గాజు గ్లాసుకు బకెట్ తిప్పలు.. జనసేనాని ఏం చేస్తారో..

జనసేనకు దిమ్మ తిరిగే దెబ్బ తగిలింది. ఎన్నికల బరిలోకి తమ పార్టీ గుర్తయిన గాజు గ్లాసును పోలిన బకెట్ కూడా ఎంటర్ అయింది. దీంతో జనసేన గుండెల్లో గుబులు పుట్టింది.

Update: 2024-04-12 10:58 GMT
Source: Twitter
ఆంధ్ర ఎన్నికలు ఓ స్పైసీ థ్రిల్లర్ మూవీలా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దీని వల్ల ప్రజలే కాదు ప్రధాన పార్టీలు కూడా ఊపిరి బిగబట్టి పరిస్థితులను గమనిస్తున్నాయి. అందులోనూ ఎన్నికలనగానే ప్రధాన పార్టీల ముందు ఉండే అతిపెద్ద సవాల్.. చిన్న పార్టీలు. ఎందుకంటే ఈ చిన్న పార్టీలు ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లున్న వ్యక్తులనే బరిలోకి దించుతాయని భయం ఒకవైపు ఉంటే మరొకటి పార్టీ గుర్తు. ఎక్కడ తమ పార్టీ గుర్తు లాంటి గుర్తునే చిన్న పార్టీలు కూడా ఎన్నుకుంటాయో అని ప్రధాన పార్టీలకు నిద్ర పట్టదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే జనసేనకు ఎదురైంది. గాజు గ్లాసును పోలిన బకెట్ గుర్తుతో ఓ పార్టీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమైంది. ఇది ప్రస్తుతం జనసేనకు పెద్ద తలపోటుగా మారింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో గాజు గ్లాసుకు‌కు బకెట్ తిప్పలు తప్పేలా లేవు. రానున్న ఎన్నికల్లో ఈ బకెట్ గుర్తు ప్రభావం గాజు గ్లాసుపై తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. వీళ్ల వ్యాఖ్యల్లో వాస్తవాలూ లేకపోలేదు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేనకు బకెట్ గండం తప్పదనే అనిపిస్తుంది. గాజు గ్లాసు, బకెట్ గుర్తులు రెండు చాలా ఐడెంటికల్‌గా ఉన్నాయి. దాంతో పోలింగ్ సమయంలో ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు ఓటేసే ప్రమాదాలు అధికంగానే ఉన్నాయి.
ఇంతకీ బకెట్ గుర్తు ఎవరిది..
‘మమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయొద్దని జనసేనాని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నాడు’’అని నవరంగ్ పార్టీ చీఫ్ జలీల్ ఆరోపించారు. ఈ పార్టీదే ఆ బకెట్ గుర్తు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు గుర్తులను ప్రకటించింది. ఆ క్రమంలోనే నవరంగ్ కాంగ్రెస్‌కు బకెట్ గుర్తు లభించింది. అది కాస్తా జనసేన గాజు గ్లాస్ గుర్తుకు ఐడెంటికల్‌గా ఉండటంతో ప్రస్తుతం జనసేనకు నిద్ర పట్టడం లేదు. ఈ సమ్యను ఎలా అధిగమించాలా అని జుట్టుపీక్కుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని జనసేన.. నవరంగ్ కాంగ్రెస్‌ను బెదిరించిందన్న ఆ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. దానికి తోడుగా ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థుల పేర్లతో కలుస్తుండటం మరో కీలక అంశం. పిఠాపురంలో జనసేన తరపున కొణిదెల పవన్ కల్యాణ్ పోటీ చేస్తుంటే..నవరంగ్ కాంగ్రెస్ తరపున కే. పవన్ కల్యాణ్ బరిలో నిలవనున్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలో ఉంటే నవరంగ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్.మనోహర్ రంగంలోకి దిగనున్నారు. దీంతో జనసేనకు మరింత ప్రమాదం ఉందని భావించే జనసేన నేతలు.. నవరంగ్ పార్టీ అధ్యక్షుడు జలీల్ ఖాన్‌తో చర్చించాయని ఆయన చెప్పారు.
జలీల్ ఏమంటున్నారంటే..
పార్టీ గుర్తు మేము ఎన్నుకున్నది కాదు.. ఎన్నికల సంఘం కేటాయించింది. అదే విధంగా అభ్యర్థుల పేర్లు కూడా యాధృచ్ఛికంగా జరిగిందేనని జలీల్ చెప్తున్నారు. దీని వల్ల తమ పార్టీకి సమస్యలు వస్తున్నాయని, తమను బెదిరించి పార్టీ తమ దగ్గరనున్న బీఫామ్స్‌ను జనసేన నేత బాలశౌరి తీసుకుని వెళ్లిపోయారని జలీల్ ఆరోపించారు. ‘‘నా తలకు గన్ను గురిపెట్టి.. బెదిరించి.. బీఫామ్స్‌ మొత్తాన్ని కాజేశారు. ఏది ఉన్నా చర్చల ద్వారా తేల్చుకోవాలి. ఇలా గూండాగిరి చేయడం దారుణం’’అని జలీల్ చెప్తున్నారు. దీనిపై ఇప్పటివరకు జనసేన నేతలు ఎవరూ స్పందించలేదు.
ఇదంతా అధికార పక్షం కూట్రేనా!
ఒక్కసారిగా గాజు గ్లాసు, బకెట్ వివాదం తెరపైకి రావడం, రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఈ సమస్యను జనసేన ఎలా సాల్వ్ చేస్తుందో అని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే కొందరు మాత్రం ఇదంతా వైసీపీ పన్నిన కుట్రే అని ఆరోపిస్తున్నారు. ‘‘వైసీపీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఈ గుర్తును కేటాయించింది. ఆఖిరికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ ఆదేశాల మేరకే స్థాపించబడి ఉంటుంది. జనసేనను ఓడించడానికి జగన్ పన్నిన పన్నాగమే ఇదంతా. లేదంటా ఇన్నాళ్లూ కనివిని ఎరుగని పార్టీ ఇప్పటికిప్పుడు తెరపైకి రావడం.. ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు.. జనసేన అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. జగనే.. ఎన్నికల్లో ఎలాగైనా పవన్‌ను దెబ్బకొట్టాలని ఈ పార్టీని ప్లాన్ చేశారని, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ.. జనగ్ ఆడుతున్న ఎన్నికల చెస్‌లో ఒక పావు మాత్రమే’’అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గుర్తంటే యాదృచ్చికంగా జరిగిందని చెబితే నమ్మొచ్చని, కానీ అభ్యర్థుల పేర్ల అది కూడా రెండు నియోజకవర్గాల్లో ఒకేలా ఉండటం యాధృచ్చికం అంటే నమ్మసక్యంగా లేదని మరికొందరు అంటున్నారు. మరి ఈ సమస్యను జనసేన ఎలా డీల్ చేస్తుందో చూడాలి.
జనసేనకు దెబ్బ తప్పదా..
రానున్న ఎన్నికల్లో జనసేనను ఎలాగైనా ఓడించాలని వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ.. పిఠాపురంలోకి కాపు నేతలను ఒకరి తర్వాత ఒకరిగా దించుతోంది. వంగా గీతను పవన్ ప్రత్యర్థిగా నియమించడంతో పాటు కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభంను కూడా పిఠాపురం పాలిటిక్స్‌లోకి ఎంటర్ చేసిందని వైసీపీ. ఇప్పుడు తాజాగా సేమ్ టూ సేమ్ అన్నట్లు పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు సైతం జనసేనను పోలి ఉన్న నవరంగ్ కాంగ్రెస్ అనే పార్టీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో జనసేనకు ఈసారి కూడా దెబ్బ తప్పదనే అనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు గట్టిపోటీ ఉందన్న క్రమంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నవరంగ్ కాంగ్రెస్ ప్రభావం జనసేన పార్టీపై తీవ్రంగా ఉండనుంది. ఈ రెండు పార్టీల మధ్య తేడా తెలుసుకోవడంలో అనేక మంది ఓటర్లు కన్‌ఫ్యూజ్ అవుతారు. దీంతో ఏ ఓట్లయితే చీలకూడదని పవన్ పొత్తుకు శ్రీకారం చుట్టారో. ఆ ఓట్లే చీలతాయి. దీంతో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరి ఈ విషయంలో జనసేన ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News