YCP | బెయిల్ పై వస్తా.. తరువాత యుద్ధమే
లిక్కర్ స్కాంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అంతకుముందే ఆయన వైసీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ వైరల్ గా మారింది.;
Byline : The Federal
Update: 2025-06-18 10:15 GMT
అక్రమ కేసులో అరెస్టు చేస్తారని నాకు తెలుసు అని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెల్లడించారు. ఒంగోలు, చంద్రగిరి వైసీపీ నేతలతో ఆయన నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో అనేక విషయాలు పంచుకున్నారు.
"పార్టీ బలపడుతోంది. ఎక్కడా తగ్గకండి. కార్యక్రమాల వేగం పెంచండి. నేను బెయిల్ పై బయటికి రాగానే అందరినీ కలుస్తా. ఆ తరువాత మన అడుగులు వేరే లెవెల్ లో ఉంటాయి" అని కర్తవ్యాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా తన పనితీరు మరో లెవెల్ లో ఉంటుందని నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
లిక్కర్ స్కాంలో అరెస్టు చేయడానికి ముందుగా చెవిరెడ్డి వైసీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ఆడియో తాజా విడుదల చేశారు. అందులో చెవిరెడ్డి మాట్లాడిన మాటలను పరిశీలిస్తే,
"జగనన్న సైనికులుగా అన్నిటికీ సిద్ధంగా ఉంటాం" అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ఆయన స్వరంలో కూడా చాలా మార్పు కనిపిస్తోంది.
"ప్రతి సంఘటన వ్యక్తిగత ప్రచారం కోసం చక్కగా వినియోగించుకోగలిగిన సమర్థత కలిగిన నేత" అని చెవిరెడ్డికి ఉన్న పేరు. "నిత్యం మీడియాలో కనిపించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి యత్నిస్తుంటారు" అనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి.
జెడ్పీటీసీ స్థాయి నుంచి..
చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా చెవిరెడ్డి 27 ఏళ్ల వయసులో రాజకీయ జీవితం ప్రారంభించారు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి సన్నిహితంగా మెలిగి, వైఎస్ఆర్ కుటుంబంతో సాహిత్యం పెంచుకున్నారు. ఆ పరిచయాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2007 నుంచి 2010 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Tirupati urban development authority TUDA) చైర్మన్గా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో రాజకీయ బదిలీతో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. చంద్రగిరి నుంచి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే..
ప్రచార ఆర్భాటం
మొదటినుంచి చెవిరెడ్డికి వ్యక్తగత ప్రచారం చేయించుకోవడానికి ఆసక్తి ఎక్కువ. మీడియాను సమర్థవంతంగా వాడుకుంటారు. అనేది రాజకీయ విమర్శకులు చెవిరెడ్డిపై చతురొక్తులు సంధిస్తుంటారు.
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ఆయన కొడుకు మాజీ సీఎం వైఎస్. జగన్ కు చెవిరెడ్డి చేరువయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2004 నుంచి 2014 వరకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రచార ఆర్భాటానికి అంతులేకుండా పోయింది. రాయలసీమ జిల్లాల్లో ఏ మార్గంలో వెళ్లినా గోడలు, విద్యుత్ స్తంభాలను కూడా వదలకుండా వాల్ రైటింగ్ తో చెవిరెడ్డి తన పేరిట విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో కోడ్ వల్ల ఆయనపై చిత్తూరు, కడప, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అంటే ఇక్కడ అర్థం అయ్యేది ఒకటే, చెవిరెడ్డికి ప్రచార ఆర్భాటం ఎక్కువని విమర్శకులే కాదు. వైసీపీలో కూడా సరదాగా చలోక్తులు విసురుతుంటారు. గత ఐదేళ్లలో గోడ రాతలు లేకున్నప్పటికీ, పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.
నెట్ వర్క్ లో మేటి..
2014లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నెట్ వర్క్ నిర్మించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తిరుపతిలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి గ్రామంలో వేగులను ఏర్పాటు చేసుకున్నారు. మండలానికి ఓ కోఆర్డినేటర్ నియమించుకున్నారు. రోజు వారు కార్యాలయానికి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వాలి. ఆ రిపోర్టును మదించి, వాస్తవాలు తెలుసుకునేందుకు కూడా సీనియర్ జర్నలిస్టులను కార్యాలయంలో నియమించుకున్నారు. సర్వేలు చేయించడంలో కూడా ఆయన వైఎస్. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
ఒంగోలుకు తన ప్రస్థానం మారిన తరువాత కూడా చంద్రగిరి తరహా వ్యూహమే అమలు చేశారు. గ్రామీణ స్థాయి నుంచి చిన్న నాయకుడితో కూడా నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరుతో పిలివ గలిగే జ్నాపక శక్తి ఆయనకు ఉందనడంలో అతిశేయోక్తి కాదు.
లిక్కర్ స్కాం ఏమిటి
2014 నుంచి 2024 వరకు వైసిపి అధికారంలో ఉండగా అనేక అవకతవకులు జరిగాయి. ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ఆరోపించింది. లిక్కర్ స్కాంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (special investigate you team SIt) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్ మాజీ సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, రాజ్ కసిరెడ్డి, భారతి సిమెంట్ చార్టెడ్ అకౌంటెంట్ బాలాజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారంతా మాజీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితంగా మెలిగిన వారే. అందులోనూ రాయలసీమకు చెందిన అధికారులు, నాయకులు కావడం గమనార్హం.
