Tirumala Darsan| శ్రీవారిమెట్టు వద్ద ఉచిత టోకెన్ల కేంద్రం మూత
భూదేవి కాంప్లెక్స్ వద్దకు మార్చాలని నిర్ణయించిన టీటీడీ దళారులకు చెక్ పెట్టింది.;
Byline : The Federal
Update: 2025-06-03 15:19 GMT
శ్రీవారిమెట్టు వద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఉచితంగా ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. శుక్రవారం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లోనే టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతికి దూరంగా అటవీప్రాంతంలో ఉన్న ఆ కేంద్రం వద్ద ఉచితంగా జారీ చేసే టోకెన్లు తీసివ్వడానికి వాహనాల డ్రైవర్లు రూ. 500 నుంచి 600 వసూలు చేస్తున్నారు. యాత్రికులు దోపిడీకి కాకుండా నివారించడం, వారి భద్రత కోసం శ్రీవారిమెట్టు కేంద్రాన్ని శుక్రవారం నుంచి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లోనే నిర్వహించనున్నారు.
టిటిడి ఈవో జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం వర్చువల్ సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వి. వీరబ్రహ్మం, టీటీడీ ఇన్చార్జి సీవీ అండ్ ఎస్ఓ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు, సీఈ టి.వి. సత్యనారాయణ, ఎస్ఈలు మనోహరం, వెంకటేశ్వర్లు, జీఎం (ట్రాన్స్పోర్ట్) శేషారెడ్డి, డిప్యూటీ ఈఓలు లోకనాథం, సెల్వం, శ్రీ గోవింద రాజన్, శ్రీ సోమన్నారాయణ పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం నుంచి నడకమార్గంలో యాత్రికులు వెళుతుంటారు వారికోసం రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తుంటారు. దీనికోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణునివాసం, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు సమీపంలో రోజూ వేకువజామను టోకెన్లు జారీ చేసేవారు. రాత్రంతా మేలుకుని ఉండాల్సి వస్తోందనే వినతుల నేపథ్యంలో రాత్రి తొమ్మిది గంటల నుంచే సర్వదర్శనం ఉచిత టైంస్లాట్ టోకెన్ల జారీ చేయడం ప్రారంభించారు.
ఇదే దళారులకు వరం
తిరుపతి నగరంలోని శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు యాత్రికులతో రద్దీగా ఉంటాయి. గంటల తరబడి క్యూలో నిలబడక తప్పని పరిస్థితి. ఈ టోకెన్లు టీటీడీ ఉచితంగానే జారీ చేస్తుంది. దీనిని టాక్సీలు, ఆటో డ్రైవర్లు సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఎలాగంటే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ కేంద్రాలు రద్దీగా ఉంటాయి.
"తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని శ్రీవారిమెట్టు వద్ద ఉన్న కేంద్రంలో రద్దీ తక్కువ. అక్కడికి తీసుకుని వెళతాం. టికెట్టుకు రూ. 600 అవుతుంది. అని ఉచిత టికెట్లకు బేరం పెట్టి, వసూలు చేయడం ప్రారంభించారు" దీనిపై మౌఖికంగా పిర్యాదలు అందుకున్న అలిపిరి ఏవీఎస్ఓ ఒకరు, శ్రీనివాస మంగాపురం వద్ద వాహనాల తనిఖీ ప్రారంభించడం ద్వారా దళారులను కట్టడి చేయగలిగారు. ఆ తరువాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది.
టీటీడీ చెక్
శ్రీవారిమెట్టు వద్దకు వెళ్లడానికి పగలు సాధ్యం అవుతుంది. రాత్రిళ్లు శ్రీనివాసమంగాపురం నుంచి నడచి వెళ్లాలంటే, అడవిమార్గంలో ప్రయాణించాలి. దీనికి తోడు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. యాత్రికుల భద్రత కూడా టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. శ్రీవారిమెట్టు వద్ద టోకెన్ల జారీ కేంద్రాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, అ టికెట్లు భూదేవి కాంప్లెక్స్ లోనే జారీ చేయాలని నిర్ణయించారు.
టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులతో నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ఇవి.
ప్రత్యేక కౌంటర్ శ్రీవారిమెట్టు నుంచి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స్లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) సాయంత్రం నుంచి టోకెన్లు జారీ ప్రక్రియ టోకెన్ల లభ్యత మేరకు ఉంటుంది. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది.
యాత్రికుడు ఆధార్ కార్డు చూపించి దివ్యదర్శనం టోకెన్లు తీసుకోవాలి. పొందిన భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి.
తిరుమలలో శనివారం శ్రీవారి దర్శనానికి శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.
అలిపిరి మార్గంలో వెళ్లే యాత్రికులకు మరోపక్క ఎస్ఎస్డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.
అప్రమత్తంగా ఉండండి
భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈఓ శ్యామలరావు ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించి, టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యం కోసం పటిష్ట క్యూలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు . యాత్రికులకు అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.