లక్షన్నర కోట్లు అప్పు చేశారు..అవి మీ జేబుల్లోకి వెళ్లాయా
సీఎం చంద్రబాబు చేసేది రాజకీయం కాదు..బ్రోకరిజమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు.;
By : The Federal
Update: 2025-02-12 12:27 GMT
ఆంధ్రప్రదేశ్లోని ఆడపిల్లల కన్నీళ్లు సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి కనపడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారని, తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జెత్తానికి ఇంకో న్యాయమా? అంటూ నిలదీశారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లక్మి విషయంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినోడు బయట తిరుగుతుంటే.. బాధితురాలు లక్ష్మి మాత్రం జైలుపాలైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా వల్ల చంద్రబాబు.. చంద్రబాబు వల్ల ఎల్లో మీడియా బతుకుతున్నారని, వీరి వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగదని, చంద్రబాబును మనిషిగా కూడా తాను గుర్తించడం లేదని విమర్శలు గుప్పించారు.
లక్షన్నర కోట్లు అప్పులు చేసి, వాటిని ఏమి చేశారని నిలదీశారు. మీ జేబుల్లోకి వెళ్లాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మత్తులో పెట్టి సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. అప్పుడు జనం ఎవరికి ఓట్లేస్తారో తేలుతుందన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ నుంచి ప్రతి విషయంలోనూ చంద్రబాబు అబద్దాలే చెబుతున్నారని, అబద్దాల కోటలో చంద్రబాబు బతుకుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుమారు లోకేష్ అవినీతి, అరాచకాలు మితిమీరి పోయాయని, కన్న తండ్రిగా లోకేష్ను కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. జీవితంలో చరమాంక దశలో ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని హితవు పలికారు.
మహిళలపై అరాచకాలు జరుగుతుంటే సనాతన ధర్మం అనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని? ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తిరుపతిలో కిరణ్ రాయల్ అనేవాడు లక్ష్మిని మోసం చేశాడు, తప్పు చేసిన కిరణ్ రాయల్ రోడ్డు మీద తిరుగుతుంటే.. బాధితురాలు లక్ష్మి జైలు పాలైందన్నారు. కులాల గురించి భయంకరంగా మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు చేతిలో పోలీసు వ్యవస్థను పెట్టి నడిపించడం దారుణమని, పిచ్చోడి తేతిలో రాయిలా ప్రభుత్వం పనితీరు మారిందని లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు.