వచ్చేది మన ప్రభుత్వమే.. ఏరి మరి జైల్లో వేస్తాం: మాజీ సీఎం జగన్‌

రాష్ట్రంలో ఘోరమైన రెడ్‌బుక్‌ పాలన సాగుతోంది. బాధితుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.

Update: 2024-10-23 09:51 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ బుక్‌ పాలన సాగుతోంది. ఈ కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఈ ప్రభుత్వం చేసినా, చేయక పోయినా బాధపడకండి. వచ్చేది మన ప్రభుత్వమే. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారిని ఏరి మరి జైల్లో వేస్తామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రౌడీషీటర్‌ నవీన్‌ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలికి చెందిన యువతి సహానా మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం జగన్‌ పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ పార్టీ తరఫున సహానా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ ఘటనలలో చనిపోయిన ఆరుగురు ఆడపిల్లల కుటుంబాలకు వైసీపీ తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం ఇస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలన, కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సహానా మృత దేహంపై కమిలిన గాయాలు ఉన్నాయన్నారు. సుహానపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితుడు సీఎం చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయన్నారు. నిందితుడు టీడీపీకి చెందిన వాడు కావడంతోనే నిస్సిగ్గుగా అతడిని కాపాడాలని చూస్తోందని జగన్‌ ధ్వజమెత్తారు. ఇంతవరకూ మృతురాలి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి కానీ పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో అనేదానికి ఈ సంఘటే ఉదాహరణని అన్నారు. తమ హయాంలో మహిళలకు దిశయాప్‌ ద్వారా భద్రత కల్పించామన్నారు. తద్వారా మహిళలకు రక్షణ ఉండేదన్నారు.
Tags:    

Similar News