంచిది కాదన్నారు.