పీఎంకే చీఫ్ ఎవరు?

తండ్రీ కొడుకులు ఎస్ రామదాసు, అన్బుమణి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు..;

Update: 2025-05-30 12:10 GMT
Click the Play button to listen to article

పట్టాలి మక్కల్ కట్చి(PMK) పార్టీలో తండ్రీకొడుకుల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం పార్టీ చీఫ్‌గా ఎస్ రామదాసు(S.Ramadoss) కొనసాగుతుండగా.. పార్టీ కోశాధికారిగా ఎం. తిలగబామాను తిరిగి నియమించి, తానే పార్టీ అధ్యక్షుడినన్న సంకేతాన్ని పంపాడు అన్బుమణి(Anbumani). వాస్తవానికి తిలగబామాను తొలగించి ఆమె స్థానంలో సయ్యద్ మన్సూర్‌ను రామదాస్‌ అనుకున్నారు. అయితే తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా తిలగబామాను అన్బుమణి తిరిగి నియమించడం, అన్బుమణి మద్దతుదారు మైలం ఎమ్మెల్యే ఎస్. శివకుమార్‌ను రామదాస్ పార్టీ నుంచి బహిష్కరించడంతో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌కు..

2025 ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి అన్బుమణిని తప్పించి రామదాసే పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్బుమణికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికేనని రామదాస్ చెప్పుకొచ్చారు. అయితే రామదాసు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కోశాధికారి ఎం. తిలగబామా సహా అన్బుమణి మద్దతుదారులు తప్పుబడుతున్నారు. అన్బుమణికే వారంతా మద్దతు ఇస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో రామదాస్ AIADMKతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అన్బుమణి BJP నేతృత్వంలోని NDAతో కొనసాగాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరానికి ఆజ్యం పోసిందని సమాచారం.

నేనే పార్టీ చీఫ్..

“డాక్టర్ రామదాస్ సమక్షంలో మే 28 2022న చెన్నైలో జనరల్ కౌన్సిల్ సమావేశంలో నన్ను PMK అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమావేశంలో శ్రీమతి తిలగబామ కూడా కోశాధికారిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యకర్తలంతా ఆమెకు సహకరించాలని కోరుతున్నాను.” అని చెప్పారు.

90 శాతం మద్దతు..

ఈ నేపథ్యంలో ఈ రోజు అన్బుమణి ఏర్పాటు చేసిన సమావేశానికి 23 మంది రెవెన్యూ జిల్లా అధ్యక్షులలో 22 మంది హాజరయ్యారు. ఒక అధ్యక్షుడు మాత్రం వ్యక్తిగత పనుల వల్ల హాజరుకాలేదు. దీంతో అన్బుమణికి పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే గతవారం రామదాస్ ఏర్పాటుచేసిన సమావేశానికి 80 శాతం పార్టీ నాయకులు హాజరు కాలేదు. అన్బుమణికి 90 శాతం మంది కార్యకర్తల మద్దతు ఉండడంతో ఆయనే పార్టీ చీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ బైలాస్ ప్రకారం.. ప్రతి మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో..అన్బుమణి అన్ని వర్గాల మద్దతు పొందిన తర్వాత ఈ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు.

ముకుందన్‌ నియమాకంపై అసంతృప్తి..

తన మేనల్లుడు ముకుందన్‌ను పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి నియమకంపై కూడా అన్బుమణి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 డిసెంబర్‌లో పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముకుందన్‌ను యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు రామదాస్. కీలక పదవికి తగినంత అనుభవం లేదని ముకుందన్ నియామకాన్ని అన్బుమణి బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇది కూడా తండ్రీకొడుకుల మధ్య విభేదాలకు మరో కారణం.

తండ్రీకొడుకుల మధ్య విభేదాలు మరింత ముదిరిన నేపథ్యంలో.. పీఎంకే మాజీ అధ్యక్షుడు హెచ్ రాజేంద్రన్ మధ్యవర్తిత్వం వహించారు. ఇద్దరిని రాజీ చేసే క్రమంలో ఆయన రామదాస్‌ను కలిశారు. అయితే ఫలితం బయటకు రావాల్సి ఉంది. 

Tags:    

Similar News