టాప్ నక్సలైట్ సుధాకర్ ‘ఎన్ కౌంటర్’
ఆయన సినీ నటుడు కాకరాల అల్లుడు;
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్ కౌంటరులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ (65) చనిపోయాడు.
కేంద్ర భద్రతా దళాలు ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కు మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా నేలకు ఒరుగుతున్నారు. పార్టీ సెక్రెటరీ నంబలా కేశవరావుని ‘ఎన్ కౌంటర్లో’ కోల్పోవడం, వందలాది మంది గెరిల్లాలను పోలీసులు హతమార్చడంతో కకావికలమయి సిపిఐ(ఎంఎల్ -మావోయిస్టు) పార్టీకి మరోక ఎదురుదెబ్బ తగిలింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో 2004లో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో సుధాకర్ కూడా పాల్గొన్నారు. ఆ చర్చల అనంతరం దండకారణ్యంలోకి మాయమయ్యారు. తర్వాత ఆయన గురించి వినిపించడం ఇదే మొదటి సారి.
ఆయన స్వగ్రామం ఏపీలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన సుధాకర్ చదువు కోసం విజయవాడ వెళ్లాడు. ఆయుర్వేద కళాశాలలో చదువుతున్నప్పుడే రాడికల్ సంఘం వైపు సుధాకర్ ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి ఆయన తిరిగి గ్రామానికి రానే లేదని సుధాకర్ సోదరుడు ఆనందరావు చెప్పారు. . ప్రముఖ సినీ నటుడు కాకరాల కుమార్తెను ఉద్యమంలోనే పెళ్లి చేసుకు న్నారు.
ఎన్ కౌంటర్ ఎలా జరిగింది
నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సుధాకర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, ఇతర ముఖ్య నేతలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డీఆర్డీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. తర్వాత వెళ్లి చూడగా సుధాకర్ మృత దేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే 47ను స్వాధీనం చేసుకున్నా మని చెప్పారు. ఆయన తలపై ఛత్తీస్ గడ్ లో రూ.40 లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఒడిశా తది తర రాష్ట్రాలు ప్రకటించిన వెలలను కూడా కలిపితే ఆయనపై రూ.1 కోటికి పైగానే రివార్డు ఉంది.
సుధాకర్ రివల్యూషనరీ పొలిటికల్ స్కూల్, రీజినల్ బ్యూరోలకు ఇన్చార్జిగా ఒకప్పుడు ఆంధ్రా- ఒడిశా సరి హద్దు ప్రాంతంలో (ఏవోబీ) మావోయిస్టు ఉద్యమానికి సుధాకర్ సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ కౌంటర్లలో మరణించారు.
చిక్కి పోతున్న కేంద్ర కమిటి
మావోయిస్టు కేంద్ర కమిటీలో ప్రస్తుతం 16 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 11 మంది కాగా, జార్ఖం డ్కు చెందినవారు ముగ్గురు, ఛత్తీస్గఢ్ కు చెందిన వారు ఇద్దరు న్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు మల్లోజుల వేణుగోపా లరావు అలియాస్ సోనూ, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణ పతి, మోడెం బాలకృష్ణ, పాక హన్మంతు అలియాస్ ఊకే గణేష్, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, గాజర్ల రవి అలి యాస్ ఉదయ్, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, పోతుల కల్పన. జార్ఖండ్కు చెందిన వారు మిసిర్ బెర్రీ అలి యాస్ సునీల్, అనల్ దా అలియాస్ పాతిరాం మాంజీ, సహ దేవ్ అలియాస్ అనూజ్. ఛత్తీస్గఢ్ కు చెందిన వారు మాజీదేవ్ అలియాస్ రాంధీర్, మాడ్వి హిడ్మా. వీరిలో పలువురు 60 ఏళ్లకు పైబడినవారే. కాగా, కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎవర్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తారని పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి.