‘మోసాల మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పోరాటం’.. మండిపడ్డ వైఎస్ షర్మిల

సెబీ చైర్మన్ రాజీనామా, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

Update: 2024-08-22 08:24 GMT

సెబీ చైర్మన్ రాజీనామా, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీని కాపాడుకోవడానికి ప్రధాని మోదీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, కుటిల కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను అదానీ మోసం చేస్తుంటే అందుకు మోదీ అండగా, మద్దతుగా నిలుస్తున్నారంటూ కీలక విమర్శలు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం, దేశం కోసం బ్రిటీష్ వారితో నిస్వార్థంగా పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, స్వేచ్ఛను సాధించడమే లక్ష్యంగా ప్రాణాలను పణంగా పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ఆమె చెప్పుకొచ్చారు.

అలుపెరగని సమరం

దేశం కోసం, దేశ ప్రజల కోసం, స్వరాజ్యం కోసం అలుపెరగని సుధీర్ఘ సమరం చేసి, స్వరాజ్య కలను సాకారం చేసిందని కాంగ్రెస్ పార్టీనే అని షర్మిల వ్యాఖ్యానించారు. ‘‘అటువంటి కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు మరోసారి పోరాటానికి సిద్ధమైంది. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ, ప్రజల ఆస్తులను విచక్షణారహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలను తరిమికొట్టడమే ఇప్పుడు చేస్తున్న పోరాట లక్ష్యం. దీనిని కూడా సాధించి తీరుతాం. తమ ధన దాహాన్ని తీర్చుకోవడానికి ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ఈ కార్పొరేట్ వారిని పెంచి పోషిస్తున్న, వారి చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్‌తో నడుస్తున్న మోదీ సర్కార్‌పై దేశం కోసం కాంగ్రెస్ మరోసారి పోరాటం సాగిస్తుంది’’ అని పునరుద్ఘాటించారు షర్మిల.

అదానిపై జేపీసీ వేయాలి

‘‘అదాని వంటి క్యాపిటలిస్టు రక్కసి ధోరణిని ప్రజలమీదకు రుద్దుతూ, ప్రభుత్వ సంస్థలను తన జేబుసంస్థలుగా మార్చి, కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకునే మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. అదానీ లాభాలు మోదీ లాభాలుగా, అదానీ సంస్థల వృద్ధి, బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టేశారు మోదీ. దీనిపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక, వృత్తిపరమైన బాధ్యత. ఇంత తీవ్రమైన ఆరోపణపై మౌనం వహించి, మీ కార్పొరేట్ మిత్రులను కాపాడటానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవటం ఎంతో సిగ్గుచేటు’’ అని విమర్శలు గుప్పించారామే.

మోదీ సర్కార్.. మోసాల సర్కార్

‘‘సెబీ చీఫ్ మాధబి పూరీ పై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా, అదానీ పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ, నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తూ పైపెచ్చు అటు ఆమెను, ఇటు అదానిని కాపాడే కుటిల ప్రయత్నాలను చేస్తున్న మోదీ సర్కారు దివాళాకోరుతనాన్ని నిరసిస్తూ INDIA కూటమి నేడు దేశవ్యాప్తంగా ED ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది. దేశంలోని 10 కోట్ల మంది పెట్టుబడిదారుల ఆందోళనను ఏమాత్రం పట్టించుకోకుండా, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ సర్కారును నిలదీస్తూ, మాదబీ పూరి విషయంలో వెనువెంటనే JPC వేసి, సిబిఐ, ఈడీ సమగ్ర విచారణకు ఆదేశించాలని, 140 కోట్ల ప్రజల తరపున కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది’’ అని తెలిపారు షర్మిల.

Tags:    

Similar News