సచివాలయాల్లో పోస్టుల సంఖ్య తగ్గించనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించనుంది. ఈ మేరకు అక్కడ ఉన్న కొందరు ఉద్యోగులను ఆయా శాఖల ఖాళీల్లో నియమించనున్నారు.

Update: 2024-08-26 08:02 GMT

గ్రామ, వార్డు సచివాలయాల్లో సరైన పనిలేకుండా ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరికి పనులు లేవని, అటువంటి వారిని మండల స్థాయి, డివిజన్‌ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నియమిస్తే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి, పనిలేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని ప్రభుత్వం భావించిది.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో లోపాలపై ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌’ సంస్థ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది. దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. బలోపేతానికి తీసుకోవలసిన చర్యలనూ సూచించింది. అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు బహిర్గతం చేయడానికి సాహసించలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు. పనిభారం పెద్దగా లేదని ’రీసెర్చ్‌’ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది.
2022 నవంబరు నుంచి 2023 మే నెల మధ్య 37 శాతం గ్రామ సచివాలయాలు, 39.3 వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5 శాతం లోపే సేవలు అందించాయి. గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. కొన్ని సెమీఅర్బన్‌ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు.
సెమీ అర్బన్‌ ప్రాంతాలన్నీ గ్రామీణ, పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, తదితర మానవ వనరులున్నాయి. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు రెండు సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రత దృష్ట్యా విద్యుత్‌ శాఖ ఉద్యోగులతో కలిసి టీమ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. గ్రామ పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదనే రీతిలో ఉన్నాయి. నిజానికి సర్పంచ్‌ ఈ సచివాలయాలకు హెడ్‌గా ఉంటే వారి పనితీరులో మెరుగుదల కనిపిస్తుంది. అలా కాకుండా వారి ఇష్టానుసారం వ్యవహరించడం కూడా పనులు లేకుండా పోవడానికి కారణం.
స్థానికంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖలు, మున్సిపల్‌ శాఖకు వారు జవాబుదారీగా ఉండాల్సి వస్తోంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్‌ పోస్టులుగా ఉన్నాయి. ఏఎన్‌ఎం, రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అసిస్టెంట్లకు పెద్దగా పనిలేదు. శానిటేషన్‌ కార్యదర్శులు పదే పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు.
కొంత మంది టౌన్‌ప్లానింగ్‌–రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంత మంది కార్యదర్శులకు విస్తృతమైన బాధ్యతలు పెట్టగా.. కొంత మందిని కొన్ని పథకాలకే పరిమితం చేశారు. ఉదాహరణకు సంకేమ, ఎడ్యుకేషన్‌ కార్యదర్శికి చేతినిండా పని ఉంటుంది. శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టికల్‌గా కొన్ని పరిమితమైన విధులు మాత్రమే వారు చేపడుతున్నారు. సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కల్పించడంలో కీలక భూమిక పోషించడం లేదు. వారికి నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది.
వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌–రెగ్యులేషన్, శానిటేషన్‌ కార్యదర్శులను తగ్గించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచాలని, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలని గతంలో సర్వే చేసిన సంస్థ సూచించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరెవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలపాలని కోరింది.
Tags:    

Similar News