తిరుమలకు ఉచిత బస్సు ఇప్పుడే కాదన్న రవాణా మంత్రి

6 రోజుల్లో 65 లక్షల మంది మహిళల ఉచిత ప్రయాణం;

Update: 2025-08-20 10:51 GMT
ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డి మాట్లాడుతున్న చిత్రం
సూపర్ సిక్స్ పథకం లో భాగంగా అందించిన స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. స్త్రీ శక్తి పథకం సక్సెస్ సందర్భంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం సమీక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మహిళలకు ఉచిత బస్సు పథకమన్నారు. పథకం అమలు తీరులో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, ఒడిదుడుకులను తట్టుకుని సద్విమర్శలను పరిగణలోకి తీసుకుని పథకంను విజయవంతం చేయడంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.
ఈ ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందే బస్ స్టేషన్లు, బస్ షెల్టర్లలలో రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఫ్రీ బస్సు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించే యోచనలో ఉన్నామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, కండెక్టర్ల కు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఆర్టీసీని బలోపేతం చేస్తామన్నారు.
ఆర్టీసీ పరిపుష్టికి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకుంటామని, కార్గో సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రయాణీకుల రద్దీకి అవసరమైన కొత్త బస్సులను కొనుగోలు చేయలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుందని, మరో నాలుగేళ్లలో 2500కు పైగా నూతన బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులే అని వివరించారు.
కొండ(ఘాట్ రోడ్) ప్రాంతాల్లో సైతం ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, మరో వారం రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. తిరుమలకు కూడా ఫ్రీ బస్సు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి అతి త్వరలోనే తిరుమలకు ఫ్రీ బస్సు పై అనుకూల ప్రకటన వస్తుందన్నారు.
అతి త్వరలో కండెక్టర్ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామి ఇచ్చారు. ఉచిత బస్సు పథకం ఆర్టీసీ సంస్థలోని దాదాపు 75 శాతం బస్సుల్లో వర్తిస్తుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక వెసులుబాటును పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:    

Similar News