ఆదాయపన్ను రాయితీలు ఏమిటీ, ఎలా? రేపటి నుంచే అమలు
2025-2026 ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఇచ్చిన వరాలు, పెట్టిన వాతలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.;
By : The Federal
Update: 2025-03-31 13:04 GMT
ఏప్రిల్ ఫస్ట్... 2025-2026 ఆర్ధిక సంవత్సరం మొదలవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఇచ్చిన వరాలు, పెట్టిన వాతలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.
బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, కొత్త శ్లాబులు, క్రెడిట్ కార్డు రివార్డులు, యూపీఐ సేవల నిబంధనలూ మారనున్నాయి.
ఆదాయపన్ను వివరాలు...
12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ ఉండదు. రూ.25 వేలుగా ఉన్న రిబేట్ను రూ.60 వేలకు పెంచారు.
టీడీఎస్, టీసీఎస్ మార్పులు
బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 వేల రూపాయలకు మించి వార్షిక వడ్డీ దాటితే టీడీఎస్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు.
విదేశీ చెల్లింపులు (లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్-ఎల్ఆర్ఎస్) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.10 లక్షలకు పెరిగింది.
బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని, ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదు.
క్రెడిట్ కార్డు రూల్స్
క్రెడిట్ కార్డులపై ఇక రివార్డులు ఉండవు. ఎస్బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డు, ఎయిరిండియా ఎస్బీఐ ప్లాటినమ్ కార్డు, ఎయిరిండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడనుంది.
ఎయిరిండియాలో విస్తారా విలీనం నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తారా క్రెడిట్ కార్డు రివార్డులను ఏప్రిల్ 18 నుంచి సవరించనుంది. ఆ తేదీన, లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలూ వర్తించవు.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్ అయ్యే విస్తారా కార్డులకు వార్షిక రుసుము తొలగించింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డులు (Credit card) కలిగిన వారికి అలర్ట్! ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ (SBI cards) కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్ బుకింగ్లపై లభించే రివార్డులను కుదించింది.
ఇన్ యాక్టివ్ నెంబర్లకు యూపీఐ సేవలు నిల్
ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.
వాత్సల్య స్కీంకి పన్ను మినహాయింపు...
పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం గత బడ్జెట్లో ఈ ఎన్ఎపీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రకటించారు. సెప్టెంబర్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 18 ఏళ్లలోపు మైనర్ల పేరు మీద దీన్ని తెరవొచ్చు. కనీసం రూ.1000తో మదుపు చేయొచ్చు. పిల్లల వయసు 18 ఏళ్లు దాటాక అది సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది. పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్పీఎస్ నిధిలో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పదవీ విరమణ తర్వాత పింఛను పొందేందుకు వీలవుతుంది.
యూపీఐ మోసాలకు చెక్..
ఇన్యాక్టివ్లో ఉన్న, ఇతరులకు అసైన్ చేసిన, డీయాక్టివ్ చేసిన మొబైల్ నంబర్లు బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లు తొలగిస్తాయి. ఒకవేళ అందులో మీ నంబర్ ఉంటే.. యూపీఐ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్ పంపిస్తాయి. నోటిఫికేషన్ తర్వాత కూడా నంబర్ ఇన్యాక్టివ్లోనే ఉంటే మోసాలను అరికట్టేందుకు యూపీఐ నంబర్లను బ్యాంకులు డీలిస్ట్ చేస్తాయి.
యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్లీ బ్యాంక్ అకౌంట్కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.
యులిప్స్కు ట్యాక్స్: యులిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం రూ.2.5 లక్షలు దాటితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 2025 బడ్జెట్లో ఈ మార్పును ప్రతిపాదించారు.