కేటీఆర్, కవిత.. ముఖముఖాలు చూసుకోవట్లే..!

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతున్న క్రమంలో ఈ విషయం తేటతెల్లమైంది.;

Update: 2025-06-12 08:01 GMT

కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ముదురుతున్నాయి. ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలియదు కానీ.. బయటకు మాత్రం కవిత రాసిన ఆరు పేజీల లేఖతో వచ్చాయి. అన్నాచెల్లెలు మధ్య భారీ గ్యాప్ వచ్చిందని స్పష్టమైంది. కేసీఆర్‌ దేవుడని చెప్తూనే ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే విధంగా కోవర్టుల విషయంలో కూడా కవిత, కేటీఆర్‌ల ధోరణి పూర్తి విరుద్ధంగా ఉంది. కోవర్టులను బయటకులాగాలని కవిత కోరితే.. కోవర్టులు ఉండటం కామన్ అని.. వాళ్లే బయటపడతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇలా అనేక సందర్భాల్లో కేటీఆర్, కవితకు క్షణం కూడా పడట్లేదన్న విషయం అర్థమైపోయింది. వీరిద్దరికి పార్టీ పదవుల విషయంలో చెడిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. వీరి గొడవను కేసీఆర్ పరిష్కరిస్తారని అంతా అనుకున్నారు.. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడలేదు. దీంతో కవితే యాక్షన్‌లోకి దిగి.. పార్టీ సమస్యల పేరిట కేసీఆర్‌కు లేఖ రాశారు. దాంతో పార్టీకి ఆమెకు మధ్య దూరం పెరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అన్నాచెల్లెలు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతున్న క్రమంలో ఈ విషయం తేటతెల్లమైంది.

బీఆర్కే భవన్‌కు కవిత అందుకే రాలేదా..!

కమిషన్ ముందు హాజరవడం కోసం కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. ఆ సమయంలో కవిత అక్కడే ఉన్నారు. కవితతో కేసీఆర్ కూడా పెద్దగా మాట్లాడినట్లు లేరు. ఆమె తండ్రి కేసీఆర్‌కు దూరంగా మెట్ల దగ్గర నిల్చుని ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్.. బీఆర్కే భవన్‌కు వెళ్లారు. కానీ కవిత మాత్రం అక్కడ ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ నిరసనకు పిలుపిచ్చిన నేత కవిత. కమిషన్ నోటీసులపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారామే. అలాంటిది విచారణ సమయంలో ఆమె బీఆర్కే భవన్ దగ్గరకు ఎందుకు రాలేదు. కొందరు తెలంగాణ జాగృతి నాయకులు మాత్రమే ఎందుకు కనిపించారు? అంటే అందుకు కేటీఆర్ ఉండటమే కారణమని సమాచారం. బీఆర్కే భవన్ దగ్గర కేటీఆర్ ఉన్న కారణంగానే.. కవిత అటు వెళ్లకుండా యశోధా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు.

ఫామ్ హౌస్ దగ్గర కనిపించని కేటీఆర్..

అదే విధంగా కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్‌ను పక్కనే ఉండి కేటీఆర్ తీసుకెళ్లారు. బీఆర్కే భవన్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి విచారణ ముగిసిన తర్వాత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేసీఆర్ పరామర్శించే వరకు కూడా కేటీఆర్ పక్కనే ఉన్నారు. కానీ విచారణకు కేసీఆర్ బయలుదేరడానికి ముందు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాత్రం కేటీఆర్ ఎక్కడా కనిపించలేదు. అందుకు ఫామ్‌హౌస్‌లో కవిత ఉండటమే కారణం. కవిత అక్కడ ఉన్నట్లు తెలియడంతోనే కేటీఆర్ అటువైపు కూడా వెళ్లలేదు. బీఆర్కే భవన్ దగ్గర పనులను చూసుకున్నారు.

ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్‌ను తీసుకెళ్లాల్సిన కేటీఆర్.. ఫామ్‌హౌస్‌కు కవిత వస్తున్నారన్న విషయం తెలిసి తన ఆలోచనను మార్చుకున్నారు. అదే విధంగా కవిత ఫామ్‌హౌస్‌కు వచ్చి తండ్రిని పలకరించారు. విచారణ పూర్తయ్యేవరకు తండ్రితో ఉండాలని కూడా కవిత భావించారు. కానీ విచారణ జరిగే బీఆర్కే భవన్ దగ్గర కేటీఆర్ ఉండటంతో తన ఆలోచనను విరమించుకున్నారు. తండ్రికి నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కవిత.. విచారణ జరిగే బీఆర్కే భవన్ దగ్గరకు వెళ్లలేదు. కేటీఆర్ ఉన్నారని తెలిసి అటువైపు వెళ్లకుండా.. యశోధా ఆసుపత్రికి చేరుకున్నారు. వీటిని బట్టి చూస్తే కేటీఆర్, కవిత ఇద్దరూ కూడా ఒకరి మొఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని స్పష్టం అవుతుంది. మరి కల్వకుంట్ల కుటుంబంలో ఈ ఎడమొఖం-పెడమొఖం తీరు ఇంకెన్నాళ్లు సాగుతుందో. దీనికి ఎలా ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.

Tags:    

Similar News