ట్యాపింగ్ అంశంలో మహాన్యూస్ ఛానల్ పై దాడి

ఇంతమంది ఒక్కసారిగా ఆఫీసులోకి చొరబడి విధ్వంసం చేయటంతో ఉద్యోగులు భయంతో బయటకు పారిపోయారు.;

Update: 2025-06-28 10:38 GMT
Attack on MahaNews Channel

తెలంగాణలో సంచలనంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో శనివారం పెద్ద ట్విస్టు చోటుచేసుకున్నది. అదేమిటంటే ట్యాపింగ్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై వ్యతిరేక కథనాలు అందిస్తున్నదన్న కారణంగా మహాన్యూస్(Maha News) ఛానల్ ఆఫీసుపై దాడి జరిగింది. ఉదయం ఛానల్ ఆఫీసుపైన కొందరు యువకులు ఒక్కసారిగా దాడిచేశారు. ఆఫీసు ముందు ఉంచిన కార్లను ధ్వంసంచేశారు. అలాగే ఆపీసులోకి చొచ్చుకుని వెళ్ళి ఫర్నీచర్ ను కూడా నాశనంచేశారు. కుర్చీలు, సోఫాలు, టేబుళ్ళతో పాటు కెమెరాలు, లైట్లు, అద్దాలను కూడా విరగొట్టేశారు. ఇంతమంది ఒక్కసారిగా ఆఫీసులోకి చొరబడి విధ్వంసం చేయటంతో ఉద్యోగులు భయంతో బయటకు పారిపోయారు.

టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) బాధ్యులుగా మెజారిటి మీడియా వార్తలు, కథనాలను అందిస్తున్నది. కేసీఆర్, కేటీఆర్ ను ట్యాపింగ్ కేసులో అరెస్టుచేయాలని మంత్రులు, కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ చాలాసార్లు బహిరంగంగానే డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసు అధికారులతో ట్యాపింగ్ చేయించిన అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టీ ప్రభాకరరావును సిట్ అదికారులు గడచిన పదిరోజులుగా విచారిస్తున్నారు.

విచారణను ఏరోజుకారోజు కవర్ చేస్తున్న మీడియాపై ఇప్పటివరకు ఎలాంటి దాడులు జరగలేదు. అలాంటిది ఇంత సడెన్ గా మహాన్యూస్ ఛానల్ మీద ఎందుకు దాడి జరిగింది అన్నదే అర్ధంకావటంలేదు. ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆరే సూత్రదారులన్నట్లుగా మీడియాలో ఇప్పటికే అనేక వార్తలు, కథనాలు వచ్చాయి. ఎప్పుడూ చిన్న ఘటన కూడా జరగలేదు. అలాంటిది సడెన్ గా ఛానల్ ఆపీసు మీద దాడి ఎందుకు జరిగింది ? ఎందుకంటే మహాన్యూస్ ఛానల్ నూరుశాతం చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ ఛానల్ ను పెట్టిందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, టీడీపీ నేతలన్న టాక్ కూడా ఉంది.

సో, ఛాన్స్ దొరికింది కదాన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు మద్దతు ఛానల్లో ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ను బద్నాం చేస్తున్నారన్న ఆగ్రహం బహుశా బీఆర్ఎస్ పార్టీలో పెరిగిపోయిందేమో. అందుకనే ఈరోజు ఛానల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు. ఘటన విషయం తెలియగానే పోలీసులు ఆపీసుకు చేరుకున్నారు. పోలీసుల రాకతో కొందరు పారిపోగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయమై ఛానల్ సీఈవో వంశీ మాట్లాడుతు తమ మీడియాలో ప్రసారమైన కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుండటంలో తప్పులేదన్నారు. అయితే తమ అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. తమ ఆపీసు ముందు కూర్చుని నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని చెప్పారు. తమ కథనాల్లో ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ ఆఫీసుమీద దాడులు చేయటాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ముందు ముందు ట్యాపింగ్ అంశానికి సంబందించి ఇంకెన్ని హింసాత్మక ఘటనలు జరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News