పవన్ కల్యాణ్ ను హత్య చేయాలనే కత్తులు తెచ్చారా?

పవన్ కల్యాణ్ భీమవరం సభలో కత్తులు కలకలం రేపాయి. ఇద్దరు యువకుల దగ్గర ఉన్న కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-04-22 06:33 GMT

మొన్న చంద్రబాబుపైన రాయి.. నిన్న వైఎస్ జగన్ పై రాయి.. ఈవేళ పవన్ కల్యాణ్‌పై కత్తులు.. ఏమిటిది? ఏపీ రాజకీయాలు రక్తసిక్తం అవుతున్నాయా అంటే అవుననే అనుకోవాల్సి వస్తోంది. జగన్‌పై రాయి దాడి ఘటన ఇంకా కొలిక్కి రాకముందే ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై రాళ్లు పడ్డాయి. ఇప్పుడు ఏకంగా కత్తులే కస్సుమంటున్నాయి. తాజాగా భీమవరంలో పవన్ కల్యాణ్ సభలో కత్తులు కలకలం రేపాయి. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు విచారణలో యువకులు

వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే రాజకీయ సభలకు అధిక భద్రత కల్పిస్తున్నారు. అదే విధంగా పవన్ కల్యాణ్ భీమవరం సభకు భారీగా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సభలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి దగ్గర నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వారిని భీమవరం బలుసుమూడి, దుర్గాపురంకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వారెందుకు వచ్చారు?

పవన్ సభలో ఇద్దరు యువకులు కత్తులతో తిరుగుతుండటం అనేక సందేహాలకు తావిస్తోంది. అసలు వారెందుకు కత్తులు తీసుకువచ్చారు? వారి టార్గెట్ ఏంటి? ఎవరిపైనైనా దాడి చేయడమే లక్ష్యమా? దొంగతనాలు చేయడానికి వచ్చారా? ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే అన్ని కోణాల్లో తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్‌కు మరింత భద్రత కల్పించాలని, ఆయనను చంపే కుట్రలు జరుగుతున్నాయని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఒంటిపై చేయి వేయాలంటే తమను దాటుకుని వెళ్లాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News