చలో పులివెందుల.. పెద్దఎత్తున తరలిన హైదరాబాద్ వాసులు

పులివెందులలో ఓటున్న ప్రతి ఒక్కరూ రావాలని ఆయా పార్టీల పిలుపు మేరుకు హైదారాబాద్ లోని కడప జిల్లా వాసులు తరలివెళుతున్నారు.;

Update: 2025-08-11 12:41 GMT
ప్రతిష్టాత్మక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. అటు అధికార వైఎస్సార్‌సీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. పోలింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది.
ఈ రెండు జెడ్పీటీసీల ఫలితం రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే కావడంతో, శనివారం వరకు హోరాహోరీ ప్రచారం సాగింది. అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ప్రత్యక్షంగా బరిలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్ లోని వందలాది మంది పులివెందుల వాసులు కడప బాట పట్టారు. వీళ్లలో ఎక్కువ మంది అక్కడ ఓటు ఉన్నవారే. ఆయా పార్టీల వారి పిలుపు మేరకు వీళ్లు తరలివెళుతున్నారు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల్లో కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, అదనపు పోలీస్ బలగాల నియామకం వంటి చర్యలు తీసుకున్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓటర్ల ప్రలోభాలకు తెర లేచింది. ఎక్కడికక్కడ గ్రూపు సమావేశాలు, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే వ్యూహాలు, తెర వెనుక మూడో కంటికి తెలియకుండా మద్య, మాంసాల పంపిణీ, నోట్ల అలజడి వంటి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు కడప జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. వాస్తవానికి కడప జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నా ప్రజల చూపంతా పులివెందులపైన్నే ఉంది. మరోపక్క ఓటర్లు కూడా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తారా అనే దాన్నే చర్చిస్తున్నారు.
ఈనేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. వాళ్లు డబ్బులు పంచుతున్నారంటే వీళ్లు పంచుతున్నారని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఒక్కో ఓటుకు వైసీపీ వాళ్లు సుమారు 5 వేల రూపాయలు ఇస్తున్నారని టీడీపీ ఆరోపిస్తే 6 వేలు ఇస్తున్నారంటూ వైసీపీ టీడీపీపై ప్రత్యారోపణ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
'YCP నేతల వద్ద నోట్లు తీసుకోండి.. TDPకి కు ఓట్లు వేయండి' అంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన పులివెందులలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు కూటమి నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ పులివెందుల అని, గతంలో అక్కడ నామినేషన్‌ వేసే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూటమి నేతలను విమర్శించే హక్కు లేదన్నారు.
మరోపక్క, వైసీపీ కూడా ఇదే తరహా అప్పీల్ చేసింది. టీడీపీ వాళ్లు ఇస్తే డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం వైసీపీకే వేయండి అని ఎంపీ అవినాశ్ రెడ్డి అప్పీల్ చేశారు. పులివెందుల రూరల్‌ మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోంది. చివరికి అరాచకానికి కూడా తెరలేపింది.
వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల లో 10,601 మంది ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News