కాన్సర్ రోగులకు బాలయ్యా హెచ్చరిక
బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరిట మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు.;
ప్రజలకు అభిమానులకు నటుడు బాలకృష్ణ కీలక హెచ్చరిక చేశారు. తన పేరు వినియోగించి కొందరు మోసం చేయాలన ప్రయత్నిస్తున్నారని, దానిని ఎవరూ నమ్మి మోసపోవద్దంటూ బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరిట మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘‘ప్రజలకు హెచ్చరిక!. ‘బంగారు బాలయ్య-బసవతారకం ఈవెంట్’ పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ విరాళాల సేకరణ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు. ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బసవతారకం ఆస్పత్రి తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధ్రువీకరించిన, పారదర్శక మాధ్యమాల ద్వారానే నిర్వహిస్తాం. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని బాలకృష్ణ రాసుకొచ్చారు. ఇదే విషయాన్ని బసవతారం ఆసుపత్రి యాజమాన్యం కూడా తెలిపింది.