చిత్తూరు నేతలపై ఫోకస్
మాజీ సీఎం వైఎస్. జగన్ కోటరీలో చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అంతకుముందు నుంచే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత విశ్వాసమైన వ్యక్తిగా వైఎస్ కుటుంబంతో కలిసి పోయారు. ఇదిలావుంటే..
"లిక్కర్ స్కామ్ లో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది" అని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వారం కిందటే తిరుపతిలో మీడియా వద్ద సందేహం వ్యక్తం చేశారు. తన వెంట ఉన్న నాయకులతోపాటు గన్మెన్లు గిరి, మదన్ రెడ్డిని విచారణకు పిలవడంపై చెవిరెడ్డి అభ్యంతరం చెప్పారు.
"నోటీసు జారీ చేసి విచారణకు పిలిచిన సిట్ అధికారులు నన్ను తీవ్రంగా హింసించారు" అని పదేళ్లపాటు చెవిరెడ్డికి గర్భంగా పనిచేసిన మదన్ రెడ్డి ఆరోపించడమే కాకుండా, తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన డీజీపీకి ఏకంగా రాశారు. వారిని విచారణకు పిలవడంపై చెవిరెడ్డి ఇలా స్పందించారు.
"నేను అందుబాటులోనే ఉన్నా, అనుచరులను పీఏలను వేధించవద్దు. పిలిస్తే నేనే విచారణకు వస్తా. అరెస్టు చేసుకోండి" అని కూడా చెవిరెడ్డి సిట్ అధికారులకు సవాల్ చేసిన ధోరణిలో సూచన చేశారు. ఇదే సమయంలో తనను ఈ కేసులో ఇరికించబోతున్నారని కూడా చెవిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన ఒంగోలుకు వెళ్లారు. విజయవాడ నుంచి మంగళవారం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయంటూ, చెవిరెడ్డిని కొలంబోకు వెళ్లకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని ఏపీ పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
ఆడియో విడుదల
అరెస్టు చేయబోతున్నారనే సమాచారం అర్థమైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఒంగోలు, ఆయన కొడుకు ఓటమి చెందిన చంద్రగిరి వైసీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అందులో ఏముందంటే..
"నేను జగనన్న సైనికుడిని. జగనన్న వెంట నడిచే వారు ఎవరు కేసులకు భయపడరు" పని హెచ్చరించారు. ఈ వీడియోలో చెవిరెడ్డి మాటలు గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి పరిస్థితికి, ప్రస్తుతం ఆయన మాటల్లో ధైర్యంతో కూడిన బేలతనం కూడా కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు..
"అక్రమ కేసులు తో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం. జగనన్న వెనుక గట్టిగా ఎవరు నిలబడతారో వారందరిని భయపెట్టాలని చూస్తున్నారు" అని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమి చెప్పారంటే..
"నన్ను అరెస్టు చేయబోతుతున్నారు. పోరాటాలతో ప్రజలకు దగ్గర అయ్యాం. పోరాట స్ఫూర్తి జగనన్న నుంచి నేర్చుకున్నాం. బెదిరింపులు, కేసులకు భయపడం. పార్టీ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నియామకాలు జరుగుతున్నాయి. వైసీపీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయండి" అని చెవిరెడ్డి కర్తవ్య బోధ చేశారు. పార్టీ అనుబంధ సంఘాలు మరింత బలోపేతం కావాలి. జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు చెప్పండి అని సూచించారు.
బాబు వస్తే అరెస్టులే...
ముఖ్యమంత్రిగా ఎన్. చంద్రబాబు వస్తే అరెస్టులు చేయిస్తారని తనకు తెలుసు అని చెవిరెడ్డి గుర్తు చేశారు. "2014లో కూడా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను అరెస్టు చేయించారు జిల్లాలోని అన్ని స్టేషన్లు తిప్పుతూ కొట్టించారు" అని కూడా పార్టీ క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు.
"ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు లిక్కర్ స్కాం అంటున్నారు. అదేమిటో తెలియడం లేదు. అందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. కుట్రతోనే అరెస్టు చేయించబోతున్నారు" అని చెవిరెడ్డి గతాన్ని గుర్తు చేశారు.
బెయిల్ పై వస్తా...
నన్ను అరెస్టు చేయడం ఖాయం. తరువాత బెయిల్ పై వచ్చి, మిమ్మలను కలుస్తా అని వైసీపీ క్యాడర్ కు చెవిరెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా సాగాలి అని కర్తవ్య బోధ చేశారు. భయపడకుండా ముందుకు సాగండని క్యాడర్ కు సూచించిన చెవిరెడ్డి ఆ తరువాత వ్యవహారాలు వేరుగా ఉంటాయని చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.
తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెవిరెడ్డిపై వివిధ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దాదాపు 100 వరకు కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఇదే విషయాన్ని ఆయన సగర్వంగా చెప్పేవారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి చెవిరెడ్డి దూకుడుగా వెళతారు అని అంటుంటారు.
"అలా ఉంటేనే కార్యకర్తలకు ధైర్యం ఉంటుందన్నా" అని అనేకసార్లు చెవిరెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి సిట్ అరెస్టు చేసిన వ్యవహారం అటు ఒంగోలు ప్రాంతంలోనే కాకుండా, చంద్రగిరిలో కూడా చర్చకు దారి తీసింది. అంతకుముందు ఆయన నిర్వహించిన వైసీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ మరింతగా వైరల్ అవుతోంది.