కుమార్తె ఆరోపణలకు ముద్రగడ కౌంటర్.. తన కుటుంబంపై కుట్ర అంటూ ఆగ్రహం
ప్రజలకు బహిరంగ లేఖ;
తాను ఆరోగ్యంగానే ఉన్నానంటున్నారు కాపు ఉద్యమనేత ,వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం(పద్మనాభ రెడ్డి).తన కుమార్తె క్రాంతి చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తున్నట్లుగా ముద్రగడ బహిరంగలేఖ విడుదల చేశారు.ఈ మధ్య తమ కుటుంబంపై మరో కుటుంబం దాడి చేస్తోందంటూ పరోక్షంగా కుమార్తె కుటుంబాన్ని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు.తమ మధ్య మనస్ఫర్ధలు వున్న కారణంగా ఆ కుటుంబానికి దూరంగా వుంటున్నాని వెల్లడించిన కాపు ఉద్యమ నేత , తన కుమారుడు గిరిబాబును వెనకేసుకొచ్చారు. గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో ఆ కుటుంబం రగిలి పోతోందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.తనకు క్యాన్సర్ వచ్చినా కుమారుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారని , తన కొడుకు చూపిస్తున్నశ్రద్ద తోనే చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా వున్నానన్నారు.
ఆ కుటుంబానికి దగ్గరయ్యేది లేదు
ఆ కుటుంబానికి దగ్గరవడం ఈ జన్మలో జరగదని ముద్రగడ స్పష్టం చేశారు. తనకు కుమారుడికి దూరం చేసి ఈ కుటుంబం దగ్గరవ్వాలని ఆలోచిస్తోందని అది జరగబోదన్నారు.దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్లు,ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోవాలని ముద్రగడ కుమార్తెకు సూచించారు.తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని స్పష్టం చేశారు.