ట్యాపింగ్ అరాచకంలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయా ?

ట్యాపింగ్ బాధితుల విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అధికారులు మంగళవారం నుండి మొదలుపెట్టారు;

Update: 2025-06-18 06:42 GMT
Telephone tapping

లోతుల్లోకి వెళ్ళేకొద్ది బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అరాచకాలు బయటపడుతున్నాయి. ట్యాపింగ్ బాధితుల విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అధికారులు మంగళవారం నుండి మొదలుపెట్టారు. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొందరు బాధితులు సిట్ విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రత్యర్ధులుగా భావించిన వారి ఫోన్లను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిన విషయం తెలిసిందే. పట్టుబడిన పోలీసు అధికారుల వాగ్మూలాల ప్రకారం అప్పట్లో 4200 మొబైల్ ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, జర్నలిస్టులు, కొందరు జడ్జీలతో పాటు వాళ్ళ కటుంబసభ్యులు ఫోన్లు అప్పట్లో ట్యాపయ్యాయి. ట్యాపింగ్ అరాచకం ఏ స్ధాయిలో జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీలోని అనుమనిత నేతలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.

అన్నింటికన్నా విస్తుపోయే విషయాలు ఏమిటంటే ఏపీలోని నేతల ఫోన్లు కూడా ట్యాపయ్యాయన్న విషయమే. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ తో పాటు మరికొందరు తెలుగుదేశంపార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాపింగ్ అంతా అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకరరావు నాయకత్వంలోనే జరిగింది. ప్రభాకరరావు నేతృత్వంలో ప్రణీత్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, రాధాకిషన్ రావు తదితరులు ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించారు. అందుకనే సిట్ అధికారులు ప్రభాకరరావును ఏ1 నిందితుడిగా కేసు బుక్ చేసింది. పైన చెప్పిన నలుగురిని అరెస్టుచేసి విచారించినపుడు చాలా విషయాలు బయటపడ్డాయి. వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారమే తెలంగాణ కాంగ్రెస్ లోని సుమారు 700 మంది నేతల ఫోన్లు ట్యాపయ్యాయి. ఇందులో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బొమ్మ తదితరుల ఫోన్లు కూడా ఉన్నాయి.

బీజేపీ నేతల్లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు చాలామంది ఫోన్లు ట్యాపయ్యాయి. తెలంగాణ పర్యటనలకు వచ్చిన కేంద్రమంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అప్పట్లోనే ఈటల కేంద్రప్రభుత్వానికి లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు నిజమే అని ఇపుడు బయటపడుతోంది. ఈరోజు బొమ్మతో పాటు కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధనరెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు సిట్ విచారణకు హాజరయ్యారు. తమ ఫోన్లు ఏ విధంగా ట్యాప్ అయ్యాయనే విషయాలను సిట్ వీళ్ళు పూసగుచ్చినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని 14 మంది ఎంఎల్ఏ అభ్యర్ధుల ఫోన్లు ట్యాప్ అయినట్లు మహిపాల్ రెడ్డి విచారణలో తెలిపారు. ఎన్నికల్లో తమ వ్యూహాలు, ఎత్తులన్నీ బీఆర్ఎస్ నేతలకు ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నట్లు రెడ్డి మండిపోయారు.

మంగళవారం నుండి బాధితుల విచారణ, వాగ్మూలాలను తీసుకోవటాన్ని సిట్ అధికారులు మొదులుపెట్టారు. అలాగే ఈరోజు విచారణలో కీలకమైన అంశం ఏమిటంటే ప్రభాకరరావుతో పాటు అరెస్టయి, బెయిల్ మీద బయటున్న పైన చెప్పిన నలుగురు అధికారులను కూడా ముఖాముఖి కూర్చోబెట్టి సిట్ విచారిస్తోంది. ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే వీళ్ళ నలుగురు సిట్ అధికారులతో పాటు కోర్టులో అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. అయితే ట్యాపింగ్ విషయంలో ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకరరావు బుకాయిస్తున్నారు. అందుకనే మొత్తం ఐదుగురిని ఎదురెదురుగా కూర్చోబెట్టి సిట్ అధికారులు విచారిస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆధారాలను కూడా ముందుంచి ప్రభాకరరావును సిట్ విచారిస్తున్నట్లు సమాచారం. ఏపీలో కూడా ప్రత్యేకంగా వార్ రూమును ఏర్పాటుచేసి టీడీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ విషయమై సిట్ విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అరెస్టయ్ బెయిల్ మీదున్న నలుగురు పోలీసు అధికారులను, ప్రభాకరరావును ఎదురెదురుగా కూర్చోబెట్టి సిట్ అధికారులు విచారించటం ఇదే మొదటిసారి. ఈరోజు నుండి ట్యాపింగ్ బాధితులను కార్యాలయానికి పిలిపించి సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. రెండు మూడురోజుల పాటు బాదితుల వాగ్మూలాలు తీసుకోవటం తప్పదు. వాగ్మూలాలు ఇవ్వటంలో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే సిట్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రణీత్ రావు మొబైల్ డేటాలోనే 400 ఫోన్ నెంబర్లు వెలుగుచూశాయని సమాచారం. ప్రణీత్ రావు ఫోన్లోనే అన్నివందల నెంబర్లు కనబడితే మిగిలిన ముగ్గురు అధికారుల మొబైల్ ఫోన్లలో ఇంకెన్ని వందల ఫోన్లు డేటా బయటపడిందో అంతుబట్టడంలేదు. ట్యాపింగ్ బాధితుల్లో ఇతర రంగాల్లోని వాళ్ళు విచారణ ఎదుర్కొనే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఒకవేళ సిట్ అధికారులు గనుక వాగ్మూలం ఇచ్చేందుకు రమ్మని పిలిపిస్తే అప్పుడు సిట్ కార్యాలయంకు వచ్చే అవకాశాలున్నాయి. ఏదేమైనా రాబోయే మూడు, నాలుగు రోజులు ట్యాపింగ్ విచారణలో మరిన్ని విస్తుపోయే వివరాలు వెలుగుచూస్తాయనే అందరు అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News