TTD | తిరుచానూరులో 7 నుంచి తెప్పోత్సవాలు

ఈ నెల ఏడో తేదీ నుంచి ఐదు రోజులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.;

Byline :  The Federal
Update: 2025-06-05 11:46 GMT
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం (ఫైల్)

తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఈ నెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాల నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో ఐదు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే అమ్మవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ప్రతి సంవత్సరం నిర్ణీత ముహూర్తంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి.

ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో శ్రీవారి పట్టపురాణి శ్రీఅలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు.
తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందనేది విశ్వాసం. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలుమంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం.
తెప్పోత్సవాలు ఇలా..
జూన్ 7 మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామితో కలిసి పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తారు. రెండో రోజు శ్రీసుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీపద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు.
తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ ఏడో తేదీ రాత్రి 7.30 - 8.30 గంటల మధ్య శ్రీకృష్ణ స్వామివారు
జూన్ 8 శ్రీసుందరరాజస్వామి,
జూన్ 9 శ్రీపద్మావతీ అమ్మవారు నాలుగు మాడ వీధులలో విహరించనున్నారు.
జూన్ 10 రాత్రి 8.30 - 10 గంటల మధ్య గజ వాహనంపై, 11 తేదీ రాత్రి 8.30 - 10.00 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.
జూన్ 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరిస్తారు.

Similar News