అధికారంలో ఉన్నప్పుడు జగన్కు కానరాని ప్రజా దర్బార్లు
అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ ప్రజల్లోకి వెళ్లింది లేదు. ప్రజల సమస్యలు తెలుసుకునింది లేదు. అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యల కోసం ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.
ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ, వాటి పరిష్కారం కోసం అనునిత్యం పని చేసే వారు ప్రజల నేతలుగా చెరగని ముద్ర వేసుకుంటారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేక పోయినా ప్రజల అండగా ఉంటారు.. ఆదరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శైలి అందుకు భిన్నం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలను కలిసేందుకు కానీ, వారి సమస్యలు వినేందుకు కానీ, ఆ సమస్యలను పరిష్కరించేందుకు కానీ ప్రయత్నించింది లేదు.. సమయం వెచ్చించింది లేదు.. అసలు అలాంటి ఆలోచనలు కూడా చేసింది లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్యాలెస్కే పరిమితమయ్యారు. అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు. ప్రజా దర్బార్లు పెట్టి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్డీఏ కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ.