పోలీసుల నిఘాలోనే పిన్నెల్లి

మూడు కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినా నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Byline :  The Federal
Update: 2024-05-29 11:44 GMT

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించినా పోలీసు నిఘాలో ఉండే విధంగా షరతులు విధించింది. పిన్నెల్లి దాఖలు చేసిన మూడు కేసుల్లోను ఆయనకు ముందస్తు బెయిల్‌ లభించింది. జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందులో అప్పటిన వరకు ఆయనను అరెస్టు వంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని వెల్లడించింది. అయితే ఒక పక్క బెయిల్‌ మంజూరు చేస్తూనే అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5లోపు ప్రతి రోజూ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోను నరసరావుపే దాటి వెళ్ళొద్దని స్పష్టం చేసిన హైకోర్టు ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారనే విషయాన్ని పల్నాడు జిల్లా ఎస్పీకి తెలియ జేయాలని ఆదేశించింది. అంతేకాకుండా దేశం విడచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌ పోర్టును అప్పగించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు అధికారాలు ఉంటాయనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఆ మేరకు పోలీసులకు వెసులుబాటు కూడా కల్పించింది.

షరతులు ఇవే
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని, పోలీసులు అలా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని హైకోర్టు ఆదేశించింది. నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయొద్దని పిన్నెల్లిని ఆదేశించింది. శాంతి భద్రతలకు సమస్యగా ఉండకూడదని, జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని, అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లిదేనని స్పష్టం చేసింది. జిల్లాలో ప్రశాంతతకు కానీ, బాధితులకు కానీ ఎలాంటి అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదేనని ఖరాఖండిగా చెప్పింది. మీడియాలో కూడా మాట్లావద్దని చెప్పింది.
తన కేసుల గురించి కానీ, కేసుల్లో తన పాత్ర గురించి కానీ మీడియాలో మాట్లాడొద్దని ఆదేశించిన హైకోర్టు బాధితులను కానీ, సాక్షులను కానీ ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి వీల్లేదని, వారిని ప్రభావితం చేసే పనులు కానీ, భయపెట్టే పనులు కానీ చేయొద్దని ఆదేశించింది. ఎక్కడంటే అక్కడ ఉండేందుకు అవకాశం లేదని, పల్నాడు జిల్లా, పార్లమెంట్‌ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని పిన్నెల్లికి స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో మాత్రం కాస్త సడలింపు ఇచ్చింది. ఓట్ల లెక్కింపు కేంద్రం మరో చోట ఉన్నటై్టతే లెక్కింపు రోజు మాత్రమే ఆ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే ఆ రోజు మాత్రం పల్నాడు ఎస్పీ ముందు కాకుండా ఆర్వో ముందు హాజరయ్యే విధంగా వెసులుబాటు కల్పించింది. కోర్టు అనుమతులు లేనిదే దేశం విడచి వెళ్లేందుకు అవకాశం లేదని, పాస్‌పోర్టును కూడా గురజాల మెజిస్ట్రేట్‌ కోర్టులో అప్పగించాలని ఆదేశించింది.
పోలీసులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి కేసుల్లో బాధితులకు అన్ని రకాల రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, వారికి రక్షణగా గస్తీని కూడా ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించింది.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిరైల్వేగేటు పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంల ధ్వంసం కేసులు, దానిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, ఈవీఎంను ఎందుకు ధ్వంసం చేశావని ప్రశ్నించినందుకు చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్బాషలాడినందుకు, పోలింగ్‌ మరుసటి రోజు సోదరుడు, తన అనుచరులలో కలిసి కారంపూడిలో అరాచకరం సృష్టించడం, దానిని అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడికి పాల్పడి గాయపరిచడం వంటి ఘటనల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశారు. హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేటకు చేరుకున్న పిన్నెల్లి అర్థ రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ ఎదుట హాజరయ్యారు.
Tags:    

Similar News