స్పీకర్‌గా చింతకాయల పేరు దాదాపు ఖరారు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎంపికను టీడీపీ దాదాపు పూర్తి చేసింది. అయ్యన్నపాత్రుడకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిశ్చయించింది. ఈ పోటీలో ఇతర సీనియర్లు కూడా ఉన్నారు.

Update: 2024-06-17 06:16 GMT

ఆంధ్రలో ప్రభుత్వం మారింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాడింది. అఖండి మెజార్టీతో గెలిచి కూటమిలోని మూడు పార్టీల్లో సీనియర్ నేతలకు కొదవ లేదు. ఈ క్రమంలో స్పీకర్ ఎవరు అవుతారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా స్పీకర్ పదవి టీడీపీ ఎమ్మెల్యేకే దక్కుందని కొందరు అన్నప్పటికీ బీజేపీలో మంచి సీనియర్లు ఉన్నారని, కాబట్టి స్పీకర్ పదవి రేసులో బీజేపీ కూడా ఉంటుందని మరికొందరు మేధావులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ ఎవరు అవుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఈ సస్పెన్స్‌కు టీడీపీ తెరదించింది. స్పీకర్ ఎంపికను దాదాపు పూర్తి చేసింది.

ఆ పార్టీకే డిప్యూటీ స్పీకర్..

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టీడీపీ కూటమి ఇప్పటికే సీఎం, కేబినెట్ మంత్రుల ఎంపికను పూర్తి చేసుకుంది. మంత్రుల శాఖల కేటాయింపును కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో కూటమి ముందు ఉన్న ఇంకొక సవాల్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక. అయితే ఇప్పటికే స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పారు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి ఇవ్వాలని కూడా ఫిక్స్ అయినట్లు సన్నిహిత వర్గాలు చెప్పారు. ఇప్పటికే ఇందుకోసం జనసే నేతలతో చర్చలు కూడా చేసినట్లు వాళ్లు వివరించారు.

స్పీకర్‌తో పాటు ప్రభుత్వ విప్ ఎంపికపైన కూడా కూటమి కసరత్తులు చేస్తోంది. పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేబినెట్ మంత్రులు, కూటమి పెద్దలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో వీరి ఎంపికలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మాట వినిపిస్తోంది.

అందుకేనా తొందర

స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ ఎంపిక విషయంలో కూటమి కాస్త తొందర పడుతుందన్న వాదనలు జరుగుతున్నాయి. కాగా ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి వీరి ఎంపిక విషయంలో వడివడిగా అడుగులు వేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరి చేత ప్రమాణ స్వీకారం చేయించే ప్రోటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వారంతా కలిసి స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఈ క్రమంలోనే స్పీకర్‌గా బీసీ నేత ఉంటే బాగుంటుందని భావించిన టీడీపీ ఆ అవకాశాన్ని అయ్యన్నపాత్రుడికి ఇవ్వాలని ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ స్పీకర్ పదవి రేసులో కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు పేర్లు కూడా వినిపించినా పూర్తి పరిశీలన తర్వాత పార్టీ కోసం, జనాల కోసం అయ్యన్నపాత్రుడు చేసిన సేవకు పెద్దపీట వేస్తూ ఆయననే స్పీకర్ చేయాలని టీడీపీ భావించినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News